Railways Special Cleaning Drive: రైళ్లో ప్రయాణించే సామాన్య ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా సుదూర రైళ్ల జనరల్ కోచ్ లలో ప్రయాణించే వారికి మెరుగైన శుభ్రత అందించేందుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇప్పటి వరకు జనరల్ బోగీల్లో పరిశుభ్రతపై తరచూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో, ఇకపై ఈ కోచ్లను కూడా ఫస్ట్ క్లాస్ బోగీల స్థాయిలో శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
తాజాగా న్యూఢిల్లీలో నిర్వహించిన రైల్వే సంస్కరణల సమావేశంలో మంత్రి వైస్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు.తొలి విడుదలతో భాగంగా దేశ వ్యాప్తంగా 80 సుదూర రైళ్లను ఎంపిక చేసి, వాటిలో ఈ ప్రత్యేక శుభ్రత కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియను వచ్చే ఆరు నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చాలా మంది ప్రయాణికులు జనరల్ కోచ్ లలో టాయిలెట్లు శుభ్రంగా లేకపోవడం, చెత్త పేరుకుపోవడం, దుర్వాసన లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి గంట, గంటన్నర వ్యవధిలో ప్రత్యేక సిబ్బంది కోచ్లను పరిశీలించి శుభ్రపరిచే విధానం తీసుకురానున్నారు. ముఖ్యంగా టాయిలెట్లు, చెత్త బుట్టలు, కోచ్ లోని క్యాబిన్ ప్రాంతాలను నిరంతరం శుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తాయని మంత్రి తెలిపారు.
ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ బోగీల్లో పరిశుభ్రతను మెరుగుపరచడం అత్యవసరమైనదిగా భారతీయ రైల్వే గుర్తించింది. చాలా మంది తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు జనరల్ కోచ్ లనే ఎంచుకుంటున్నారు. అయితే రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల శుభ్రతను మెయింటెనెన్స్ అనేది సవాలుగా మారుతోంది. ఇప్పుడు కొత్త విధానంతో పరిస్థితి మారుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇక లినెన్ సేవల విషయంలో కూడా రైల్వే శాఖ కీలక మార్పులు చేయనుంది. ఇప్పటి వరకు బెడ్ షీట్లు, దుప్పట్లు పంపిణీ, సేకరణ, ప్యాకింగ్, శుభ్రపరిచే పనులను వేర్వేరు సంస్థలు నిర్వహించేవి. దీనివల్ల సమన్వయం లోపించడం, సేవల్లో ఆలస్యం జరగడం లాంటి సమస్యలు ఎదురయ్యేవి. ఇకపై ఈ సేవలన్నింటినీ ఒకే సంస్థకు అప్పగించనున్నట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల జవాబుదారీతనం పెరిగి సేవల నాణ్యత మెరుగుపడుతుందని వెల్లడించారు.
అటు దేశంలో సరుకు రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి రైల్వే శాఖ గతిశక్తి కార్గో టెర్మినళ్ల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టింది. వచ్చే మూడు సంవత్సరాల్లో దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 124 గతిశక్తి కార్గో టెర్మినళ్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వైష్ణవ్ వెల్లడించారు. ఈ టెర్మినళ్ల ద్వారా రోడ్డు, రైలు, ఇతర రవాణా మార్గాల మధ్య మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే దేశ వ్యాప్తంగా లాజిస్టిక్ ఖర్చులు తగ్గడంతో పాటు సరుకు రవాణా వేగవంతమవుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రస్తుతం భారతీయ రైల్వే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కార్గో రవాణా వ్యవస్థగా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. ప్రయాణికుల సేవలతో పాటు సరుకు రవాణా రంగంలో కూడా రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.
రైల్వేలో కొత్త శుభ్రత పనులు అమలులోకి వస్తే జనరల్ కోచ్లలో ప్రయాణించే లక్షలాది మందికి పెద్ద ఉపశమనం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా దీర్ఘదూర ప్రయాణాల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం ద్వారా ప్రయాణ అనుభవం మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు.
Read Also: ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ ఫారమ్, మన దేశంలోనే ఉంది తెలుసా?