Water Dogs Attack: శ్రీశైలం పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు భయాందోళన నెలకొంది. ఇటీవల అక్కడ నీటి కుక్కల దాడులు పెరిగిపోతుండటంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా ఘటనలో పాతాళ గంగలో స్నానాలు చేస్తున్న ఐదుగురు భక్తులపై నీటి కుక్కలు అకస్మాత్తుగా దాడి చేసి గాయపరిచినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకుని నీటిలోకి లాగేందుకు కూడా ప్రయత్నించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
హైదరాబాద్కు చెందిన భక్తులు ఉదయం పాతాళ గంగ వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా.. ఒక్కసారిగా నీటిలో నుంచి రెండు నీటి కుక్కలు బయటకు వచ్చి భక్తులపై దాడి చేశాయని వారు చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో పాతాళ గంగ వద్ద నీటి కుక్కల సంచారం ఎక్కువవుతోందని, అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. స్థానికంగా పాతాళ గంగ పవిత్ర స్నానాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అమావాస్య, పౌర్ణమి, శ్రావణ మాసం వంటి ప్రత్యేక రోజుల్లో వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఇలాంటి సమయంలో నీటి కుక్కల బెడద ఉండటం భక్తుల భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారుతోంది.
Also Read: రైల్వే స్టేషన్లో భారీ శబ్ధంతో బాంబు పేలుడు.. ఘటనపై ఎస్పీ క్లారిటీ
ఈ ఘటనపై స్పందించిన కొందరు స్థానికులు కూడా అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నీటి కుక్కలను నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, నదీ తీర ప్రాంతాన్ని కంచెతో ఏర్పాటు చేయాలని వారు సూచిస్తున్నారు. అదేవిధంగా పాతాళ గంగ వద్ద భద్రతా ఏర్పాట్లు చేయాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.