Guntur Woman Assault: గుంటూరు నగరంలో మానవత్వాన్ని మంటగలిపే ఒక అమానవీయ ఘటన వెలుగుచూసింది. కేవలం ఇంటి బోరు బావి విషయంలో వచ్చిన ఓ చిన్న వివాదానికి, ఒక మహిళపై హిజ్రాలను ఉసిగొల్పి దాడి చేయించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు , మహిళా కమిషన్ అత్యంత వేగంగా స్పందించాయి.
అసలేం జరిగింది?
గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో ఓ ఇంటి బోరు బావి విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు మల్లెల మూర్తి అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. తన అనుచరులైన హిజ్రాలను పిలిపించి, ఒక మహిళపై దాడి చేయించాడు. ఆ హిజ్రాలు మూర్తి ఆదేశాలతో సదరు మహిళపై భౌతికంగా దాడి చేయడమే కాకుండా, ఆమె చీర లాగి తీవ్రంగా అవమానించారు.
స్పందించిన నగరంపాలెం పోలీసులు..
ఈ అమానవీయ ఘటనపై సమాచారం అందుకున్న నగరంపాలెం పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. ప్రధాన సూత్రధారి మల్లెల మూర్తితో పాటు దాడికి పాల్పడిన హిజ్రాలపై కేసులు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి..
ఈ ఘటనపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై ఇలాంటి అనాగరిక దాడికి పాల్పడిన మల్లెల మూర్తిని తక్షణమే తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నేరస్థులకు పార్టీ అండ ఉండబోదని ఆమె స్పష్టం చేశారు.
తీవ్రంగా కలచివేసింది.. మంత్రి నారా లోకేష్..
ఈ ఘటనపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్/మీడియా ద్వారా స్పందించారు. ‘గుంటూరులో జరిగిన ఈ దారుణ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. మహిళల జోలికి వచ్చే వారికి ఇదే మా హెచ్చరిక. సీఎం చంద్రబాబు గారు ఇప్పటికే కఠిన చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని పార్టీలోని అన్ని పదవుల నుండి తక్షణమే పక్కన పెడుతున్నాం’ అని లోకేష్ స్పష్టం చేశారు.
Also Read: చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన ‘విక్రమ్ – 1’.. నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్!
హోంమంత్రి అనిత సీరియస్.. పోలీసులపైనా యాక్షన్!
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ ఉదంతంపై తీవ్రంగా మండిపడ్డారు. గుంటూరు జిల్లా ఎస్పీతో స్వయంగా మాట్లాడి వివరాలు సేకరించారు. పార్టీల ముసుగులో నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా, ఈ కేసు విచారణలో మొదట నిర్లక్ష్యం వహించిన స్థానిక పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించడం గమనార్హం.
ఆరా తీసిన ఏపీ మహిళా కమిషన్..
ఏపీ మహిళా కమిషన్ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి, సీరియస్గా తీసుకుంది. బాధితురాలికి సంపూర్ణ న్యాయం జరగాలని, నిందితులకు కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చూడాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అధికారులను ఆదేశించారు. కమిషన్ తరఫున బాధితురాలికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో సొంత పార్టీ నాయకుడే తప్పు చేసినా వెనకేసుకు రాకుండా.. తక్షణమే సస్పెండ్ చేసి, అరెస్ట్ చేయించడం ద్వారా ‘మహిళల జోలికి వస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు’ అనే బలమైన సందేశాన్ని ప్రభుత్వం పంపినట్లయింది.
సీఎం చంద్రబాబు యాక్సన్..
గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై జరిగిన దాడి నన్ను తీవ్రంగా కలచివేసిందని సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల భద్రతకు భంగం కలిగిస్తే ఎంతటివారైనా సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు, పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని, రాష్ట్రంలో మహిళల గౌరవానికి, రక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం భరోసానిచ్చారు.
Also Read: కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!