V2V Technology: నిమిషానికో యాక్సిడెంట్.. గంటకు 20 మంది మృతి రోజుకు సగటున 485 మంది.. యావరేజ్గా ఏడాదికి 5 లక్షల ప్రమాదాలు. ఇది ఇండియాలో జరిగే రోడ్డు ప్రమాదాల లెక్కలు. పర్ఫెక్ట్గా చూస్తే ఇది ఎక్కువే ఉంటుంది కానీ.. తక్కువగా మాత్రం ఉండదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్లపై వాహనాలు జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నాయి. తెలిసో.. తెలియకనో.. మానవ తప్పిదమో.. లేక అనుకోకుండానో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు చనిపోతూనే ఉన్నారు. కానీ ఇకపై ఇలా జరగకుండా చర్యలు తీసుకునేందుకు కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక వెహికిల్తో మరో వెహికిల్ మాట్లాడుకోనున్నాయి. నేను స్పీడ్గా వస్తున్నాను.. నువ్వు స్లోగా వచ్చేయి ముందే సమాచారం ఇచ్చిపుచ్చుకోనున్నాయి. అదే వెహికిల్ టు వెహికిల్ కమ్యూనికేషన్. ఈ ఏడాది చివరి వరకు ఈ టెక్నాలజీ అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
వాహనాలే మాట్లాడుకునే V2V టెక్నాలజీ!
ఈ వీటూవీ టెక్నాలజీ ఇప్పుడు రవాణా రంగాన్ని మార్చబోయే ఓ లెటెస్ట్ టెక్నాలజీ. అంటే రోడ్డుపై ప్రయాణించే వాహనాలు మన ప్రమేయం లేకుండానే వాటికవే కమ్యూనికేట్ చేసుకుంటాయి. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాయి. ఎందుకంటే రెప్పవాల్చే టైమ్లో జరిగే చిన్న రియాక్షన్.. మన గమ్యాస్థానాన్ని మార్చేస్తుంది. చేరాల్సిన చోటుకి కాకుండా.. హాస్పిటల్ బెడ్పైకో.. మార్చురికో మనలని వెళ్లేలా చేస్తుంది.
కంటికి కనిపించక ముందే అలర్ట్..
ఒక్కసారి ఈ వెహికిల్ టు వెహికిల్ టెక్నాలజీ వచ్చిందంటే.. రియల్ టైమ్లో మాట్లాడుకుంటాయి వాహనాలు. అంటే అవి వెళ్లే స్పీడ్, లోకేషన్, బ్రేకింగ్ సిట్యూవేషన్, మనం వెళుతున్న రూట్.. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని 360 డిగ్రీల పరిధిలో ఇతర వాహనాలకు చేరుతుంది. అంటే మన ముందు వెళ్లే వాహనం సడెన్గా బ్రేక్ వేసినా.. అనుకోకుండా ఏదైనా వాహనం రోడ్డు మీదకు దూసుకొచ్చినా.. ఆ వేరే వాహనంలో ఉన్న డ్రైవర్కు కంటికి కనిపించక ముందే అలర్ట్ అందుతుంది.
పొగమంచు ప్రమాదాలకు ఇక చెక్!
మనం ప్రతి ఏటా చలికాలంలో ఉత్తర భారతదేశంలో మంచు వల్ల వందలాది వాహనాలు ఒకదానికొకటి గుద్దుకుంటాయి. అదే ఈ V2V ఉంటే కంటికి రోడ్డు కనిపించకపోయినా చుట్టుపక్కల వాహనాలు ఎక్కడున్నాయో ముందే తెలిసిపోతుంది. మలుపుల్లో లేదా పెద్ద లారీల వెనుక దాగి ఉన్న వాహనాలు మనకు కనిపించవు. కానీ ఈ టెక్నాలజీతో వాటిని కూడా గుర్తించవచ్చు. దీంతో ప్రమాదాలు తప్పుతాయి.
వెహికల్-టు-ఎవ్రీథింగ్ టెక్నాలజీకి గ్రీన్ సిగ్నల్
ఈ వ్యవస్థ వెహికల్-టు-ఎవ్రీథింగ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఈ సిస్టమ్ మొబైల్ నెట్వర్క్పై ఆధారపడకుండా ప్రత్యేక రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా ఇతర వాహనాలతో కమ్యూనికేట్ చేస్తుంది. టెలికమ్యూనికేషన్ శాఖ ఇప్పటికే 30 గిగాహెర్ట్జ్ రెడియో ఫ్రిక్వెన్సీని కేటాయించింది. మొదటగా టూ, త్రీ, ఫోర్ వీలర్స్కు మాత్రమే ఈ టెక్నాలజీని ఉపయోగించనున్నారు.
రేడియో సిగ్నల్తో రక్షణ!
మొబైల్ నెట్వర్క్ లేకుండా ఇది ఎలా పని చేస్తుందనే డౌట్ మీకు రావొచ్చు. కానీ ఇది మన మన సొంత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ అయిన నావిక్తో పాటు జీపీఎస్, గగన్లను ఉపయోగించుకుంటుంది. ఇది ఓపెన్-స్కై సిట్యూవేషన్లో 2.5 మీటర్ల కంటే మెరుగైన కచ్చితత్వంతో సెకనుకు కనీసం 10 సార్లు లొకేషన్ డేటాను అప్డేట్ చేస్తుంది. సో.. ఖచ్చితత్వంపై అనుమానాలు అవసరం లేదు.
భారత్లోకి వస్తున్న V2V విప్లవం!
అమెరికా, యూరప్లోని అనేక దేశాలు, జపాన్, చైనా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఇప్పటికే ఈ టెక్నాలజీ అమల్లో ఉంది. మన దేశంలో ఈ ఏడాది చివరికి అందుబాటులోకి రానుంది. ముందుగా కొత్తగా వచ్చే వెహికిల్స్లో తప్పనిసరి చేసి.. ఆ తర్వాత అన్ని పాత వాహనాలకు కూడా తప్పనిసరి చేస్తారనే సమాచారం ఉంది. ఈ డివైజ్ ధర 5 నుంచి 7 వేల వరకు ఉంటుందని తెలుస్తోంది. నిజానికి కొన్ని బ్రాండ్ల ఈవీ కార్లలో ఇప్పటికే ఈ టెక్నాలజీ కనిపిస్తోంది. ఈ టెక్నాలజీతో రోడ్డు ప్రమాదాలను 80 శాతం వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొత్త వెహికిల్స్లో తప్పనిసరి చేయడం ఓకే కానీ.. పాత వెహికిల్స్లో ఈ డివైజ్ను తప్పనిసరి చేస్తారా? చేసినా వాహనదారులు అమల్లోకి తీసుకొస్తారా? లేదా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
Also Read: వినాశనం నుంచి వికాసం వైపు.. రెండేళ్లలో మారిన ఏపీ రూపురేఖలు!