Balakrishna vs Devineni Uma: తెలుగుదేశంతో ఆ కుటుంబానికి విడదీయరాని అనుబంధముంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ కుటుంబసభ్యులు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తూనే వచ్చారు. 2019లో మినహా ప్రతిసారి గెలిచారు. విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్ నెంబర్ టూగా ఫోకస్ అయ్యారు. అలాంటి కుటుంబానికి గత ఎన్నికల్లో టికెట్ దక్కకుండా పోయింది. పోనీ పార్టీ గెలిచింది. ప్రాధాన్యత దక్కుతుందని అనుకుంటే అది కూడా లేకుండా పోయింది. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? పార్టీ ఒక్కసారిగా ఆయనకు ప్రయారిటీ తగ్గించడానికి కారణమేంటి? సదరు నేతని ఎవరైనా పర్సనల్గా తీసుకుని తొక్కేశారా?
కృష్ణా జిల్లా టీడీపీలో దేవినేని ఫ్యామిలీకి ఉన్న ప్రయారిటీ గురించి వేరే చెప్పనవసరం లేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి 1994 వరకు దేవినేని రాజశేఖర్ నెహ్రూ టీడీపీ నుంచి వరుసగా గెలుస్తూ.. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. తర్వాత నెహ్రూ లక్ష్మి పార్వతి బాట పట్టడంతో ఆయన బాబాయ్ కుమారుడు దేవినేని వెంకటరమణ జిల్లా టీడీపీకి పెద్ద దిక్కు అయ్యారు. అయితే ఆయన అప్పటి కంకిపాడు నియోజకవర్గం నుంచి కాకుండా 1999 ఎన్నికల్లో నందిగామ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన మొదటి టర్మ్లోనే రమణకు చంద్రబాబు కేబినెట్లో బెర్త్ దక్కింది.
మంత్రిగా ఉన్న రమణ కొన్ని నెలలకే రైలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. రమన వారసత్వాన్ని సొంత తమ్ముడైన దేవినేని ఉమామహేశ్వరరావు అందిపుచ్చుకుని బైపోల్స్లో విజయం సాధించారు. తర్వాత 2004, 09, 14 ఎన్నికల్లో వరుసగా గెలిచిన దేవినేని ఉమాకి రాష్ట్ర విభజన తర్వాత జలవనరుల శాఖ కట్టబెట్టి చంద్రబాబు తగు ప్రాధాన్యత ఇచ్చారు. అప్పట్లో పోలవరం ప్రాజెక్ట్ పనులను పరుగులు పెట్టిస్తూ ఉమా పార్టీలో కీలకంగా ఎదిగారు. జిల్లాలో ఎక్కడ పార్టీ కార్యక్రమం జరిగినా ఆయన ఉండాల్సిందే అన్నట్లు చలాయించారు. అప్పట్లో దేవినేని ఉమాకి కృష్ణా జిల్లా సీఎం అన్న టాగ్లైన్ ఉండేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు
2019 ఎన్నికల్లో దేవినేని ఉమ తొలిసారి పరాజయం పాలైనప్పటికీ ఆయనకు పార్టీలో చంద్రబాబు మంచి ప్రాధాన్యతే ఇచ్చారు . సబ్జెట్పై పట్టున్న దేవినేని .. ఏ ఇష్యూ దొరికినా వైసీపీని, అప్పటి సీఎం జగన్ని ఎండగట్టడంలో ముందుండే వారు. ఆ దూకుడు చూస్తూ టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఇరిగేషన్ శాఖ ఆయనకే ఖరారవుతుందని, జిల్లా రాజకీయాల్లో మళ్లీ దేవినేని శకం మొదలవుతుందని అందరు భావించారు. అయితే గత ఎన్నికల్లో ఉమాకి అసలు టికెట్టే దక్కలేదు. అంతకు ముందు మైలవరంలో ఉమాపై వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్ టికెట్ ఎగరేసుకుపోయారు.
Also Read: అన్నదారిలో తమ్ముడు.. చిన్నిపై గుస్సా..
మొదట్లో దేవినేని దాన్ని వ్యతిరేకించినా.. తర్వాత చంద్రబాబు బుజ్జగింపులతో సైలెంట్ అయ్యారు. అప్పట్లో పార్టీ అధిష్టానం నుంచి ఉమాకి ఏదో స్పష్టమైన హామీ లభించిందన్న ప్రచారం జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల్లో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే వారిలో దేవినేని ఉమా ఒకరన్న పేరుంది. అయితే ఇప్పుడు ఆయన పేరు పార్టీలో ఎక్కడా వినిపించడం లేదు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత దేవినేనికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన మోనోపోలిజంతో విసిగిపోయి జిల్లాతో పాటు నియోజకవర్గంలోని ముఖ్య నేతల నుంచి క్యాడర్ వరకు దేవినేని ఉమ మీద తిరుగుబాటు చేశారంటారు. ఈసారి ఉమకు టిక్కెట్ ఇవ్వడానికి వీల్లేదని పార్టీ ఐవీఆర్ఎస్ సర్వేలో తేల్చి చెప్పారంట. అందుకే చంద్రబాబు ఆయనకు నచ్చజెప్పి పక్కన పెట్టారన్న టాక్ నడిచింది
ఇటీవల కాలంలో కొన్ని నామినేటెడ్ పోస్టుల పంపిణీ జరిగింది. వాటిలో ఎక్కడా కూడా ఉమా పేరు కనిపించలేదు. ఉమ్మడి గుంటూరు కృష్ణాజిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒక దశలో ఉమా పేరు కూడా తెరపైకి వచ్చింది.. సడన్గా మరో మాజీ మంత్రి ఆలపాటి రాజాకి టికెట్ కేటాయించారు. బుడమేరు గండి పూడ్చివేత, కృష్ణా నది బోటు ప్రమాద ఘటనలప్పుడు దేవినేని ఉమ మంత్రి నిమ్మల వెంట ఉండి తన అనుభవంతో ఇరిగేషన్ శాఖ సిబ్బందిని గైడ్ చేస్తూ పెద్దదిక్కుగా వ్యవహరించారు. అయినా ఆయనకు ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదు
దానికి కారణం హిందూపురం హ్యాట్రిక్ హీరో నందమూరి బాలకృష్ణే అంటున్నారు. 2014 నుంచి 19 వరకు మంత్రిగా ఉన్న ఉమ ప్రభుత్వపరంగా అనేక నిర్ణయాలు లోకేష్ పేరు చెప్పి తీసుకున్నారంట. అనేక అంశాల్లో లోకేష్ పేరుని రికార్డుల్లో పెట్టారంట. ఒక దశలో లోకేష్ విషయంలో వైసీపీ పతాక స్థాయిలో విమర్శలు చేయడానికి కారణం ఉమా వైఖరే అని బాలయ్యకు తెలిసిందంట. ఉమా తో పాటు ఒకరిద్దరు నేతలు కలిసి లోకేష్ కి అవినీతి మరకటించారని ఉమాపై బాలకృష్ణ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారంటున్నారు . ఆ క్రమంలో 2019 ఎన్నికల తర్వాత పెద్దగా ఆ అంశాన్ని పట్టించుకోని బాలయ్య.. ఎన్నికల దగ్గర పడే టైంకి ఉమా పై ఫోకస్ పెట్టి ఉమాకు టికెట్ దక్కకుండా చేశారంట. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారంట
అయితే ఎవరు ఎన్ని అనుకున్నా తాను చంద్రబాబుకి అనుంగ శిష్యుడినని.. చంద్రబాబు కోసం తాను ఏమైనా చేస్తానని.. బాబు కచ్చితంగా నాకు న్యాయం చేస్తారని ఉమా నమ్మకంతో ఉన్నారంట. మున్నుందు నామినేటెడ్ పోస్టుల విషయంలోనో లేకపోతే ఇంకోరకంగా ఉమాకి న్యాయం జరుగుతుందని ఆయన సన్నిహితులు అంటున్నారు. నీటిపారుదల శాఖ సలహాదారుగా ఉమాని నియమిస్తారన్న టాక్ కూడా నడుస్తుంది. మరి చూడాలి ఉమా లక్ ఎలా ఉంటుందో?