Reliance Data Center:గూగుల్ సంస్థ విశాఖలో ఒక లక్ష రూ.34 వేల కోట్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ను నెలకొల్పుతున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ బాటలో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ కూడా విశాఖలోనే రూ.98,000 కోట్లతో 1 గిగా వాట్ సామర్థ్యంతో అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
ఏపీలో మరో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. వైజాగ్లో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ను నిర్మించడానికి రిలయన్స్-జేవీ డిజిటల్ కనెక్షన్ రూ.98 వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని ట్వీట్ చేశారు. ఈ మెగా ప్రాజెక్ట్తో విశాఖ నగరం ఇండియా డేటా క్యాపిటల్ గా ఆవిర్భవించబోతోందని అన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్ ఫీల్డ్ సంస్థల జాయింట్ వెంచర్ అయిన జేవీ డిజిటల్ కనెక్షన్ సంస్థ ఈ డేటా సెంటర్ ను వైజాగ్ లో ఏర్పాటు చేయబోతోంది. విశాఖలో 400 ఎకరాల్లో తమ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు తాజాగా జేవీ డిజిటల్ సంస్థ వెల్లడించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్ఫీల్డ్, అమెరికాకు చెందిన డిజిటల్ రియాలిటీల జాయింట్ వెంచర్-2030 నాటికి విశాఖపట్నంలో 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్లను నిర్మించడానికి 11 బిలియన్ (రూ. 98,000 కోట్లు) డాలర్ల పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. 400 ఎకరాల్లో డేటా సెంటర్ ను అభివృద్ధి చేయనున్నారు. భారీ స్థాయిలో ఏఐ టెక్నాలజీని రూపొందించనున్నారు. ఈ పెట్టుబడి ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డుతో డిజిటల్ కనెక్షన్ అవగాహన ఒప్పందం (MoU) చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ రాకతో ఏపీ ఏఐ, క్లౌడ్ హబ్గా మారనుంది.
Also Read: Guntur News: లేడీ డాక్టర్లు డ్రెస్ మార్చుకుంటుండగా.. ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్, చివరకు?
కొత్త డేటా సెంటర్ పార్కులు ఏఐ కోసం పూర్తిగా ఆప్టిమైజ్ చేస్తున్నారు. హైపర్స్కేలర్లు, పెద్ద సంస్థల పనితీరును సులభం చేసేందుకు పటిష్ట వ్యవస్థలు, సబ్స్టేషన్లు, పవర్ ఫీడ్లను అనుసంధానిస్తారు. పరిశ్రమలలో ఏఐ స్వీకరణను వేగవంతం చేయడంతో పాటు రాబోయే దశాబ్దంలో భారీగా ఏఐ వినియోగం పెంచాలని ఈ పాజెక్ట్ లక్ష్యం. డిజిటల్ కనెక్షన్ ఇప్పటికే చెన్నైలో ఒక పెద్ద క్యాంపస్ను ఏర్పాటు చేసింది. డిజిటల్ కారిడార్లలో తమ కంపెనీ విస్తరణలో భాగంగా విశాఖలో డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది.