Bajaj EV Sales 2026: భారత్లో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ మార్కెట్ లో టీవీఎస్, బజాజ్, ఏథర్, విడా వంటి కంపెనీలు గట్టి పోటీ పడుతున్నాయి. తాజాగా బజాజ్ ఆటో మరో కీలక మైలురాయిని అందుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 3 లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్ల అమ్మకాలను దాటిన రెండో భారతీయ కంపెనీగా నిలిచింది.
వాహన్ డేటా ప్రకారం.. జనవరి నుంచి ఆగస్టు 30, 2026 వరకు బజాజ్ మొత్తం 3,02,179 యూనిట్లను అమ్మింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ అమ్మకాలు సుమారు 68 శాతం పెరిగాయి. మార్కెట్ లో ఇప్పటికే టీవీఎస్ 3 లక్షల యూనిట్ల మార్కును దాటింది. ఇప్పుడు బజాజ్ కూడా అదే లిస్టులో చేరింది. దీంతో ఒకే ఏడాదిలో మూడు లక్షలకు పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్లు విక్రయించిన భారతీయ కంపెనీల సంఖ్య రెండుకు చేరింది.
బజాజ్కు ఆగస్టు నెల కూడా ప్రత్యేకంగా నిలిచింది. ఆగస్టు 1 నుంచి 30 వరకు కంపెనీ 37,976 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఆగస్టులో నమోదైన 12,246 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 210 శాతం పెరుగుదల కావడం విశేషం. 2026లో బజాజ్ అత్యధిక నెలవారీ అమ్మకాలు మార్చిలో నమోదయ్యాయి. ఆ నెలలో 47,753 యూనిట్లు అమ్ముడయ్యాయి. మొదటిసారి ఒక నెలలో 40 వేల యూనిట్ల మార్కును కూడా కంపెనీ అప్పుడే దాటింది. జూన్, జూలై నెలల్లో కూడా 40 వేల మార్కును అధిగమించింది.
రాబోయే పండుగ సీజన్ బజాజ్ అమ్మకాలు మరింత పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. మిగిలిన నాలుగు నెలల్లో మరో 1.25 లక్షల నుంచి 1.50 లక్షల యూనిట్లు అమ్మే అవకాశం ఉందని అంచనా. అదే జరిగితే 2026లో బజాజ్ మొత్తం ఎలక్ట్రిక్ టూ-వీలర్ అమ్మకాలు 4.25 లక్షల నుంచి 4.50 లక్షల యూనిట్లకు చేరే అవకాశం ఉంది.
మరోవైపు ఏథర్ ఇటీవల కోనార్క్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.99,999గా ఉంది. మాస్ మార్కెట్ కస్టమర్లను లక్ష్యంగా పెట్టుకున్న ఈ మోడల్కు మంచి స్పందన వస్తే ఏథర్ అమ్మకాలు కూడా వేగంగా పెరిగే అవకాశం ఉంది.
ఇక టీవీఎస్, బజాజ్, విడా వంటి కంపెనీలు కూడా కోనార్క్కు మార్కెట్ నుంచి వచ్చే స్పందనను ఆసక్తిగా గమనిస్తున్నాయి. రాబోయే పండుగ సీజన్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో పోటీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Read Also: 8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!