Minister Uttam Kumar Reddy: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్ రోడ్డుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలు పెట్టిన పని ఇవాళ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రూ.28 కోట్లతో రింగ్ రోడ్డు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రూ.8 కోట్లతో ఏర్పాటు చేస్తున్న డిగ్రీ కాలేజీ, రూ.4.5 కోట్లతో జూనియర్ కాలేజీల పనులు పూర్తి కావచ్చాయని పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం లోపే ఈ కాలేజీలు ప్రారంభిస్తామని చెప్పారు. నూతనంగా రూ.7.5 కోట్లతో ఆర్&బి బిల్డింగ్, షాపింగ్ కాంప్లెక్స్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశరు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని స్థానాలు గెలుపొందేలా కృషి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
మక్తల్ మండలంలోని జూరాల బ్యాక్ వాటర్ లో ముంపునకు గురైన అనుగొండ, అంకెన్ పల్లి, దాధనన్ పల్లి, పారేవుల, సంగంబండ రిజర్వాయర్ లో నేరేడుగొమ్ము, భూత్పూర్ ముంపు గ్రామాల పరిస్థితిని ఏరియల్ సర్వే ద్వారా గమనించానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముంపునకు గురైన గ్రామాల్లో దేవాలయాల పునరుద్ధరణ, ఇళ్లు కోల్పోయిన వారికి న్యాయం చేస్తానన్నారు. ముంపు ప్రాంత పరిస్థితిని మంత్రి వాకిటి శ్రీహరి తన దృష్టికి తీసుకొచ్చేవారన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులు వినియోగించుకోవడానికి ఎత్తిపోతల పథకాలు, చెక్ డ్యామ్ లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు.
పేద విద్యార్థులకు కార్పొరేట్ చదువులు అందించేలా ఇంటిగ్రేటేడ్ స్కూల్, సంగంబండల కాల్వ పనులు, మక్తల్-నారాయణ పేటకు రూ.200 కోట్లతో రెండు వరుసల రోడ్లు ప్రతీ మండలంలో ఆట స్థలాలు, ఇంటర్ కాలేజీలు ప్రారంభించామన్నారు. కృష్ణానదిపై కొత్త బ్రిడ్జి పూర్తి అయ్యాక పాత బ్రిడ్జిని చెక్ డ్యామ్ గా మార్చితే రెండు టీఎంసీల నీటిని నిలువ చేసుకోవచ్చన్నారు. నాలుగు భారీ చెక్ డ్యామ్ లు నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. సంగంబండ రిజర్వాయర్ కుడి, ఎడమ మెయిన్ లోయెస్ట్ కాలువలకు లైనింగ్ పనులు చేపట్టి సాగునీరు అందిస్తామన్నారు.