Guduru: గూడూరును నెల్లూరులో కలుపుతాం.. ఇక్కడి ప్రజల ఆశలను నెరవేరుస్తాం.. ఈ విషయంపై నేను హామీ ఇస్తున్నా.. ఇది గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక గూడూరు ప్రజల కోరిక తీరుతుందని అప్పట్లో నారా లోకేష్ కూడా హామీ ఇచ్చారు. అయితే ఏరుదాటే వరకు ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్లు ఇప్పుడు ఈ నేతల తీరు ఉందనే చర్చ ఇప్పుడు గూడూరు ప్రజల్లో వినిపిస్తోంది. ఎందుకీ చర్చ వచ్చింది? అక్కడి నేతలకు సైతం ఇష్టం లేని నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుందనే చర్చ అసలెందుకు మొదలైంది?
కూటమి ప్రభుత్వం సింహపురి ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతోంది. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని అక్కడ ప్రజలు బలంగా కొరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్న సైదాపురం, కలువాయి, రాపూరు మండలాలను గూడూరు డివిజన్లో చేర్చి తిరుపతి జిల్లాలో ఉంచనున్నారు. ఈ నిర్ణయంతో జిల్లా ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, యువనేత నారా లోకేష్ ఇచ్చిన హామీలను మరిచిపోయినట్లు కనిపిస్తోందనే చర్చ మొదలైంది. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో చేర్చుతామని చెప్పిన వారు ప్రస్తుత ప్రతిపాదనలో ఎక్కడా చోటు ఇవ్వలేదు. కొద్దిరోజుల క్రితం కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రభుత్వానికి నివేదిక పంపారు. నెల్లూరు జిల్లాలో గూడూరులో కలుస్తుందనుకున్న సమయంలో ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమి జరిగిందో ఏమో గూడూరు మళ్ళీ తిరుపతి జిల్లాలోనే కలుపుతున్నట్లు ప్రకటించారు.
గూడూరు మున్సిపాలిటీ, గూడూరు రూరల్, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాలను నెల్లూరులో కలిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అనేక సార్లు అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. అంతా ఒకే అయింది ఏమీ దిగులు వద్దు అంటూ చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చారు. అయితే రాత్రికి రాత్రే ఈ నిర్ణయం ఎలా మారిందనే అనుమానాలు కలుగుతున్నాయి. గూడూరు డివిజన్లోని సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాలకు సంబంధించి ఓ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త టీడీపీకి ఫైనాన్స్ నడుపుతున్నారనే ప్రచారం ఉంది. గత ఎన్నికల్లో పెద్ద మొత్తంలో నగదు ఖర్చు చేశారని చెబుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆయన ఆవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందంటున్నారు. చిల్లకూరులోని సిలీకా, స్వర్ణముఖీ సరీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక, సైదాపురంలోని మైనింగ్, రాపూరు ప్రాంతంలో క్వార్ట్జ్ , ఇతర ప్రాంతాల్లో చిన్న సహజవనరులను ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నారనే ప్రచారం జోరుగా ఉంది. అన్ని విషయాల్లో వారి జోక్యం ఉంటుందనే చర్చ నడుస్తోంది. అందుకే గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలోకి మార్పు చేశారని ప్రచారం ఉంది.
నెల్లూరు జిల్లాను గతంలో వైసీపీ ప్రభుత్వం ముక్కలు చేసింది. ఇప్పుడు జిల్లాను ఆదుకుంటుందని టీడీపీని ఆదుకుంటుందని అందరూ భావించారు. ఇప్పుడు కందుకూరును ప్రకాశంలో కలపడాన్ని ఎవ్వరూ తప్పపట్టడం లేదు. గూడూరును నెల్లూరులో కలిపే విషయంలో మంత్రివర్గ ఉపసంఘు వ్యవహరించిన తీరుపై నిరసన వ్యక్తమవుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార టీడీపీకి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో పార్టీలోని సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, పార్టీలోని ముఖ్యులు నారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద రవిచంద్ర వంటి నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు. విచిత్రమేమంటే జిల్లాలోని అధికారపార్టీ నేతలతో ఎవ్వరితోనూ ఒక్క మాట కూడా పార్టీ కాని, ప్రభుత్వంలోని పెద్దలు గాని మాట్లాడలేదని తెలుస్తోంది. ఏకపక్షంగా ఈ కీలకమైన నిర్ణయం ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాటలను పరిగణలోనికి తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాసిన లేఖను కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కోవూరు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తానన్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా గూడూరు తిరుపతిలో కలపడాన్ని వ్యతిరేకించారు. దీంతో అధికారపార్టీ నేతలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.
నెల్లూరు జిల్లా విభజన ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాకి ఏ ఒక్క వనరు లేకుండా పోతోంది. కందలేరు జలాశయం రాపూరు ప్రాంతంలో ఉంది. ఇది తిరుపతి జిల్లాకు వెళ్లితే సాగు 30 శాతం నెల్లూరు జిల్లాలోనే ఉంది. ఇక్కడ రైతులు, ప్రజల మధ్య సాగునీటి యుద్ధమే జరిగే అవకాశం ఉంది. తిరుపతికి శ్రీసిటీ, షార్, మేనకూరు సెజ్, శ్రీకాళహస్తి, తిరుపతి దేవాలయాలు, వెంకటగిరి, నేలపట్టు, వంటి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. నెల్లూరు జిల్లాకు సోమశిల ప్రాజెక్టు అదానీ కృష్ణపట్నం పోర్టు తప్పు ఏమీ లేదు. ఒకప్పుడు ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉన్న సింహపురిని పాలకులు చిందర వందర చేశారని మండిపడుతున్నారు ప్రజలు. అధినేత, యువనేత ఇచ్చిన హామీలకే దిక్కులేక పోతే ఇక తమ మాటలను ప్రజలేం నమ్ముతారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు అధికార పార్టీ నేతలు. సీఎం చంద్రబాబు, నారా లోకేశ్లు స్థానిక ప్రజల ఆకాంక్షలను పట్టించుకుని.. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని నెల్లూరులో కలపాలని కోరుతున్నారు. గూడూరులో ఈ అంశంపై పోరాటానికి, ఆందోళనకు ప్రజలు సిద్ధమవడంతో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
Story by Anup, Big Tv