BJP VS Congress On D Srinivas: డీఎస్ ఎవరి సొంతం..? ఇందూరు పాలిటిక్స్లో ఇప్పుడు దీనిపైనే చర్చ. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన డి.శ్రీనివాస్.. మధ్యలో ఒకసారి బీఆర్ఎస్లోకి వెళ్లి వచ్చారు. చివరికి కాంగ్రెస్ పార్టీ నేతగానే కన్నుమూశారు. అలాంటి నేత విషయంలో బీజేపీ ఎందుకు ఎంటరైంది..? ఎలాంటి ప్రయోజనాలు ఆశించి ఆయన విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించారు..? తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోందట.
కాంగ్రెస్ రాజకీయాల్లో తిరుగులేని నేత
ధర్మపురి శ్రీనివాస్. కాంగ్రెస్ కార్యకర్తలు డీఎస్గా, శీనన్నగా పిలుచుకునే నేత. నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ రాజకీయాల్లోకి వెళ్లిన ఆయన సుదీర్ఘకాలం పాటు ఆ పార్టీకి సేవలందించారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేశారాయన.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ చీఫ్గా తనకు హైకమాండ్ ఇచ్చిన బాధ్యతలను సమర్థంగా పోషించారు డీఎస్. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని అపాయింట్మెంట్ లేకుండా కలిసే నేతల్లో డీఎస్ ఒకరని చెబుతారు. అంతటి నాయకులాయన.
కాంగ్రెస్లో ఎందరో నేతల్ని తీర్చిదిద్దిన డీఎస్
మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన డీఎస్.. కాంగ్రెస్ పార్టీలో ఎందరో నేతల్ని తీర్చిదిద్దారు. ఉన్నత శిఖరాలకు వెళ్లేందుకు కారణమయ్యారు. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షుల్లో చాలా మంది డీఎస్ శిష్యులేనని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అంటే డీఎస్, డీఎస్ అంటే కాంగ్రెస్ అన్నట్లుగా పేరు తెచ్చుకున్నారు ధర్మపురి శ్రీనివాస్. అలాంటి నేత రాష్ట్ర విభజన తర్వాత మారిన పరిస్థితుల్లో గులాబీ కండువా కప్పుకున్నారు. కొన్నాళ్లపాటు బీఆర్ఎస్లో కొనసాగారు. చివరకు తన సొంత పార్టీగా భావించే కాంగ్రెస్లో చేరిపోయారాయన. అందులో ఉంటూనే అనారోగ్యంతో కన్నుమూశారు ధర్మపురి శ్రీనివాస్. ఈయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సంజయ్ కాంగ్రెస్లో కొనసాగుతుండగా.. మరో కుమారుడు అర్వింద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు.
డీఎస్ను తమ వ్యక్తిగా చేసుకునేందుకు బీజేపీ తంటాలు
ఇందూరులో కాంగ్రెస్ నేతగా ఇంతటి పేరు తెచ్చుకున్న డీఎస్ను.. తమ వ్యక్తిగా చేసుకునేందుకు బీజేపీ తంటాలు పడుతోంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డీఎస్ విగ్రహం ఆవిష్కరణలో చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోందన్న మాట విన్పిస్తోంది. కాంగ్రెస్ నేతగా ఉంటూ కన్నుమూసిన డీఎస్కు.. ఆ పార్టీ నేతలు సముచిత గౌరవం ఇచ్చారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి డీఎస్ నివాసానికి వెళ్లి అప్పట్లో నివాళులర్పించారు. అనంతర పరిణామాల్లో ధర్మపురి శ్రీనివాస్ హస్తం పార్టీకి చేసిన సేవలకు గుర్తుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు సంబంధించిన అనుమతులన్నీ మంజూరు చేసింది. చివరకు విగ్రహం సైతం ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఇలాంటి వేళ.. అనూహ్య పరిణామాలు జరిగాయి.
డీఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన హోంమంత్రి అమిత్ షా
నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. స్థానికంగా కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన డీఎస్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నేతగా ఉంటూ కన్నుమూసిన డీఎస్.. ఎప్పుడూ బీజేపీలో చేరలేదు. అలాంటిది కమలం అగ్రనేతలు డీఎస్ విగ్రహాన్ని ఎందుకు ఆవిష్కరించారన్నదే పొలిటికల్గా దుమారం రేపుతోంది. పైగా విగ్రహావిష్కరణ జరిగిన రోజు డీఎస్ మొదటి వర్థంతి కూడా కావడం.. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఆయన తన కుమారుడితో అమిత్ షా గురించి మాట్లాడుతున్న ఓ వీడియో వైరల్ కావడం డీఎస్ అభిమానుల్లో ఎన్నో ప్రశ్నలు తలెత్తేలా చేసింది.
Also Read: కాంగ్రెస్లో కొండా ఫ్యామిలీ చిచ్చు..
శీనన్న అభిమానులను ఆకర్శించేందుకా..?
మున్నూరు కాపు సామాజిక వర్గానికే కాదు.. నిజామాబాద్ జిల్లా అంతటా ఎంతో ప్రభావం చూపే నేతగా డీఎస్కు పేరు. పైగా ఆయన కుమారుల్లో ఒకరు బీజేపీలో ఎంపీగా ఉన్నారు. దీంతో.. డీఎస్ అనుచరగణాన్ని, అభిమానులను తమవైపు తిప్పుకునేందుకు విగ్రహం ఆవిష్కరణ రూపంలో కమలం నేతలు ప్రయత్నించారన్న వాదన విన్పిస్తోంది. వాస్తవానికి కొంత కాలం మినహాయిస్తే.. చివరి వరకు కాంగ్రెస్లో ఉన్న డీఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తే హుందాగా ఉండేదని.. అలా కాదంటే డీఎస్ సతీమణితో ఆవిష్కరింప చేసినా బాగుండేదని అంటున్నారు. అలాంటివేమీ చేయకుండా ఏ సంబంధం లేని బీజేపీ నేతలతో శీనన్న విగ్రహాన్ని ఎలా ఆవిష్కరింపచేశారని ప్రశ్నిస్తున్నారు డీఎస్ అభిమానులు, సగటు కాంగ్రెస్ కార్యకర్తలు.