Project Punarnika: అరుదైన జన్యు వ్యాధులతో పోరాడుతున్న చిన్నారుల పాలిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆశాకిరణంలా నిలిచింది. ఇటీవల రాష్ట్రంలో వెలుగుచూసిన ‘పునర్విక’ అనే చిన్నారి ఉదంతం మంత్రి నారా లోకేష్ను తీవ్రంగా కలిచివేసింది. ఆ పాప ఎదుర్కొన్న ఆరోగ్య సవాళ్లు, ఆ కుటుంబం పడ్డ వేదనను స్వయంగా చూసిన ఆయన, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మరే బిడ్డ కూడా సరైన వైద్యం అందక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ‘ప్రాజెక్ట్ పునర్విక’ కు శ్రీకారం చుట్టారు. కేవలం ఒక ప్రకటనతో సరిపెట్టకుండా, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ఒక సమగ్రమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
సాధారణంగా జన్యు సంబంధిత వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చు సామాన్యులకు భారంగా మారుతుంది. కొన్ని మందులు కోట్ల రూపాయల్లో ఉంటాయి. ఈ అడ్డంకిని తొలగించేందుకు మంత్రి లోకేష్ అంతర్జాతీయ ఔషధ సంస్థలతో (International Pharma Companies) నేరుగా చర్చలు జరిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రభుత్వం నేరుగా కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా చికిత్స ఖర్చులను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన భావిస్తున్నారు. అంతేకాకుండా, దీనిపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, పాలసీ పరమైన మద్దతు పొందేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
వైద్య రంగంలో ఉన్న నిపుణులు, సీనియర్ డాక్టర్లతో కలిసి త్వరలోనే ఒక ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. కేవలం చికిత్స మాత్రమే కాకుండా, అరుదైన వ్యాధులను ముందే గుర్తించడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, బాధిత కుటుంబాలకు మానసిక , ఆర్థిక భరోసా ఇచ్చేలా ఒక బలమైన ‘సపోర్ట్ సిస్టమ్’ ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. ఈ దిశగా పనులను వేగవంతం చేసేందుకు మంత్రులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ‘ప్రతి బిడ్డకు నాణ్యమైన వైద్యం అందాలి’ అనే నినాదంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ పునర్విక, రాబోయే రోజుల్లో వైద్య రంగంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతుందని ఆశించవచ్చు.
Also Read: నాడు వివేకా.. నేడు దస్తగిరి.. వైసీపీ ‘రక్త చరిత్ర’పై టీడీపీ పవర్ఫుల్ కౌంటర్!