Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక. అక్టోబర్ నెల బ్రహ్మోత్సవాల సీజన్ కావడంతో శ్రీవారి దర్శనం కోటా విడుదల తేదీల వివరాలను వెల్లడించింది టీటీడీ. ఈనెల అంటే జూలై 24న ఉదయం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనుంది. ఆర్జిత సేవా టికెట్లను అధికారిక వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని భక్తులకు సూచన చేసింది.
తిరుమల భక్తులకు గమనిక-తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతీ రోజూ వేలల్లో భక్తులు తరలి వస్తున్నారు. వీకెండ్ కూడా అదే పరిస్థితి. స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. దసరా నెల అక్టోబర్కు సంబంధించి శ్రీవారి దర్శనం కోటా వివరాలను వెల్లడించింది టీటీడీ.
అక్టోబర్ దర్శనం కోటా విడుదల-అక్టోబర్లో వివిధ దర్శనాలు, గదుల కోటా వివరాలను తెలియజేసింది. స్వామి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్ ద్వారా టికెట్లు విడుదల చేయనుంది. ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఈ-టికెట్లు పొందిన భక్తులు జూలై 20-22 మధ్య మధ్యాహ్నం 12 గంటల వరకు సొమ్ము చెల్లించేందుకు సమయం ఉంటుంది.
బ్రహ్మోత్సవాల సీజన్-జూలై 21న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది. ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఇక వర్చువల్ సేవకు సంబంధించి దర్శన స్లాట్ల కోటాను జూలై 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ ద్వారా విడుదల చేయనుంది.
అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను జూలై 23 ఉదయం 10 గంటలకు ఇవ్వనుంది. ఇక శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను అదే రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ. వృద్ధులు-దివ్యాంగుల దర్శనానికి ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను జూలై 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ ద్వారా విడుదల చేయనుంది. దసరా సీజన్ కావడంతో భక్తులు ముందుగా సేవల టికెట్లను పొందేందుకు ఇదే సరైన సమయం.
ALSO READ: వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్!
జూలై 24న ఉదయం 10 గంటలకు రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల-తిరుపతి-తలకోన ప్రాంతాల్లో రూముల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తుంది. శ్రీవారి దర్శనం, గదుల కోటా ఆన్ లైన్ బుకింగ్ కోసం అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in సందర్శించాలని భక్తులను టీటీడీ కోరింది.
మంగళ, శుక్రవారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు-మరోవైపు తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులను అలర్ట్ చేసింది టీటీడీ. జూలై నెలలో రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 14, 17 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ముందు రోజు జులై 13, జులై 16న సిఫార్సు లేఖలను తీసుకోరు.