Manduva Logili House: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండగ అంటే పెద్ద పండగ అంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. వ్యవసాయ ఆధారిత రైతు కుటుంబాలు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉంటాయి. పంట చేతికి వచ్చి కుటుంబమంతా సందడిగా జరుపుకునే ఒకే ఒక పండుగ సంక్రాంతి.. అలాంటి సంక్రాంతికి మన తూర్పుగోదావరి జిల్లాలో.. నెలరోజులు ముందు నుంచే హడావిడి మొదలైపోతుంది. గోదావరి జిల్లాలో ఎక్కువగా కనిపించేది మండవ లోగిలి ఇళ్లు. ఇప్పుడంటే ఒకదానిపై మరొకటిగా అపార్ట్ మెంట్లు వచ్చేశాయ్ గానీ ఆనాడు మన వాళ్లు ఆరేడు కుటుంబాలు ఒకే లోగిలిలో ఉండేలా నిర్మించినవే మండువ లోగిలి ఇళ్లు. అందరూ కలిసి ఒకటే మండువాలో, ఒకటే లోగిలి కలిగి ఉండే ఇంటినే మండవ లోగిలి ఇల్లుగా పిలుస్తారు..
అయితే చిన్నప్పుడు ఇదే మండవలోగిల్లో స్తంభాలాటాడిన ఆ పిల్లలు.. ఈ సంక్రాంతికి వస్తారని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న అమ్మా నాన్నలు, అత్త మామయ్యలు, పిన్ని బాబాయిలు.. ఇలా రకరకాల పిలుపులతో పలకరించే బంధువులు ఆత్మీయ సమ్మేళనం.. మండువ లోగిలి ఇళ్లలోనే చూడగలుగుతాం.. వచ్చి రాగానే ఇల్లంతా సందడి చేస్తూ ఇంట్లో అల్లరి చేస్తూ ఆటలాడుతూ.. పాటల పాడుతూ.. డాన్సులు చేస్తూ.. భోగి రోజు ఉదయాన్నే ఐదు గంటలకి లేచి భోగి మంటలు వేస్తూ.. పిల్లలు చేసే ఆ సందడి కోసం.. ఈ ఇంటిల్లపాది మాత్రమే కాదు ఈ మండువా లోగిలి ఇళ్లు కూడా ఎదురు చూస్తాయంటే అతిశయోక్తి కాదేమో.
ఈ మండువా ఇళ్లలోకి అడుగుపెట్టగానే.. ముందుగా కనిపించేది పందిరి మంచం. కళ్ళు చెదిరిపోయేలా అలనాటి అందమైన మంచాన్ని చూస్తుంటే ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. అలాంటి పందిరి మంచం మీద సేదదీరాలని.. ఎవరికైనా అనిపిస్తుంది. మండువాలోకి ఇళ్లలో పందిరి మంచం ఒక ప్రత్యేక అధ్యాయంగా చెప్పాల్సి ఉంటుంది..
ఆస్ట్రేలియా- అమెరికా- హైదరాబాద్- చెన్నై- బెంగళూరు గోదావరి జిల్లాల నుంచి.. ఎక్కడికి వెళ్లి పని చేసే వారైనా సరే.. సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఈ మండువ లోగిలి అనుభవాలే. ఈ లోగిలిలో బంధువులంతా కలిసి ఆప్యాయంగా వండే ఆ పిండి వంటల కోసం రాష్ట్రాలే కాదు.. ఖండాంతరాలు దాటి అయినా సరే వచ్చేయాలనిపిస్తుంది. ఈ ఇంటికి వచ్చి కమ్మటి పిండి వంటలు తినాలని మనసు ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. ఇక్కడి వారు చూపించే ప్రేమ, ఆప్యాయతల మధ్య సంక్రాంతి పండగ జరుపుకోవాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరూ..
Also Read: అక్క భర్తతో చెల్లి ఎఫైర్.. నడిరోడ్డుపై అక్కను తమ్ముడు ఎంత ఘోరంగా చంపాడంటే!
ఆ పచ్చని పల్లెటూరులో అచ్చమైన ఆప్యాయతల మధ్య పక్కింటి పలకరింపుల నడుమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మళ్లీ సంక్రాంతి వరకు గుర్తుండిపోయే జ్ఞాపకాలను నింపుకోవడానికి ఇతర రాష్ట్రాల నుండి దేశాల నుండి వస్తున్న ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్న పల్లెటూరులోని మండవలోగిలి ఇంటి కథే ఇది!