Satysai News: శ్రీ సత్య సాయి జిల్లాలో విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెనుకొండ పట్టణానికి చెందిన గంగాధర్ (46) ఖర్జూరం తింటుండగా గింజ పొరపాటున గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో గంగాధర్ ఊపిరాడక ఇబ్బందిపడ్డాడు. ఖర్జూరపు విత్తనం గొంతులో ఇరుక్కుపోయి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడిన గంగాధర్ ను కుటుంబ సభ్యులు హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ పరిస్థితి మెరుగుపడకపోవడంతో.. మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గంగాధర్ పరిస్థితి విషమించింది. వైద్యులు అనంతపురం తీసుకెళ్లాలని సూచించారు. అయితే మార్గ మధ్యలోనే గంగాధర్ ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. ఈ ఘటన గ్రామస్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Godavari River: గోదావరి నది మధ్యలో ఆగిన బోటు.. 80 మంది ప్రయాణికుల భయాందోళన..
ఇటీవల ఓ చిన్నారి ఈ తరహాలో మృతి చెందాడు. పల్లి గింజ గొంతులో ఇరుక్కొని ఏడాదిన్నర బాలుడు మృతి చెందిన ఘటన తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. గూడూరు మండలం నాయకపల్లి గ్రామానికి చెందిన గుండెల అక్షయ్ అనే బాలుడు పల్లీలు తింటుండగా గింజ గొంతులో ఇరుక్కుంది. దీంతో ఊపిరి అందక బాలుడు ఇబ్బంది పడ్డాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అక్షయ్ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.