Tirumala: టీటీడీ పాలక మండలి వైకుంఠ ద్వార దర్శనాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ ఏడాది సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ.. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను నిర్వహించనున్నట్లు టీటీడీ బోర్డు ప్రకటించింది.
ఈ డిసెంబర్ 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు మొత్తం పది రోజుల పాటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయి. దీంట్లో భాగంగానే 182 గంటల దర్శన సమయంలో.. సామాన్య భక్తుల కోసం ఏకంగా 164 గంటల సమయాన్ని కేటాయించడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా సామాన్య భక్తులకు ఎంతో మేలు జరుగుతుందని టీటీడీ వెల్లడించింది.
1. మొదటి మూడు రోజులకు ‘ఈ-డిప్‘ ద్వారా కేటాయింపు:
వైకుంఠ ద్వార దర్శనాల్లో అధిక రద్దీ ఉండే మొదటి మూడు రోజులు (డిసెంబర్ 30, 31, జనవరి 1) రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శన టిక్కెట్లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మూడు రోజులకు సంబంధించిన దర్శన టోకెన్లను పూర్తిగా ఈ-డిప్ (E-Dip) విధానం ద్వారానే పారదర్శకంగా కేటాయించనున్నారు.
రిజిస్ట్రేషన్కు అవకాశం: నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు భక్తులు దర్శన టోకెన్ల కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఎంపిక: డిసెంబర్ 2వ తేదీన నిర్వహించే డిప్ (లక్కీ డ్రా) ద్వారా ఎంపికైన భక్తులకు టోకెన్లను కేటాయిస్తారు.
పారదర్శకత: టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లకు, టోకెన్ల జారీకి అవకాశం కల్పించారు.
2. మిగిలిన ఏడు రోజులకు రెగ్యులర్ కేటాయింపు:
జనవరి 2వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు మిగిలిన ఏడు రోజులకు దర్శన టోకెన్లను రెగ్యులర్ పద్ధతిలో కేటాయించనున్నారు. రూ.300 దర్శన టిక్కెట్లు ఈ ఏడు రోజులలో రోజుకు 15,000 చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను ఆన్లైన్లో జారీ చేస్తారు. అంతే కాకుండా శ్రీవాణి టిక్కెట్లు రోజుకు 1,000 చొప్పున రెగ్యులర్ విధానంలో ఆన్లైన్లో కేటాయిస్తారు.
3. స్థానికులకు ప్రత్యేక కోటా:
జనవరి 6, 7, 8 తేదీల్లో తిరుమల, తిరుపతి స్థానికుల కోసం రోజుకు 5,000 టోకెన్లను ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ఈ టోకెన్లను కూడా ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందుగా కేటాయిస్తారు.
4. ప్రివిలేజ్ దర్శనాల రద్దు:
పది రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులు మినహా.. వీఐపీ బ్రేక్ దర్శనం సహా మిగిలిన అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీనివల్ల సామాన్య భక్తులకు దర్శనం అయ్యే సమయం మరింత పెరుగుతుందని బోర్డు తెలిపింది. ఇదిలా ఉంటే.. సామాన్య భక్తులకు అత్యధిక ప్రయోజనం చేకూర్చేలా టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.