Ambati Rambabu: గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల హోం మంత్రి అనితపై తాను చేసిన వ్యాఖ్యల దుమారంపై ఆయన స్పందిస్తూ.. తన అభిప్రాయాలను స్పష్టంగా వివరించారు. ఈ వ్యవహారంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.
MRPS నిరసనలపై అంబటి స్పందన
తన దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళనలు చేయడం ధర్మం కాదని అంబటి రాంబాబు అన్నారు. హోం మంత్రిగా అనిత పదవిని స్వీకరించినప్పటి నుంచి ఆమె శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమవుతూనే ఉన్నారని, అందుకే తాను రాజకీయంగా విమర్శలు చేశానని చెప్పారు. తాను ఎప్పుడూ ఆమెను కులం పేరుతో దూషించలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నడిరోడ్డుపై మహిళలను వివస్త్రలను చేస్తున్నారని, పోలీసుల వేధింపులు తాళలేక సామాన్య ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే నిలదీశానన్నారు.
ఎమ్మార్పీఎస్ ప్రచారంపై ఆగ్రహం
తాను మాదిగ సామాజిక వర్గాన్ని దూషించినట్లు ఎమ్మార్పీఎస్ నాయకులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, దాన్ని వారు నిరూపించాలని అంబటి సవాలు విసిరారు. హోం మంత్రి అనిత ఏ సామాజిక వర్గానికి చెందిందో కూడా తనకు తెలియదని, ఆమెతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలను రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప, ఇలా కులాలను ఆపాదించడం సరికాదని హితవు పలికారు.
మందకృష్ణ మాదిగపై గౌరవం.. అనితకు సారీ లేదు!
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, ఆయన ఒక పోరాట యోధుడని అంబటి కొనియాడారు. ‘నేనన్న మాటల్లో తప్పు ఉందని మందకృష్ణ గారు చెప్తే, ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయని అనిపిస్తే ఆయనకు క్షమాపణ చెబుతాను. కానీ హోం మంత్రి అనితకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణ చెప్పేది లేదు’ అని తేల్చిచెప్పారు. ఎమ్మార్పీఎస్ నాయకులు నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి చర్యలకు పాల్పడటం తగదని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read: రూ. 1,400 కోట్ల లెక్కలు చెప్పి మాట్లాడు.. హరీష్రావును ఉతికి ఆరేసిన ఉత్తమ్!