Vidadala Rajini: మాజీ మంత్రి, చిలకలూరిపేట వైసీపీ విడదల రజనీకి భారీ షాక్ తగిలింది. రజని మంత్రిగా ఉన్నప్పుడు అధికారం అండతో చక్రం తిప్పిన ఆమె మరిది.. విడదల గోపీనాథ్ను ఏసీబీ పోలీసులు క్రషర్ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేసిన కేసులో హైదరాబాద్లో అరెస్టు చేశారు. గోపీనాథ్ విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నారన్న కచ్చితమైన సమాచారంలో ఏసీబీ పోలీసులు ఆయనను హైదరాబాద్ లో అదుపులోనికి తీసుకున్నారు. ఈ అరెస్టుతో విడదల రజనీ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుసుకుందని అంటున్నారు. ఇప్పటికే రజని ముందస్తు బెయిలు పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు.. ఆమెకు అరెస్టు నుంచి మినహాయింపు ఏదీ ఇవ్వలేదు. ఇప్పుడు మరిది అరెస్టుతో తర్వాత ఆమె వంతే అన్న చర్చ మొదలైంది.
మాజీ మంత్రి విడదల రజని మరిది గోపి అరెస్టు
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజని మరిది గోపి ని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లో ఏసీబీ పోలీసులు గోపీని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించారు. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారన్న ఫిర్యాదుల మేరకు ఈ ఏడాది మార్చిలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. విడదల రజని ఏ1గా, ఆమె మరిది విడదల గోపీనాథ్ ఏ3గా, రజని పీఏ దొడ్డ రామకృష్ణను ఏ4గా చేర్చారు. అప్పటి విజిలెన్స్ అధికారి జాషువాను కూడా నిందితుడిగా చేర్చారు.
రజనీ ముందస్తు బెయిల్ పిటీషన్పై రిజర్వ్లో ఉన్న తీర్పు
ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ విడదల రజని, గోపీనాథ్లు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిలు పిటిషన్లపై విచారించి తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు.. వారికి అరెస్టు నుంచి మినహాయింపు ఏదీ ఇవ్వలేదు. అదలా ఉండగానే తాజాగా విడదల రజనీ మరిది గోపీనాథ్ ను పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ఈ అరెస్టుతో ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజనీ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుసుకుందని అంటున్నారు.
గోపి నుంచి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఏసీబీ
ఈ కేసులో ఏ2గా ఉన్న రజనీ మరిదిని అరెస్ట్ చేయడంతో త్వరలో ఏ1 అయిన మాజీ మంత్రిని సైతం అరెస్ట్ చేస్తారన్న ప్రచారం మొదలైంది. గోపి నుంచి కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఉన్నారు. రజనీ గతంలో మంత్రిగా చేయడంతో పాటు.. వైసీపీ కీలక మహిళా నేతగా వ్యవహరిస్తుండటంతో పక్కా ఆధారాలను సేకరించిన తర్వాతే ఆమెను అదుపులోకి తీసుకోవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కావాల్సిన పక్కా ఆధారాలను మరిది ద్వారా సేకరించి త్వరలోనే ఆమెను అరెస్ట్ చేయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read: లోకేష్ వల్లే.. దువ్వాడ సస్పెన్షన్లో బిగ్ ట్విస్ట్
ఏపీలో కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలకు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వరుసగా కేసులు నమోదు చేస్తోంది. అరెస్టుల పర్వం కూడా స్పీడ్ అందుకుంటోంది. ఇటీవల ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డిని, ముంబాయి నటి కాదంబరి జత్వానీని వేధించిన కేసులోసీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ రామాంజనేయులును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అది మరవకముందే మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది
మాజీ మంత్రి ప్రత్తిపాటీపై విజయం సాధించిన రజని
2019లో చిలకలూరిపేటనియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రజని… మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పై గెలిచారు. ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఆమె ఎమ్మెల్యేగా దూకుడు పెంచారు. దాంతో మూడేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణలో జగన్ రజనీకి ఛాన్స్ ఇచ్చి, కీలకమైన పోర్టు పోలియోను కేటాయించారు. అప్పుడే ఆమె తన టీమ్తో యడ్లపాటు క్రషర్ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారాక దానికి సంబంధించి ఈ ఏడాది మార్చిలో రజనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
వసూళ్లలో మాజీ మంత్రి వాటా రూ.2 కోట్లు
ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా రజనితో పాటు అప్పట్లో విజిలెన్స్ అధికారిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి జాషువాను కూడా నిందితుడిగా చేర్చారు. క్రషర్ యజమానులను బెదిరించి రూ.2.2 కోట్లు వసూలు చేయడంతో జాషువానే కీలక పాత్ర పోషించారన్న అభియోగాలున్నాయి. ఆ అక్రమా వసూళ్లలో రజని వాటాగా రెండు కోట్లు తీసుకున్నారని కేసు నమోదు చేశారు. ఐపీఎస్ అధికారి జాషువాతో పాటు రజిని మరిది గోపికి చెరో పది లక్షలు చొప్పున అందినట్లు పేర్కొన్నారు. తాజాగా గోపి అరెస్టుతో తర్వాత వంతు రజనీదే అన్న టాక్ నడుస్తోంది.