ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే, అవి సజావుగా సాగకుండా ప్రతిపక్ష వైసీపీ పార్టీ అడ్డుపడుతున్నట్టు అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సమావేశాల ప్రారంభం నుంచి వైసీపీ నేతలు సభలో గందరగోళం సృష్టిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఒక్కోసారి ఒక్కో అంశం మీద వైసీపీ నేతలు రాజకీయాలకు తెరలేపుతున్నారని కూటమి నేతలు చెబుతున్నారు. సెషన్స్ ప్రారంభం నుంచే ముందుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి అడ్డు తగిలిన నేతలు.. ఆరోజు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పెద్దఎత్తున నిరసన తెలిపారు. స్పీకర్ చైర్ వద్దకు వెళ్లి పదేపదే ఆయన ప్రసంగానికి ఆటంకం కలిగించారు. చివరకు సభ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.
కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ మీద ప్రతిపక్ష వైసీపీ విషం కక్కుతూనే ఉందని టాక్ వినిపిస్తోంది.వైసీపీ నేతలు కావాలనే బడ్జెట్ మీద విషప్రచారం చేస్తున్నారని మంత్రులు విమర్శిస్తున్నారు. పాత సీసాలో కొత్త సరుకు అంటూ మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, విడుదల రజినీ, రోజా వంటి వారు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ముందు చూపుతో ఈ బడ్జెట్ పెడితే ఇలాంటి విషప్రచారం చేయడం ఏంటని ఏపీ మంత్రులు వైసీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు.వారి హయాంలో కేవలం రాజకీయాలు, దోపిడీ, గూండాగిరి మాత్రమే నడిచిందని.. అభివృద్ధి ఎక్కడా జరగలేదని మంత్రులు ఫైర్ అవుతున్నారు.
తిరుమల శ్రీవారిని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. వారి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని సీబీఐ ఆధ్వర్యంలోని దర్యాప్తు సంస్థ సిట్ తేల్చిందని కూటమి నేతలు, మంత్రులు చెబుతుండగా..ఇదంతా పచ్చ మీడియా, నేతల దుష్ప్రచారం మాత్రమే అని వైసీపీ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు.సభా సమావేశాలు సజావుగా సాగకుండా వైసీపీ నేతలు అడ్డుతగడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి సీరియస్ అయ్యారు. వారిని సభ నుంచి బయటకు పంపించివేశారు. అయినప్పటికీ వారి తీరులో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. శాసనసభ తర్వాత మండలిలోనూ వైసీపీ ఎమ్మెల్సీలు సమయాన్ని వృథా చేయడానికి వస్తున్నట్టు విమర్శలొస్తున్నాయి.
Madanapalle Girl Incident Case: మదనపల్లె చిన్నారి కేసు.. సోమవారం సాయంత్రం నుంచి ఏం జరిగింది?
కల్తీ నెయ్యి వ్యవహారంలో సీబీఐ గత వైసీపీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిందని పేర్కొంటూ వైసీపీ తెగ ప్రచారం చేసుకుంటోంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీలోనూ ఈ విషయంపై చర్చ పెట్టాలని వారు అడ్డుతగులుతున్నారు. బడ్జెట్ అంశాలను, అభివృద్ధి, సంక్షేమం, రాజధానికి కేటాయించిన నిధుల విషయంలో చర్చించకుండా దేవుడి పేరు చెప్పి వైసీపీ నేతలు పబ్బం గడుపుకుంటున్నారని కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. తమ రాజకీయాల కోసం విలువైన సభా సమయాన్ని వృథా చేయొద్దని వారు మండిపడుతున్నారు.