Global Summit: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్’ పేరిట అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి రోజే సంచలన పరిణామాలకు వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థల మధ్య విద్యుత్ రంగంలో భారీ ఒప్పందాలు కుదిరాయి. ఇవాళ ఒక్కరోజే ఏకంగా రూ.2 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరగడం విశేషం. ఈ భారీ పెట్టుబడులు ప్రధానంగా పంప్ స్టోరేజీ ప్రాజెక్టుల్లో పెట్టేందుకు ఎంవోయూలు (Memorandums of Understanding) ఖరారయ్యాయి. రాష్ట్ర విద్యుత్ రంగంలో కొత్త శకానికి ఈ ఒప్పందాలు నాంది పలకనున్నాయి.
సమ్మిట్ ప్రారంభ ప్లీనరీకి దేశ, విదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేదికపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రసంగించారు. అంతర్జాతీయంగా ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్ CEO ఎరిక్ స్వైడర్, నోబెల్ శాంతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఉపన్యాసాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
అలాగే, టీవీఎస్ సప్లై చైన్ చైర్మన్ ఆర్. దినేష్, అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ శోభన కామినేని, అదానీ పోర్ట్స్ & SEZ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ వంటి పారిశ్రామిక ప్రముఖులు కూడా తమ ఆలోచనలు పంచుకున్నారు. నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జుర్గెన్స్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు సమ్మిట్నుద్దేశించి వర్చువల్గా ప్రసంగించడం ఈ కార్యక్రమం స్థాయిని పెంచింది.
ఈ సమ్మిట్లో విద్యుత్ ఒప్పందాలే కాకుండా మరో భారీ ప్రాజెక్టుకు బీజం పడింది. ఫ్యూచర్ సిటీలో భారీ జూపార్క్ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వంతారా బృందం ఎంఓయూ కుదుర్చుకుంది. వంతారా (Vantara) అనేది ముంబైలోని జామ్నగర్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేటు జంతు సంరక్షణ కేంద్రం. దీని నిర్వహణ బాధ్యతలను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ నిర్వహిస్తున్నారు.
వంతారాతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ ఒప్పందం రాష్ట్రంలో పర్యాటక రంగంతో పాటు జంతు సంరక్షణకు కొత్త ఊపునివ్వనుంది. ఫ్యూచర్ సిటీలో ఏ స్థాయిలో ఈ జూపార్క్ నిర్మాణం జరగబోతోంది, దీనికి సంబంధించిన ప్రణాళికలు ఎలా ఉంటాయనే అంశాలు ప్రస్తుతం సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణలో సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది.