Telangana: వస్తాడు.. వస్తాడు.. అన్నారు. చెప్పినట్లుగానే ఆయనొచ్చారు. సారొస్తే మామూలుగా ఉండదు.. సర్కార్ సంగతి చూస్తారు.. అసెంబ్లీలో అడుగుపెట్టగానే అడిగేస్తారు.. కడిగేస్తారు.. ఆయనొస్తే ఎలా ఉంటుందో చూస్తారంటూ.. బీఆర్ఎస్ కార్యకర్తలు, సోషల్ మీడియా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కానీ.. ఇదంతా 3 నిమిషాల ముచ్చటగానే మిగిలిపోయింది. గులాబీ బాస్ ఆర్భాటమంతా అటెన్షన్ కోసమేనా? జస్ట్.. అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వస్తున్నారా?
3 నిమిషాల ముచ్చటకు మామూలు హడావుడి కాదు!
వచ్చారు.. కాసేపు కూర్చున్నారు.. రిజిస్టర్లో సంతకం పెట్టారు.. నిమిషాల్లోనే రిటర్న్ అయిపోయారు. శీతాకాలం అసెంబ్లీ సెషన్ ఫస్ట్ డేలో.. ఇంతే కేసీఆర్ ఎపిసోడ్. కానీ.. ఈ 3 నిమిషాల ముచ్చటకు ముందు జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. అదిగో కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారట.. కేసీఆర్ సభకు వస్తే మామూలుగా ఉండదు.. ఈసారి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తారు.. ప్రతిపక్ష నేతగా దులిపేస్తారు.. వింటర్ సెషన్ కేసీఆర్ హంటింగ్ చూస్తారు.. అన్నట్లుగా కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్లు ఇచ్చారు. దాంతో.. మీడియా, సోషల్ మీడియా, పొలిటికల్ సర్కిల్స్ అటెన్షన్ అంతా కేసీఆర్ మీదకే మళ్లింది. బీఆర్ఎస్ క్యాడర్, కార్యకర్తలు కూడా బాస్ అసెంబ్లీకి వస్తున్నారని తెలిసి ఫుల్ ఖుష్ అయిపోయారు. వాళ్లలోనూ మంచి జోష్ కనిపించింది. కేసీఆర్ ఏం మాట్లాడతారు? ప్రభుత్వాన్ని ఎలా నిలదీయబోతున్నారు? అధికార పార్టీకి ఎలాంటి సినిమా చూపించబోతున్నారు? అని కళ్లు పెద్దవి చేసుకొని మరీ చూశారు. కానీ.. కేసీఆర్ మాత్రం.. సినిమా మొదలవడానికి ముందు వచ్చే యాడ్లాగా.. అలా ఓ 3 నిమిషాలు మెరిసి.. ఇలా వెళ్లిపోయారు.
ఎలివేషన్లు, ఎమోషన్లు తప్ప.. ఎంగేజింగ్గా ఏమీ లేదు!
తనకు కావాల్సినప్పుడల్లా.. అవసరమైనప్పుడల్లా.. అందరి దృష్టిని తనమీదకు తిప్పుకోవడం కేసీఆర్కు కొత్తేమీ కాదు. ఈ విషయంలో ఆయన మరోసారి సక్సెస్ అయ్యారు. ఇందులో డౌట్ అక్కర్లేదు. కానీ.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారనే న్యూస్.. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల హడావుడికి తగ్గ రేంజ్లో అక్కడ సీన్ కనిపించలేదు. ఎలివేషన్లు, ఎమోషన్లు తప్ప.. ఎంగేజింగ్గా మరేమీ లేదు. కేసీఆర్ వస్తే ఏదో జరిగిపోతుందనే ప్రచారానికి భిన్నంగా.. ఆయన సభలో ఉన్న కాస్త సమయంలోనే ఆసక్తికర సన్నివేశం ఒకటి జరిగింది. మూడోసారి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. బీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తర్వాత.. సభ ప్రారంభమయ్యాక జాతీయ గీతం ఆలాపన దాకా ఉన్నారు. దీనికంటే ముందు.. సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిపక్ష నేత కేసీఆర్ దగ్గరకు వెళ్లి పలకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కొత్తగా ఎన్నికైన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సైతం.. కేసీఆర్ని పలకరించి.. ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత.. అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేశారు కేసీఆర్. జీరో అవర్ ప్రారంభం కాకముందే.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు.
బాస్ వస్తున్నారు.. అసెంబ్లీ దద్దరిల్లిపోతుందంటూ బిల్డప్
మొత్తానికి.. బాస్ వస్తున్నారు.. అసెంబ్లీ దద్దరిల్లిపోతుంది అంటూ బీఆర్ఎస్ ఇచ్చిన బిల్డప్కి.. అసెంబ్లీలో కనిపించిన సీన్కి అస్సలు లింక్ లేదు. గులాబీ దళపతి కేసీఆర్.. ఓ మెరుపు తీగ లాగా ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారు. ఈ పరిణామంపైనే తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కేసీఆర్ అసెంబ్లీ ఎంట్రీ, ఎగ్జిట్ చూశాక.. ఆర్భాటం అదిరింది కానీ.. ఆయన అడుగులు మాత్రం అసెంబ్లీలో ఆగలేదనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారంటేనే.. ఒక రకమైన ఉత్కంఠ నెలకొంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, అనారోగ్య కారణాలో.. వ్యూహాత్మక మౌనమో తెలియదు గానీ.. కేసీఆర్ సభకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వచ్చినా.. ఎక్కువ సేపు ఉండటం లేదు. ఈ క్రమంలో.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ప్రెస్ మీట్ పెట్టడం.. ఇది జరిగిన కొద్దిరోజులకే అసెంబ్లీ సమావేశాలు రావడంతో.. బీఆర్ఎస్ క్యాడర్ అంతా.. సింహం వస్తోంది.. లెక్కలు తేలుస్తుంది.. అంటూ భారీ ఎత్తున ప్రచారం చేసింది. కానీ.. వాళ్లు ఇచ్చిన ఎలివేషన్లకు.. ఇక్కడ కనిపించిన సీన్లకు అస్సలు పొంతన లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయ్.
ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారని భావించిన క్యాడర్
ఈసారి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే.. గంటల తరబడి చర్చల్లో పాల్గొంటారని, ప్రభుత్వాన్ని తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారని అంతా భావించారు. కానీ.. ఆయన రావడం, మొక్కుబడిగా సభలో కాసేపు ఉండటం, మర్యాదపూర్వక పలకరింపులకే పరిమితమైంది. ప్రజా సమస్యలపై గళం విప్పడానికంటే ముందు.. కేవలం తన సభ్యత్వాన్ని కాపాడుకునేందుకు, అటెండెన్స్ వేయడానికి మాత్రమే వచ్చారా? అన్నట్లుగా సాగింది కేసీఆర్ అసెంబ్లీ టూర్. కనీసం.. గంటో, రెండు గంటలో సభలో ఉంటారని అంతా అనుకున్నారు. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని భావించారు. కానీ.. ఇవన్నీ ఆశించిన కార్యకర్తలకు చివరికి నిరాశే ఎదురైంది. సారొచ్చారంటేనా.? అని.. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ప్రచారం చేసుకున్న స్థాయికి, అసెంబ్లీలో కనిపించిన సీన్కి ఎక్కడా సింక్ కాలేదు. గతంలో.. కేసీఆర్ అసెంబ్లీలో మైక్ అందుకుంటే.. గంటలకొద్దీ గ్యాప్ లేకుండా ప్రసంగించేవారు. కానీ.. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండి, రేవంత్ రెడ్డి సర్కార్పై కౌంటర్లు వేయకుండానే వెనుదిరగడం వెనుక ఉన్న మర్మమేమిటో అర్థంకాక.. గులాబీ తమ్ముల్లు తలలు పట్టుకుంటున్నారు.
స్టేట్ అటెన్షన్ తనమీద కూడా ఉండాలని కేసీఆర్ కోరుకోవడంలో తప్పు లేదు. అప్పుడప్పుడైనా అంతా తన గురించే మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి అనుకోవడంలోనూ ఇబ్బంది లేదు. అయితే.. ఇటీవలే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ప్రెస్ మీట్ పెట్టి.. ఇక నుంచి నేనే గ్రౌండ్లోకి దిగుతున్నా అని చెప్పడం చూశాక.. కేసీఆర్ ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లోనూ, రాష్ట్ర ప్రజల్లోనూ కలిగింది. ఇదే హీట్లో అసెంబ్లీ సమావేశాలు రావడంతో.. ఈసారి కేసీఆర్ విశ్వరూపం చూస్తామా? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. కానీ.. తొలిరోజే 3 నిమిషాలకు మించి సభలో ఉండలేదు. మరి.. జనవరి 2 నుంచైనా కేసీఆర్ సభలో ఉంటారా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా?
అసలు కేసీఆర్ ఏం చేయాలనుకుంటున్నారు?
కేసీఆర్ లాంటి నాయకుడి నుంచి.. చాలా గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ స్ట్రాంగ్ డైలాగ్ విన్నాక.. ఇకపై రాజకీయం మామూలుగా ఉండదనే ఊహిస్తారంతా. కానీ.. అసెంబ్లీలో ముచ్చటగా 3 నిమిషాలే ఉండి వెళ్లిపోవడంతో.. అసలు కేసీఆర్ ఏం చేయాలనుకుంటున్నారు? అనే చర్చ మొదలైంది. పాలిటిక్స్లో ప్రెజెన్స్ చాలా ముఖ్యం. కాంగ్రెస్ దూకుడు మీద ఉండటంతో.. బీఆర్ఎస్ ఉనికిని చాటుకునేందుకు కేసీఆర్ రాకని.. ఓ కమ్ బ్యాక్లా మార్చారనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారనే వార్తతో.. నిస్తేజంగా ఉన్న కార్యకర్తల్లో కొంత జోష్ వచ్చింది. ప్రధాన ప్రతిపక్ష నేతగా.. కేసీఆర్ కూడా మీడియా అటెన్షన్ని తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. కానీ.. కేసీఆర్ అసెంబ్లీకి రారు.. చర్చల్లో పాల్గొనరు.. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించరనే టాక్ జనాల్లో బలంగా ఉంది. పైగా.. అసెంబ్లీకి వచ్చినా అటెండెన్స్ కోసమే వస్తారనే మచ్చ కూడా పడిపోయింది. దీనిని అధిగమించేందుకైనా.. కేసీఆర్ జనవరి 2 నుంచి జరిగే అసెంబ్లీ సెషన్కు హాజరై.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.
కేసీఆర్ ప్రెస్మీట్తో రాష్ట్ర రాజకీయాల్లో పెరిగిన వేడి
కేసీఆర్ మార్క్ రాజకీయం ఎప్పుడూ ఓ పజిల్ లాగే ఉంటుంది. ఆయన మౌనంగా ఉన్నా.. మైక్ పట్టుకున్నా ఓ కొత్త చర్చ మొదలవుతుంది. తాజాగా.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ప్రెస్ మీట్ పెట్టి.. ఇక నేనే గ్రౌండ్లోకి దిగుతున్నానని ప్రకటించగానే.. రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. కానీ.. ఆయన అసెంబ్లీలో కేవలం మూడు నిమిషాలే కనిపించడంతో.. అందరిలోనూ ఒకటే ప్రశ్న తలెత్తింది. అసలు.. కేసీఆర్ వ్యూహం ఏంటి? జనవరి 2 నుంచైనా.. సభలో యాక్టివ్ అవుతారా?
సంతకం చేసి వెళ్లిపోవడం వెనుక రకరకాల చర్చలు
పాలిటిక్స్లో టైమింగ్ చాలా ఇంపార్టెంట్. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం వెనుక బలమైన ఉద్దేశం ఉందనేది స్పష్టం. అసెంబ్లీకి రారు, జనం సమస్యలపై ప్రశ్నించరు అంటూ.. ఇప్పటికే తనపై ఉన్న ముద్రని తొలగించుకోవడంతో పాటు బీఆర్ఎస్ క్యాడర్లో ధైర్యం నింపడం కూడా ఓ టార్గెట్. కానీ.. తొలి రోజు అసెంబ్లీకి వచ్చి కేవలం సంతకం చేసి వెళ్లిపోవడం వెనుక రకరకాల చర్చలు నడుస్తున్నాయ్. ఇంకా పూర్తి స్థాయి చర్చలు మొదలు కాలేదు కాబట్టి.. అలా వెళ్లిపోయారా? సభలో వాడి-వేడి చర్చ జరిగినప్పుడు మాత్రమే ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయ్. జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు మళ్లీ మొదలవుతాయ్. ఈసారి కేసీఆర్ సభకు వస్తారా? ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అస్త్రాలతో.. నిలదీస్తారా? ముఖ్యంగా.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై.. సభా వేదికగా గళం విప్పుతారా? లాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. రేవంత్ రెడ్డి సర్కార్ దూకుడుకు వెళ్తున్న తరుణంలో.. డేటా, గణాంకాలతో కలిపి తన మార్క్ విమర్శలతో కేసీఆర్ విరుచుకుపడతారా? లేదా? అనేది.. ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఉన్న బిగ్గెస్ట్ డౌట్.
కేసీఆర్ అసెంబ్లీ వైపు చూడకపోతే విమర్శలు పాలయ్యే ఛాన్స్..
కేసీఆర్ కేవలం ప్రెస్మీట్లకే పరిమితం కారు.. అసెంబ్లీలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని.. బీఆర్ఎస్ క్యాడర్ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తోంది. అయితే.. ప్రత్యర్థి పార్టీల నేతలు మాత్రం.. కేసీఆర్ అసెంబ్లీకి రావడం కష్టమేనని చెబుతున్నారు. ఇంకొందరు.. రాబోయే సునామీకి ముందు కనిపించే ప్రశాంతతే ఇది అని బీఆర్ఎస్ కార్యకర్తలు చెబుతుంటారు. బయట ఎలాంటి ప్రచారాలు సాగుతున్నా.. జనవరి 2న కేసీఆర్ మళ్లీ సభలో అడుగుపెట్టి.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తారా? లేదా? అన్నదే ఇప్పుడు మోస్ట్ ఇంట్రస్టింగ్ ఎలిమెంట్. అదే గనక జరిగితే.. తెలంగాణ రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కడం ఖాయం. ఒకవేళ.. కేసీఆర్ గనక మళ్లీ అసెంబ్లీ వైపు చూడకపోతే మాత్రం.. ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యతపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది.
Also Read: దువ్వాడ హత్యకు ప్లాన్ చేసింది ఎవరు? సిక్కోలు వైసీపీలో ఏం జరుగుతోంది?
మరోసారి.. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు.. కేసీఆర్ అసెంబ్లీకే రారు అని విరుచుకుపడటం ఖాయం. తెలంగాణ సమాజం కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే కోరుకుంటోంది. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటం చేయాలని కోరుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ నుంచి జనం ఆశించేది.. అసెంబ్లీలో అటెండెన్స్ మాత్రమే కాదు. పదునైన ప్రశ్నలు కూడా! మరి.. కేసీఆర్ జనవరి 2 నుంచి జరగబోయే పూర్తిస్థాయి అసెంబ్లీ సమావేశాలకు హాజరై.. తనపై ఉన్న మచ్చని తొలగించుకుంటారా? ఎప్పటిలాగే ఏదీ పట్టించుకోకుండా ఫామ్ హౌజ్కు పరిమితమవుతారా?
Story By Anup. Bigtv