Kothagudem Railway Station: కొత్తగూడెం రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్ఫామ్పై ఓ సంచిలో పోలీసులు బాంబును కనుగొన్నారు. అయితే.. సంచిని వదిలివెళ్లినవారిని గుర్తించేందుకు స్టేషన్ సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు చెక్ చేస్తున్నారు.. రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్ఫామ్పై ఓ సంచిలో బాంబు ఉన్నట్టు తేలింది. ఓ వీధికుక్క ఆ సంచిని కొరకడంతో బాంబు పేలింది. భారీ శబ్ధంతో పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి ఈ వీధికుక్క చనిపోయింది. ఈ పేలుడు శబ్ధానికి ప్రయాణీకులు ఒక్కసారిగా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ఇంకా ఏమైనా బాంబులు ఉన్నాయా? అనే కోణంలో ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయి.
ఘటనపై ఎస్పీ క్లారిటీ..
కొత్తగూడెం రైల్వేస్టేషన్ ప్రాంగణంలో నాటు బాంబు పేలిన ఘటనపై ఎస్పీ రోహిత్ రాజు స్పష్టతనిచ్చారు. పేలింది అడవి జంతువులను వేటాడడానికి ఉపయోగించే నాటు బాంబులని ఆయన ప్రకటించారు. ఒక కుక్క రైల్వే ట్రాక్ సమీపంలో పడి ఉన్న నాటు బాంబుల సంచిని తీసుకువచ్చిందని ఎస్పీ తెలిపారు. అందులోని బాంబును కుక్క కొరకడం వలన అది పేలి అక్కడికక్కడే మృతి చెందిందని వివరించారు. ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దని ప్రజలను కోరారు.
ఎలాంటి భయాందోళన వద్దు..
నాటు బాంబులను రైల్వే స్టేషన్ పరిసరాల్లోని చెత్తలో పడేసిన వ్యక్తుల కోసం దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. ఈ విషయంలో స్థానికులు భయాందోళన చెందవద్దని.. దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు.
ALSO READ: Skincare Routine: చలికాలంలో ఈ 6 టిప్స్ పాటిస్తే.. రెట్టింపు అందం మీ సొంతం