Tragedy in Jangareddygudem : విహారయాత్ర తీరని విషాదాన్ని మిగిల్చింది. వాగులో గల్లంతై ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని అశ్వరావుపేట మండలం ఉట్లపల్లి, జీలుగుమిల్లి మండలం దిబ్బగూడెంకు చెందిన రెండు కుటుంబాల్లోని ఐదుగురు.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని జల్లేరు వాగు వద్దకు విహారయాత్రకు వచ్చారు.
జల్లేరు వాగుకు వచ్చిన వారిలో ఒక బాలుడు వాగులో స్నానానికి దిగాడు. అతనితో పాటు దిగిన మరో ఇద్దరు ఈత రాకపోవడంతో గల్లంతై మృతి చెందారు. మృతులు రేష్మ (24), మొహిషాద్ (23), హసద్ (14) లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపి.. ఘటనపై కేసు నమోదు చేశారు. ముగ్గురి మృతదేహాలకు జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం తర్వాత.. కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.