YCP Protests: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.. గత కొంతకాలంగా ఏపీలో రాజకీయ అంశంగా మారిపోయిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ పాలనలో టీటీడీలో అరాచకాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తూ వస్తోంది. టీటీడీ నెయ్యి కల్తీ, పరాకమణీ దొంగతనాలు, ధార్మిక కార్యక్రమాల్లో నిర్లక్ష్యం ఇలా ప్రతీ అంశంలోనూ జగన్ ను వేలెత్తి చూపుతోంది. ఈ క్రమంలో అనివార్యంగా శ్రీవారి ఆలయంలో రాజకీయంగా చర్చల్లో నిలుస్తూనే వచ్చింది. అయితే తాజాగా టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు రాజీనామా కోరుతూ వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టడంతో మళ్లీ శ్రీవారి ఆలయం చర్చల్లోకి వచ్చింది.
టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఇటీవల వైసీపీ పార్టీ విస్తృత స్థాయిలో వైరల్ చేసింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ పదవికి తక్షణమే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు నిరసనలకు దిగారు. అనైతిక చర్యలతో శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీస్తున్న బీ.ఆర్. నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించాలని స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం బీ.ఆర్.నాయుడుకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తూ.. ఆయన్ను ఇంకా పదవిలో కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
తిరుమల పవిత్రతను కాపాడాలి: ధర్మాన కృష్ణదాస్
టీటీడీ చైర్మన్ పదవి నుంచి @BollineniRNaiduని వెంటనే తొలగించాలి. జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో వైయస్ఆర్ సీపీ ప్రత్యేక పూజలు. నరసన్నపేటలో భారీ సంఖ్యలో మహిళలు నిరసన..పాల్గొన్న కృష్ణదాస్, కృష్ణ చైతన్య
నరసన్నపేట…
తిరుమల… pic.twitter.com/xKXxEUAh5B— YSR Congress Party (@YSRCParty) April 4, 2026
వైసీపీ అధినేత జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన ‘మావిగన్’ పై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీనిపై భారీగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇది పార్టీ మైలేజ్ డ్యామేజ్ చేస్తోందన్న ఉద్దేశ్యంతో తాజాగా బీ.ఆర్.నాయుడు రాజీనామా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడో 4, 5 వారాల క్రితం.. బీ.ఆర్. నాయుడు వీడియోలు బయటకు రాగా, ఇప్పుడు నిరసనలు తెలియజేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజల దృష్టిని ‘మావిగన్’ నుంచి టీటీడీ వైపునకు మళ్లించేందుకు వైసీపీ ఈ రాజీనామా నాటకానికి తెరలేపిందని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. మరోవైపు ఏప్రిల్ 4న నిరసనలు తెలియజేయాలని మావిగన్ ఎపిసోడ్ కు ముందే పార్టీ నిర్ణయించిందని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
Also Read: పార్టీ పరువు తీస్తే సస్పెన్షనే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
సోషల్ మీడియాపై తనపై జరిగిన దుష్ప్రచారంపై గతంలోనే టీటీడీ ఛైర్మన్ స్పందించారు. నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో తనను వ్యక్తిగతంగా అప్రతిష్టపాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో తిరుమల ఆలయ ప్రతిష్ఠను దిగజార్చేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో తనవంటూ చక్కర్లు కొడుతున్న వీడియోల వెనుక రాజకీయ దురుద్దేశం ఉందన్నారు. అప్పట్లోనే దీని వెనుక ఉన్న నిజానిజాలను వెలికి తీయాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు. మరోవైపు మాజీ టీటీడీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి ఈ వీడియోలపై స్పందిస్తూ అవి అసలైనవేనని పేర్కొన్నారు. వీటిపై తాను నిపుణులతో మాట్లాడానని.. వారు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని చెప్పుకొచ్చారు. మెుత్తం మీద ‘మావిగన్’ ఎపిసోడ్ పై రాష్ట్రమంతా చర్చ జరుగుతున్న వేళ.. బీ.ఆర్. నాయుడు అంశాన్ని వైసీపీ తెరపైకి తీసుకురావడం అటు టీటీటీ ఛైర్మన్ తో పాటు టీడీపీని సైతం ఇరాకటంలో పడేసిందని చెప్పవచ్చు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెతను ఇది గుర్తుకు తెస్తోంది.
Also Read: మామ సీటుపై కన్నేసిన హరీశ్? ఫామ్ హౌస్కే పరిమితం చేసే ప్లాన్!