AP MLA-MLC Sports: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రెండు రోజుల పాటు ఆటల పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఈ నెల 18న (మంగళవారం) నుంచి ఆటలు ప్రారంభం కానున్నాయి.
నేతల ఆటల సందడి
మొత్తం 12 రకాల గేమ్స్ నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి రెండురోజులపాటు ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆటల పోటీలు మొదలుకానున్నాయి. ఈ పోటీలకు చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆసక్తి చూపారు. మొత్తం 173 మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. శాసన, మండలి సభ్యులు రెండు, మూడు రకాల ఆటలు ఆడతామని పేర్లు ఇచ్చారు.
క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, క్యారమ్స్, కబడ్డీ, త్రోబాల్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్ (రన్నింగ్, షాట్పుట్) అందులో ఉండనున్నాయి. సభ్యులకు డ్రెస్ కోడ్తోపాటు విజేతలకు బహుమతులు సైతం అందిస్తారు. ఈ పోటీల కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సైతం పేరు నమోదు చేయించుకోవడం విశేషం.
12 రకాల గేమ్స్
క్రికెట్ కోసం మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. ఎమ్మెల్యేలు గణబాబు, యార్లగడ్డ వెంకట్రావు, ఎంఎస్ రాజు, విష్ణుకుమార్రాజులు ఈ జాబితాలో ఉన్నారు. బ్యాడ్మింటన్, వాలీబాల్ పోటీలకు దాదాపు 25 మంది పేర్లు ఇచ్చారు.
ALSO READ: జనసేనను మత సేనగా మార్చారు
బ్యాడ్మింటన్ కోసం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, వాసంశెట్టి సుభాష్తో పాటుగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, జనసేన ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయకుమార్ ఉన్నారు. వాలీబాల్ కోసం డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పార్టిసిపేట్ చేయనున్నారు.
మంత్రి లోకేష్ మూడు ఆటలు ఆడనున్నారు. వాటిలో క్రికెట్, వాలీబాల్, షటిల్ వంటి క్రీడలు ఉన్నాయి. మరో మంత్రి అచ్చెన్నాయుడు త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, క్రికెట్, వాలీబాల్, షటిల్ పోటీలకు తమ పేరు ఇచ్చారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి షటిల్, టెన్నికాయిట్, త్రోబాల్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్కోసం పేరు నమోదు చేయించుకున్నారు. ఒక్క క్రికెట్ కోసం ఏకంగా 31మంది పేర్లు నమోదు చేసుకోవడం విశేషం.
మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. టగ్ ఆఫ్ వార్, 100 మీటర్ల రన్నింగ్, బ్యాడ్మింటన్, క్యారమ్స్, టెన్నిస్, టెన్నికాయిట్, త్రోబాల్, షాట్పుట్ వాటిలో ఉన్నారు. మంత్రులు అనిత, సంధ్యారాణి షాట్పుట్, షటిల్ బ్యాడ్మింటన్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్లో తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు.
మహిళలు సైతం
మరో మంత్రి సవిత టెన్నికాయిట్, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్ కోసం తమ పేరు ఇచ్చారు. ఎమ్మెల్యేలు పరిటాల సునీత, గౌరు చరితారెడ్డి, గౌతు శిరీషలు క్యారమ్స్లో తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. 100 మీటర్ల రన్నింగ్, త్రోబాల్లో వైసీపీ ఎమ్మెల్సీలు మాధవరావు, రవీంద్రనాథ్ పేర్లను నమోదు చేసుకున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి 100 మీటర్ల పరుగు పందెంలో తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం-డీఆర్ఆర్ఎంసీ ఇండోర్ స్టేడియాలను ఈ పోటీల కోసం సిద్ధం చేశారు.
చీఫ్ విప్ ఏమన్నారు?
ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు సభ్యుల ఆటల పోటీలపై మాట్లాడారు. మంగళవారం నుంచి రెండురోజుల పాటు ఆటల పోటీలు జరుగుతాయన్నారు. గత టీడీపీ పాలనలో ఈ పోటీలు నిర్వహించారని, సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు మళ్లీ వీటిని పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. ఒత్తిడి నుండి క్రీడలు ఉపశమనం కలిగిస్తాయని నొక్కి చెప్పారు.
ప్రతి నియోజకవర్గంలో స్టేడియాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక వేసిందని గుర్తు చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు పోటీల్లో పాల్గొంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆటలు ముగిసిన తర్వాత మార్చి 20న విందు భోజనం ఉంటుందని, విజేతలకు అవార్డుల ప్రదానోత్సవం చేస్తారన్నారు.