Indian Railways On Train Cancellations: రైళ్లు అనుకోకుండా రద్దు కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త విధానాన్ని అమలు చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఇకపై రైలు రద్దులు, లైన్ బ్లాక్ల గురించి రెండు నెలల ముందుగానే సమాచారం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాలను మార్చుకునే అవకాశం ఉంటుంది.
ఇప్పటి వరకు మెయింటెనెన్స్ పనులు, ట్రాక్ మరమ్మతులు, ఇతర కారణాలతో రైళ్లు ఆకస్మికంగా రద్దు కావడం వల్ల చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. చాలాసార్లు ప్రయాణికులు చివరి నిమిషంలో బస్సు, విమాన టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల అదనపు ఖర్చు, మానసిక ఒత్తిడి రెండూ పెరిగేవి. ఈ సమస్యలను తగ్గించడానికి రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సౌత్ ఈస్ట్రన్ రైల్వే ముందస్తు నోటీసు విధానాన్ని తీసుకొచ్చింది. టిక్కెట్ బుకింగ్ ప్రారంభమయ్యే ముందు నుంచే రైలు రద్దుల సమాచారం అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్నాయ రైళ్లు, ఇతర రవాణా మార్గాలను ఎంచుకోవచ్చు.
ఈ కొత్త విధానం ప్రధానంగా మెయింటెనెన్స్, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సంబంధించినది. ట్రాక్ మరమ్మతులు, సిగ్నల్ వ్యవస్థ అప్ గ్రేడ్ లు, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ పనులు, భద్రతా తనిఖీలు లాంటి పనుల కోసం ముందుగా లైన్ బ్లాక్లు ప్రకటిస్తారు. అయితే, ఆకస్మిక సాంకేతిక లోపాలు, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగితే మాత్రం ఎమర్జెన్సీ నోటీసుతో రైళ్లు రద్దు చేసే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
ఇక జూలై 27 నుంచి నవంబర్ 12 వరకు కొన్ని కీలక మార్గాల్లో పెద్ద మొత్తంలో నిర్వహణ పనులు చేపట్టనున్నారు. ముఖ్యంగా చక్రధర్పూర్, బిలాస్ పూర్ డివిజన్ల పరిధిలో ట్రాక్ పనులు జరగనున్నాయి. దీని ప్రభావం టాటానగర్ మార్గంలో నడిచే పలు రైళ్లపై పడనుంది. ఈ సమయంలో కొన్ని రైళ్లు నిర్దిష్ట తేదీల్లో రద్దు కానున్నాయి. వాటిలో టాటానగర్-ఇత్వారీ ఎక్స్ ప్రెస్, బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్, సౌత్ బీహార్ ఎక్స్ ప్రెస్, కళింగ ఉత్కల్ ఎక్స్ ప్రెస్ ఉన్నాయి.
హౌరా-ముంబై ప్రధాన రైల్వే మార్గంలో సర్వీసులు సజావుగా కొనసాగేందుకు ఈ రద్దులు, దారి మళ్లింపులు అవసరమని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగానే సమాచారం ఇవ్వడం వల్ల ప్రజలు తమ సెలవులు, కుటుంబ ప్రయాణాలు, వ్యాపార పర్యటనలను సులభంగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదనపు ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
Read Also: జనరల్ కోచ్ లలో ఫస్ట్ క్లాస్ శుభ్రత.. రైల్వే శాఖ కీలక నిర్ణయం!