E85 Fuel Launched in Delhi: దేశంలో ఇథనాల్ ఆధారిత రవాణా వ్యవస్థకు మరో కీలక ముందడుగు పడింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఢిల్లీలోని పూసా రోడ్ లో తొలి E85 ఫ్యూయల్ స్టేషన్ ను ప్రారంభించారు. దీంతో దేశ రాజధానిలో హై ఇథనాల్ కలిగిన ఫ్యూయల్ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది.
ఢిల్లీలో E85 ఇంధనం ధర లీటరుకు రూ. 82.12గా నిర్ణయించారు. ఇది ప్రస్తుతం అమ్ముతున్న E20 పెట్రోల్ కంటే దాదాపు రూ.20 తక్కువ. తక్కువ ధర కారణంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను వాడే వారికి ఇంధన ఖర్చు తగ్గే అవకాశం ఉంది. E85 అంటే 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ కలిగిన మిశ్రమ ఇంధనం. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న E20 పెట్రోల్ లో కేవలం 20 శాతం ఇథనాల్ మాత్రమే ఉంటుంది. ఎక్కువ ఇథనాల్ వినియోగం వల్ల పెట్రోల్ అవసరం తగ్గడంతో పాటు విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం కూడా తగ్గుతుంది. E85ను ప్రతి వాహనంలో ఉపయోగించలేరు. ప్రత్యేకంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో తయారైన వాహనాలు మాత్రమే ఈ ఇంధనాన్ని ఉపయోగించుకుంటాయి. సాధారణ పెట్రోల్ వాహనాల్లో E85 వాడితే ఇంజిన్ పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది.
భారత మార్కెట్లో ప్రస్తుతం కొన్ని ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు ఈ విభాగంలో తొలి మోడల్ గా గుర్తింపు పొందింది. ద్విచక్ర వాహనాల్లో హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్లను తీసుకొచ్చింది. సుజుకి కూడా గిక్సర్ ఎస్ఎఫ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ ను ప్రదర్శించింది.
ప్రస్తుతం ఢిల్లీలో ప్రారంభమైన E85 పంప్ తో ఈ ప్రయాణం మొదలైంది. తొలి దశలో ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై-పూణే-నాగ్ పూర్ మార్గాల్లో 50 నుంచి 100 వరకు E85 స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2026 చివరి నాటికి ఈ సంఖ్యను 500కు, 2027 నాటికి దేశవ్యాప్తంగా 5,000 అవుట్ లెట్లకు పెంచాలని యోచిస్తోంది.
దేశం ముడి చమురులో ఎక్కువ భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. అందుకే ఇథనాల్ వినియోగాన్ని పెంచడం ద్వారా విదేశీ మారక వ్యయాన్ని తగ్గించడంతో పాటు రైతులకు కూడా లాభం చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. చెరకు, మొక్కజొన్న లాంటి పంటల నుంచి ఇథనాల్ తయారవుతుండటంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడనుంది.
E85 విజయవంతం కావాలంటే మూడు అంశాలు కీలకం కానున్నాయి. సరసమైన ధర, దేశవ్యాప్తంగా ఇంధన లభ్యత, తగిన సంఖ్యలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు మార్కెట్లో ఉండాలి. ప్రస్తుతం లీటరుకు రూ. 20 తక్కువ ధరతో మంచి ప్రారంభం లభించినా, వినియోగదారులు దీర్ఘకాలంలో ఖర్చు, పనితీరు, సౌకర్యాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తానికి, E85 ప్రారంభం దేశంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also: నో పొల్యూషన్ సర్టిఫికేట్.. నో పెట్రోల్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!