Bangkok fire: థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో ఆదివారం అర్ధరాత్రి ఊహించని పెను విషాదం చోటుచేసుకుంది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ‘నా లాడ్ప్రావ్’ పబ్లో ఒక్కసారిగా చెలరేగిన భారీ అగ్నిప్రమాదం కనీసం 27 మంది ప్రాణాలను బలి తీసుకుంది. వీకెండ్ మూడ్లో పాటలు, డ్యాన్స్లతో ఎంజాయ్ చేస్తున్న యువతపై మృత్యువు నిప్పుల రూపంలో విరుచుకుపడింది. ఈ ప్రమాదంలో మరో 63 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో 22 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పబ్ ప్రవేశ ద్వారం వద్దే మంటలు మొదలుకావడంతో లోపల ఉన్నవారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దిక్కుతోచని స్థితిలో పరుగులు తీశారు.
క్షణాల్లో వ్యాపించిన పొగ.. బాత్రూమ్లలోనే అంతమైన ప్రాణాలు!
ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి దాదాపు 30 నిమిషాల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన బ్యాంకాక్ గవర్నర్ చాడ్చార్ట్ సిట్టిపంత్ మీడియాతో మాట్లాడుతూ.. పబ్ లోపల ఉన్న రసాయన పదార్థాల వల్ల మంటలు వేగంగా పైకప్పు వరకు వ్యాపించాయని, క్షణాల్లో భవనమంతా దట్టమైన పొగ కమ్ముకుందని తెలిపారు. కళ్లు బైర్లు కమ్మే చీకటి, ఊపిరాడకపోవడమే ఎక్కువ మంది మరణించడానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి పబ్ వెనుక వైపున్న రెస్ట్రూమ్లలోకి వెళ్లిన చాలా మంది అక్కడే ఊపిరాడక శవాలుగా మారడం అందరినీ కలచివేస్తోంది.
షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదమా?
ఈ ఘోర ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో విచారణ జరుపుతుండగా, అక్కడ ఉన్న కొందరు ప్రత్యక్ష సాక్షులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు స్టేజ్ పక్కన ఉన్న సర్క్యూట్ బ్రేకర్ నుండి పొగలు రావడం చూశానని, ఆ వెంటనే పెద్ద శబ్దంతో పేలుడు సంభవించిందని అక్కడ ఉన్న ఒక మ్యూజీషియన్ స్వయంగా థాయ్లాండ్ ప్రధాని అనుతిన్ చార్న్విరాకుల్కు వివరించాడు. పేలుడు సంభవించిన వెంటనే పబ్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంతా చీకటిమయమైందని, కనీసం బయటకు వెళ్లే దారి కూడా కనిపించలేదని స్థానిక గాయని సుకన్య వాంగ్వాంగ్వాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆమె బ్యాండ్కు చెందిన ఒకరు మరణించగా, మరొకరి ఆచూకీ ఇంకా లభించలేదు.
నిబంధనల ఉల్లంఘనే శాపమైందా?
ఈ పెను ప్రమాదం వెనుక భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడాల్సిన ఫైర్ ఎగ్జిట్ వద్ద కొన్ని అడ్డంకులు ఉండటం వల్ల, లోపల చిక్కుకున్న వారు సకాలంలో బయటకు రాలేకపోయారని తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని సందర్శించిన ప్రధానమంత్రి అనుతిన్ చార్న్విరాకుల్ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తూ, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పబ్ యాజమాన్యం నిబంధనలను బేఖాతరు చేయడం వల్లే ఇంత పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: నేను ఆత్మహత్య చేసుకుంటా.. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎందుకు అలా అన్నారు?
బ్యాంకాక్ పబ్లో భారీ అగ్నిప్రమాదం.. 27 మంది మృతి..
థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
ఓ పబ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటనలో 27 మంది ఊపిరాడక, గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న ప్రధాన మంత్రి అనుతిన్ చార్న్విరాకుల్ స్వయంగా… pic.twitter.com/lrKVuj0yNh
— ChotaNews App (@ChotaNewsApp) July 12, 2026