Electric Scooter Sales 2026: భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, కొత్త మోడళ్ల రాక, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు లాంటి కారణాలతో చాలామంది ఎలక్ట్రిక్ టూ వీలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా టీవీఎస్, బజాజ్, ఏథర్, విడా కంపెనీలు అమ్మకాల్లో దుమ్మురేపుతున్నాయి. 2026లో మొదటి ఎనిమిది నెలల్లో ఈ నాలుగు కంపెనీలు ఏకంగా 10,38,973 ఎలక్ట్రిక్ టూ వీలర్లను అమ్మాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ నాలుగు బ్రాండ్లు కలిపి 5,65,635 యూనిట్లు మాత్రమే అమ్మాయి. దీంతో ఈ ఏడాది అమ్మకాల్లో ఏకంగా 84 శాతం వృద్ధి నమోదైంది.
ఈ లిస్టులో టీవీఎస్ మోటార్ కంపెనీ మొదటి స్థానంలో ఉంది. జనవరి-ఆగస్టు మధ్య 3,56,579 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 77 శాతం పెరిగాయి. దేశ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో టీవీఎస్కు 26 శాతం వాటా దక్కింది. 2025లో ఏడాది మొత్తానికి విక్రయించిన 3,15,082 యూనిట్లను కూడా టీవీఎస్ ఇప్పటికే దాటేసింది. జూలైలో ఏకంగా 55,823 యూనిట్లను విక్రయించడం కంపెనీకి బాగా కలిసి వచ్చింది.
బజాజ్ ఆటో 3,05,226 చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 69 శాతం పెరిగాయి. మార్కెట్లో బజాజ్ వాటా 22 శాతంగా ఉంది. ఒకే ఏడాదిలో మూడు లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలను దాటిన కంపెనీల జాబితాలో టీవీఎస్ తర్వాత బజాజ్ చేరింది. మార్చిలో 47,753 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి.
ఏథర్ ఎనర్జీ జనవరి-ఆగస్టు మధ్య 2,29,099 యూనిట్లను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 83 శాతం వృద్ధి. మార్కెట్ వాటా కూడా 15 శాతం నుంచి 17 శాతానికి పెరిగింది. ఏథర్ 450 సిరీస్తో పాటు రిజ్తా స్కూటర్ కూడా అమ్మకాలకు ప్రధాన కారణంగా నిలిచింది. ఇటీవల విడుదలైన కోనార్క్ కూడా కంపెనీ అమ్మకాలను మరింత పెంచే అవకాశం ఉంది.
హీరో విడా అమ్మకాల్లో మాత్రం నాలుగు కంపెనీల్లోనే అత్యధిక వృద్ధి కనిపించింది. జనవరి-ఆగస్టు మధ్య 1,48,069 యూనిట్లను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 151 శాతం పెరుగుదల కనిపించింది. విడా మార్కెట్ వాటా కూడా 7 శాతం నుంచి 11 శాతానికి చేరింది. VX2 గో, VX2 ప్లస్ మోడళ్లతో పాటు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ ఆప్షన్ కూడా అమ్మకాలకు ఊతమిచ్చింది.
Read Also: యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!