Amaravati: మొన్న సీదిరి అప్పలరాజు.. నిన్న విరూపాక్షి.. నేడు ముస్తఫా. వైసీపీ నేతలు రోజుకో ఒకరు అరెస్టు అవుతున్నారు. నాలుగు రోజులు గాలింపు తర్వాత రాత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ నుంచి ఆయన్ని విజయవాడకు తరలించారు. అసలు కేసు ఏంటి?
గుంటూరు జిల్లా వైసీపీ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాను అర్థరాత్రి అరెస్టయ్యారు. ఆయన్ని గుజరాత్లో నూజివీడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పొగాకు వ్యాపారి అభి కిడ్నాప్-బెదిరింపులకు పాల్పడిన కేసులో ముస్తఫా, ఆయన కొడుకు బషీర్లపై కేసు నమోదు చేశారు. కిడ్నాప్, ఎస్సీ-ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు నూజివీడు పోలీసులు.
కేసు నమోదు తర్వాత ముస్తాఫా పరారీలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఆయన కోసం పోలీసులు నాలుగు రోజులుగా గాలింపు చేపట్టారు. గుజరాత్లో అర్థరాత్రి ఒంటి గంట సమయంలో అదుపులోకి తీసుకున్నారు నూజివీడు పోలీసులు. అక్కడి నుంచి నేరుగా విజయవాడకు ముస్తఫాను తరలించనున్నారు.
అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని పోలీసులు విచారించనున్నారు. అరెస్టు విషయాన్ని వైసీపీ నేతలు నిర్థారించారు. ఈ మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంకు చెందిన సూర్యచంద్రం రైతుల నుంచి పొగాకు సేకరించి గుంటూరులో మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు అమ్మేవారు.
ఇటీవల పొగాకు ధరలు భారీగా తగ్గడంతో వ్యాపారం గిట్టుబాటు కాలేదని భావించిన సూర్యచంద్రం, ముస్తఫాకు సరకు అమ్మడం ఆపేశాడు. గుంటూరులో మరో కంపెనీకి విక్రయించడం మొదలుపెట్టాడు. గత సోమవారం రాత్రి పొగాకు బేళ్లను సొంత వాహనంలో కొయ్యలగూడెం నుంచి గుంటూరుకు సూర్యచంద్రం కొడుకు అభి గుమస్తా దుర్గారావుతో కలిసి బయలుదేరారు.
విజయవాడ సమీపంలోకి వాహనం రాగానే అభి తన తండ్రికి ఫోన్ చేశాడు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కొడుకు బషీర్, ఆయన అనుచరులు నూజివీడులో అడ్డగించి పొగాకు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని తెలిపాడు. ఇవ్వాల్సిన డబ్బులు చెల్లిస్తేనే తమను వదిలేస్తామని చెప్పి ఫోన్ కట్ చేశాడు.
డబ్బులు తీసుకుని గుంటూరులో పొగాకు గోదాం వద్దకు రావాలని లేకుంటే నీ కొడుకు నీకు దక్కడని కిడ్నాపర్లు హెచ్చరించారు. ఆందోళనకు గురైన సూర్యచంద్రం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై గుంటూరు వెంటనే పోలీసులు.. ముస్తఫాకు ఫోన్ చేసి పొగాకు వ్యాపారి డబ్బులివ్వాల్సి ఉంటే చట్టపరంగా తేల్చుకోవాలని, అతడి కుమారుడిని కిడ్నాప్ చేయడం తగదని చెప్పారు.
మంగళవారం తెల్లవారుజామున బాధితులను తీసుకుని కిడ్నాపర్ల ముఠా పెదకాకాని పీఎస్లో లొంగిపోయింది. ఆనాటి నుంచి ముస్తఫా, ఆయన కొడుకు బషీర్ పరారీలో ఉన్నారు. అప్పటి నుంచి వారిని పట్టుకునేందుకు నూజివీడు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గాలింపు చేపట్టారు.
చివరకు ముస్తఫా గుజరాత్ ఉన్నట్లు సమాచారం రావడంతో నూజివీడు పోలీసులు అక్కడికి వెళ్లి, మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో కొత్త విషయాలు ఇంకెన్ని వెలుగులోకి వస్తాయో చూడాలి.
ALSO READ: డివైడర్ని ఢీ కొట్టి బోల్తా పడిన ట్రావెల్ బస్సు, స్పాట్లో 26 మంది
నూజివీడులో నమోదయిన కేసులో మాజీ శాసన సభ్యులు మహమ్మద్ ముస్తఫా గారిని గుజరాత్ లో నూజివీడు
పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం— Ambati Rambabu (@AmbatiRambabu) August 4, 2026