British Pakistani Grooming Gangs: యూకేలో ఏం జరుగుతోంది..? బ్రిటన్ను కుదిపేస్తున్న గ్రూమింగ్ గ్యాంగ్లు ఎవరు..? చిన్న వయసు ఆడపిల్ని వేధిస్తున్న కీచకుల్ని ప్రధాని కైర్ స్టార్మర్ పట్టించుకోవట్లేదా..? దశాబ్ధాలుగా కళ్లముందు జరుగుతున్న అరాచకాన్ని ప్రభుత్వ అధికారులు గుర్తించలేదా..? వందల మంది టీనేజ్ అమ్మాయిలు బలౌతుంటే.. చోద్యం చూస్తూ కూర్చున్నారా..? యూకే ప్రధానిపై ఎలన్ మస్క్ ఘాటు వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటీ..? పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్ల అత్యాచారాలపై విచారణ ఎందుకు జరగట్లేదు..? గ్రూమింగ్ గ్యాంగ్ అరాచకత్వం దేనికి సంకేతం..? అసలు, యూకేలో ఏం జరుగుతోంది..?
యూకేలో టీనేజ్ అమ్మాయిల్ని నమ్మించి వంచన
నమ్మశక్యం కానీ నిజం ఇది.. దశాబ్ధాలుగా నడుస్తున్న అరాచకత్వానికి యునైటెడ్ కింగ్డమ్ సాక్ష్యంగా నిలిచింది. కొందరు కీచకులు ఆడపిల్లల అమాయకత్వాన్ని అవకాశంగా మార్చుకుంటూ ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నారు. దశాబ్దాలుగా యూకేలోని పిల్లలు, టీనేజ్ అమ్మాయిల్ని నమ్మించి, వంచిస్తున్నారు. బ్రిటన్లో గ్రూమింగ్ గ్యాంగ్ పేరు వింటేనే ఆడపిల్లల తల్లిడండ్రులకు వణుకు పుడుతోంది. ఏం జరుగుతుందో తెలిసే లోపే, వందల మంది అమ్మాయిల బతుకులు ఛిద్రమయ్యాయి.
వందల మంది అమ్మాయిల బతుకులు ఛిద్రం
ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని తెలిసినా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు, ఈ గ్రూమింగ్ గ్యాంగ్లు కనిపెట్టలేనంతగా పెరిగిపోయాయి. గతంలోనే రిషి సునాక్ ప్రధానిగా ఉన్నప్పుడు దీనిపై ఓ నివేదికను విడుదల చేశారు. అయినా, ఇప్పటి వరకూ వీరిపై ఎలాంటి యాక్షన్ లేదు.
బ్రిటీష్-పాకిస్తానీలు గ్రూపులుగా ఏర్పడి సీక్రెట్గా నేరాలు
కొందరు బ్రిటీష్-పాకిస్తానీ మృగాలు గ్రూపులుగా ఏర్పడి సీక్రెట్గా ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. టీనేజ్ అమ్మాయిలతో పరిచయం పెంచుకొని, సంబంధాలు పెట్టుకోవడం.. వారి భావోద్వేగాలను ఉపయోగించుకొని, లైంగికంగా ఉపయోగించుకోవడం. వేధింపులకు పాల్పడటం ఈ గ్రూమింగ్ గ్యాంగ్ల పని. ఈ అమ్మాయిల్ని లైంగిక అవసరాల కోసం.. కోరికలు తీర్చుకోవడానికి, ఇతరత్రా పనులకు వాడుకుంటారు. మానవ అక్రమ రవాణాకు కూడా ఈ సంబంధాలనే ఉపయోగించుకుంటారు. బ్రిటన్లో ఈ గ్యాంగులు ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.
యూకే ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్లు
బ్రిటన్లోని ఓల్డ్హామ్ పట్టణంలో జరిగిన పిల్లల లైంగిక దోపిడీ కుంభకోణాలపై జాతీయ దర్యాప్తు చేయాలని వస్తున్న డిమాండ్లను ప్రధాని కైర్ స్టార్మర్ నేతృత్వంలోని యూకే ప్రభుత్వం తిరస్కరించింది. దీనితో ఇలాంటి కేసులపై స్థానిక అధికారులే దర్యాప్తు బాధ్యతను తీసుకోవాల్సి వచ్చింది. ఈ గ్రూమింగ్ గ్యాంగ్ దోపిడీ నుండి బయటపడినవాళ్లు ఎంత ప్రయత్నించినా నేరస్థులకు శిక్షలు పడట్లేదు. అందుకే, యూకే ప్రభుత్వం విచారణ చేపడితేనే ఈ వేటగాళ్ళు పిల్లలను ఎలా దోపిడీ చేస్తున్నారో తెలుస్తుందని అంతా డిమాండ్ చేస్తున్నారు.
విచారణ చేపట్టాలనే ప్రతిపాదనను తోసిపుచ్చిన స్టార్మర్ ప్రభుత్వం
దశాబ్ధాలుగా ఈ అరాచకత్వం కొనసాగడానికి, అధికారుల వైఫల్యాలకు ప్రభుత్వ సంస్థలను జవాబుదారీగా ఉంచాలంటే స్టార్మర్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో దీనిపై సమగ్ర విచారణ జరపాలని బాధితులు, మేథావులు వాదిస్తున్నారు. యూకేలోని రోథర్హామ్, టెల్ఫోర్డ్లలో జరిగిన ఇలాంటి కుంభకోణాల్లో వేలాది మంది బాధితులు ఉన్నట్లు తేల్చాయి. ఈ కేసుల్లో స్థానిక అధికారులు, పోలీసుల వ్యవస్థాగత నిర్లక్ష్యం బయటపడింది. అయినా, దీనిపై విచారణ చేపట్టాలనే ప్రతిపాదనను ప్రధాని స్టార్మర్ తోసిపుచ్చారు. అయితే, ఒక్క యూకేలోనే కాదు.. ఈ గ్రూమింగ్ గ్యాంగ్ కార్యకలాపాలు అంతర్జాతీయంగానూ నడుస్తున్నాయనే అనుమానాలు పెరుగుతున్నాయి.
ఎలన్ మస్క్, బ్రిటీష్ రచయిత్రి జెకె.రౌలింగ్ విమర్శలు
ఈ వ్యవహారంపై ప్రపంచ కుబేరుడు, అమెరికా కింగ్ పిన్ ఎలోన్ మస్క్, బ్రిటీష్ రచయిత్రి జెకె.రౌలింగ్తో పాటు అనేక మంది జర్నలిస్టులు తీవ్రమైన విమర్శలు చేశారు. పోలీసుల బాధ్యతారాహిత్యాన్ని గుర్తు చేస్తూ.. గ్రూమింగ్ గ్యాంగ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ న్యాయం చేయడంలో యూకే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ పరిణామాల తర్వాత తాజాగా పాకిస్తాన్ గ్రూమింగ్ గ్యాంగ్ చుట్టూ చర్చ తీవ్రమయ్యింది. గ్రూమింగ్ గ్యాంగ్స్ కుంభకోణంపై జాతీయ విచారణ కోరుతూ ఓల్డ్హామ్ టౌన్ కౌన్సిల్ చేసిన ఇటీవలి అభ్యర్థనను తిరస్కరించాలని, యూకే ప్రధాని కైర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
యూకే ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపణ
ఈ క్రమంలో.. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఎలన్ మస్క్ ఘాటుగా స్పందించారు. గ్రూమింగ్ గ్యాంగ్ల అరాచకత్వం చాలా సంవత్సరాలుగా నడుతుస్తుందనీ.. అయినా, బాధితులుకు, వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయకపోగా.. వారినే అరెస్ట్ చేయడంపై పోలీసులను నిందించారు మస్క్. ఈ వ్యహారం బయటపడితే “యూకేలో అన్ని స్థాయిల్లో ఉన్న చాలా మంది అధికారులు జైలులో ఊచలు లెక్కపెట్టాల్సి ఉంటుంది” అని మస్క్ అన్నారు.
2008-2013లో క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్లో..
దశాబ్ధాలుగా గ్రూమింగ్ గ్యాంగ్ అరాచకత్వంపై అభియోగాలు వస్తుంటే.. 2008-2013 మధ్య క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్లో పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్గా ఉన్న బ్రిటన్ ప్రస్తుత ప్రధాన మంత్రి స్టార్మర్ ఎందుకు పట్టించుకోలేదని మస్క్ ప్రశ్నించారు. ఈ రేప్ ముఠాల నేరాలను స్టార్మర్ నాడు అనుమతించడం వల్లనే ఇంకా ఇవి కొనసాగుతున్నాయని ఆరోపించారు. నిజానికి, “యూకేలో, అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలు చేసే అనుమానితులపై అభియోగాలు మోపడానికి, పోలీసులకు క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ ఆమోదం అవసరం.
నాడు స్టార్మర్ పోలీసు చర్యలకు అనుమతి ఇవ్వలేదు
అయితే, ఎంతో మంది బాధితులు ఫిర్యాదులు చేసినప్పటికీ సీపీఎస్ చీఫ్గా ఉన్న స్టార్మర్ నాడు పోలీసు చర్యలకు అనుమతి ఇవ్వలేదు. అందుకే, ఇప్పుడు, గ్రూమింగ్ గ్యాంగ్లపై విచారణకు రక్షణ మంత్రి జెస్ ఫిలిప్స్ నిరాకరించడం వెనుక కూడా స్టార్మర్ హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై ప్రధాని కైర్ స్టార్మర్ స్పందిస్తూ.. తాను 2008 నుంచి 2013 మధ్య క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ ఛీఫ్గా ఉన్నప్పుడు “ఆసియా గ్రూమింగ్ గ్యాంగ్”పై తొలి కేసు నమోదుచేసినట్టు తెలిపారు.
“యూకేలో గ్రూమింగ్ గ్యాంగ్లు పాకిస్తానీలు”
అయితే, ప్రధాని స్టార్మర్ చేసిన “ఆసియా” వ్యాఖ్యలపై.. మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. “మోసకారి పాకిస్థాన్ చేసిన తప్పుకు మొత్తం ఆసియాపై నిందలు వేయడం సరికాదన్నారు. యూకేలో గ్రూమింగ్ గ్యాంగ్లు పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్లని” అన్నారు. ఈ పోస్ట్పై ఎలన్ మస్క్ స్పందిస్తూ.. “అది నిజమే” అని రీట్వీట్ చేశారు. అలాగే, ఇటీవల, ఓ నెటిజన్ ట్వీట్కు మస్క్ స్పందిస్తూ.. ‘గ్రూమింగ్ గ్యాంగ్స్ పేట్రేగిపోతున్నాయని, వారిని నియంత్రించలేని ప్రభుత్వం అధికారంలో ఉండి ఏం లాభమని’ ప్రశ్నించారు.
ప్రధాని స్టార్మర్ను తొలగించాలని మస్క్ డిమాండ్
ప్రజల సమస్యను పరిష్కరించలేని ప్రధాని స్టార్మర్ను తొలగించి.. పార్లమెంట్ను రద్దు చేసి.. ఎన్నికల నిర్వహణకు ఆదేశించాలని బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3కు ఎలన్ మస్క్ విజ్ఞప్తి చేశారు. “2011లో గ్రూమింగ్ గ్యాంగ్ల గురించి రోథర్హాం ఎంపీ సారా ఛాంపియన్ గతంలో మాట్లాడుతూ వారి దుర్మార్గాలను రిపోర్టు చేయడానికి ప్రయత్నించిన సామాజిక కార్యకర్తలను బలవంతంగా జాతి వివక్ష గాడికింద కట్టేసారని” మస్క్ పేర్కొన్నారు. మస్క్ ఈ వ్యవహారంలో ఎంతగా ఆవేశపడ్డారంటే.. ఒక గంటలో 23 ఎక్స్ పోస్ట్లు పెట్టారు.
1990ల నుండి ఉన్న ముఠాలకు సంబంధించిన ఆధారాలు
యూకేలో పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్ చరిత్ర దశబ్ధాలుగా నడుస్తోంది. 1980ల్లో మొదలైన ఈ దారుణాలు 1990ల్లో ప్రపంచానికి తెలిసాయి. అయినప్పటికీ… ప్రభుత్వాలు మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోలేకపోయాయి. ఈ గ్యాంగ్లు అమ్మాయిల్ని లోబరుచుకోడానికి ఎంత దూరమైన వెళ్తారన్నది స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికీ, చాలా మంది బాధితులు దీనిపై బహిర్గతంగానే స్పందించారు. ఏకంగా, తమ అనుభవాలను పుస్తక రూపంలో తీసుకొచ్చినవారు కూడా లేకపోలేదు. అయినా, ఇప్పటికీ, పోలీసు వ్యవస్థ నిద్రపోతోంది. ఈ గ్యాంగ్లు తమ కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నాయి.
మద్యానికి, మాదకద్రవ్యాలకు బానిసలుగా మార్చడం
యునైటెడ్ కింగ్డమ్లో పాకిస్తాన్ సంతతికి చెందిన పురుషులను చూస్తుంటే అందరికీ చెమటలు పడుతున్నాయి. రేపిస్ట్ ముఠాల్లో వీళ్లు కూడా మెంబర్లేనే అనే సందేహాలు పెరుగుతున్నాయి. మైనర్ బాలికలను లైంగికంగా దోపిడీ చేసిన వేలాది భయానక కథనాల నేపధ్యంలో.. అంతా భయానికి గురౌతున్నారు. అయితే, ఈ రేపిస్ట్లు.. ఫ్యాన్సీ కార్లలో వస్తూ.. ముఖ్యంగా, తెల్లజాతి ఆడపిల్లలతో సంబంధాలు పెట్టుకుంటారు. తర్వాత, అమ్మాయిలను మద్యానికి, మాదకద్రవ్యాలకు బానిసలుగా మార్చుతారు. ఆనక, గ్యాంగ్-రేప్లు, డెత్ థ్రెట్లు ఇస్తారు. 1990ల నుండి ఈ ముఠాలు ఎలా పనిచేశాయో, ఎలా అభివృద్ధి చెందాయో కూడా స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇంత స్పష్టంగా నేరారోపణ ఉన్నప్పటికీ, బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్… ఈ గ్రూమింగ్ గ్యాంగ్పై జాతీయ దర్యాప్తు నిరాకరించిడమే ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
మొదటిసారి 2005లో ఓ మీడియా నివేదిక
అయితే, దీనిపై మొదటిసారి 2005లో ఓ మీడియా నివేదిక వెలువడింది. జర్నలిస్ట్ ఆండ్రూ నార్ఫోక్ 2009లో దీనికి సంబంధించిన ఒక కేసును పరిశోధించారు. తర్వాత, 2011 నుండి 2015 వరకు ఇలాంటి చాలా కేసులను గుర్తించారు. యూకేలోని రోచ్డేల్, ఓల్డ్హామ్, రోథర్హామ్ నగరాల్లో వేలాది మంది తెల్లజాతి అమ్మాలు ఈ గ్రూమింగ్ గ్యాంగ్లకు బలైనట్లు తర్వాత నివేదికలు వచ్చాయి. అయితే, బ్రిటన్లో దాదాపు 16 లక్షల మంది ఉన్న బ్రిటీష్-పాకిస్తానీయులపై జాతి వివక్షకు దారి తీస్తుందని, దీన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆండ్రూ నార్ఫోక్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
నేరస్థుల జాతిని హైలైట్ చేయాలా వద్దా అనే దానిపై చర్చలు
అయితే, ఎప్పటి నుండో నేరస్థుల జాతిని హైలైట్ చేయాలా వద్దా అనే దానిపై చర్చలు జరుగుతున్నప్పటికీ.. అందరికీ స్పష్టంగా తెలిసిన అంశం ఏంటంటే.. ఈ నేరస్థులంతా ఎక్కువగా పాకిస్తాన్ సంతతికి చెందిన పురుషులు. వీళ్లు తెల్లజాతి అమ్మాయిలను ఎంచుకుని, వారిని బాయ్ఫ్రెండ్స్గా ఆకర్షించి, ఫ్యాన్సీ స్పోర్ట్స్ కార్లలో తిప్పుతూ.. తర్వాత వారిని వృద్ధుల వద్దకు పంపడం చేసేవారు. ఈ క్రమంలో.. అమ్మాయిలకు లిక్కర్, డ్రగ్స్ అలవాటు చేస్తూ.. వృద్ధులతో లైంగిక సంబంధాలకు ప్రోత్సహించే వాళ్లు.
2023లో బిబిసి మీడియా సంస్థ దీనిపై ఓ నివేదిక
అయితే, దీనిపై 2023లో బిబిసి మీడియా సంస్థ దీనిపై ఓ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం, రాత్రి వేళల్లో ఈ గ్రూపుకు సంబంధించిన పాకిస్తానీయులు టాక్సీలు, టేక్అవేలు నడుపుతూ అమ్మాలను టార్గెట్ చేసేవాళ్లు. పెద్ద నెట్వర్క్గా ఉన్న ఈ గ్రూపు మెంబర్లు లేట్ నైట్ బయటకు వచ్చే అమ్మాయిలపై దృష్టి పెట్టేవాళ్లు. 2014లో, ఇంగ్లాండ్లోని రోథర్హామ్లో ఇది పెద్ద కుంభకోణంగా బయటపడింది. 1997-2013 మధ్య కనీసం 1400 మంది ఆడపిల్లలు ఇలా బలయ్యారు.
గిఫ్ట్లు, మొబైల్ ఫోన్లు ఆశ చూపించి లోబరచుకోవడం
ఇందులో 11 సంవత్సరాల వయసున్న అమ్మాయిలను లైంగిక దోపిడీకి గురయ్యారని తెలిసింది. అయితే, స్థానిక అధికారులు ఈ నేరాలను సంవత్సరాలుగా పట్టించుకోలేదు. ఇంగ్లాండ్లోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ గ్రూప్ నెట్వర్క్లు బయటపడ్డాయి. అక్కడి నుండీ దీని తీవ్రత ప్రజల్లో చర్చకు వచ్చింది. రోథర్హామ్లో జరిగిన ఈ నేరాలపై స్వతంత్ర విచారణలో కూడా పూర్తి స్పష్టత వచ్చింది. 11 నుండి 13 సంవత్సరాల వయస్సు గల ఆడపిల్లలను కార్లు, టాక్సీలలో స్కూళ్ల నుండి బయటకు తీసుకెళ్లడం.. గిఫ్ట్లు, మొబైల్ ఫోన్లు ఆశ చూపించి ఇతర ప్రదేశాల్లో తెలియని పురుషులకు కలవడానికి తీసుకెళ్లేవారు.
రోథర్హామ్ కేసుల విజిల్బ్లోయర్ జేన్ సీనియర్
2019లో ది గార్డియన్ నివేదిక ప్రకారం, చాలా మంది బాధితులు డబ్బులు, డిజైనర్ డ్రస్లు, లగ్జరీ కార్ల వల్లనే ఆకర్షణకు గురైనట్లు తేలింది. అయితే, ఈ అమ్మాయిలను తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తూ వారు చెప్పిన పనులకు వాడుకునేవారని తెలిసింది. ఇక, ప్రాణాలతో బయటపడిన వారిని ఎలా బ్రెయిన్వాష్ చేశారో.. ఎంతో మంది బాధితులు తమ టీవీ ఇంటర్వ్యూల్లో కూడా పేర్కొన్నారు. అయితే, ఈ అమ్మాయిలు చిన్నతనంలో ఒక పెద్ద వ్యక్తితో సంబంధం పెట్టుకోవడాన్ని ఎలా సమర్థించుకున్నారో అనే అంశాన్ని, రోథర్హామ్ కేసుల విజిల్బ్లోయర్ జేన్ సీనియర్, తన పుస్తకం “బ్రోకెన్ అండ్ బెట్రేయిడ్”లో వివరించారు.
జేన్ సీనియర్ పుస్తకం “బ్రోకెన్ అండ్ బిట్రేయిడ్”
విలాసవంతమైన కార్లతో తిరుగడంతో చుట్టు పక్కల వాళ్లు ఆమెను చూసి, అసూయపడటం తనకు నచ్చేదనీ.. అందుకే, కొంత కాలం ఈ గ్రూపు మాయలో పడినట్లు ఆమె తెలిపారు. తర్వాత, ఈ అమ్మాయిలకు, క్రమంగా మద్యం, డ్రగ్స్ పరిచయం చేసి.. కొన్నాళ్లకు వాళ్లపై ఆధారపడేలా చేయడం ఈ గ్రూపు ప్లాన్గా తెలుస్తోంది. ఇలా క్రమంగా, ఆడపిల్లలను అక్రమ రవాణా చేసి, లైంగిక దోపిడీకి దిగేవారని తెలుస్తోంది.
ప్రే: మై ఫైట్ టు సర్వైవ్ ది హాలిఫాక్స్ గ్రూమింగ్ గ్యాంగ్
మరో బాధితురాలు కూడా తన భయంకరమైన అనుభవాన్ని”ప్రే: మై ఫైట్ టు సర్వైవ్ ది హాలిఫాక్స్ గ్రూమింగ్ గ్యాంగ్”లో రాసింది. నిజానికి, బాధితులకు సంబంధించిన ఇలాంటి డాక్యుమెంటెడ్ స్టోరీలు ఇప్పటికి చాలానే వచ్చాయి. ముఖ్యంగా, రోటర్హామ్లో గ్రూమింగ్ గ్యాంగ్ కేసులపై పలు నివేదికలు స్పష్టమైన ఆధారాలను వెల్లడించాయి. లైంగిక దోపిడీకి గురైన కొంతమంది యువతులు.. హింస, అత్యాచారం, సామూహిక అత్యాచారం, కిడ్నాప్, మాదకద్రవ్యాల వాడకం, మాదకద్రవ్యాల వ్యాపారం చేయడం, తుపాకీలు ఉన్న పరిస్థితులలో కూడా పోలీసులకు పట్టుబడినట్లు నివేదికలు ఉన్నాయి.
తుపాకీలు ఉన్న పరిస్థితులలో దొరికిన అమ్మాయిలు
అయితే, దొరికినప్పుడల్లా.. ఈ గ్యాంగ్ సభ్యులు పోలీసులకు ఏదో ఒక కథ అల్లి ఆమెను బయటకు తీసుకురావడం.. మళ్లీ, ఆమెతో అదే పని చేయించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఎవరైనా, తాము చెప్పినట్లు వినకపోతే.. తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరించేవారనీ… అలా, హత్యలు చేసిన సందర్భాలు కూడా ఈ కేసుల్లో కనిపించినట్లు బాధితులే స్వయంగా చెప్పిన ఇంటర్వ్యూలు ఉన్నాయి.
బాయ్ఫ్రెండ్స్ని లోబర్చుకొని అమ్మాయిల సమాచారం
ఈ గ్రూమింగ్ గ్యాంగ్లు ప్రేమ నటిస్తూ అమ్మాయిలను సజీవంగా కాల్చిన సందర్భాలు కూడా పలు నివేదికలు వెల్లడించాయి. ఈ గ్యాంగ్లు, అమ్మాయిలను ఆకర్షించడానికి తమ బంధువులను కూడా ఉపయోగించుకున్న సందర్భాలు ఉన్నాయి. వారి ద్వారా సమాచారం పొందడం.. ఒక్కోసారి వారి బాయ్ఫ్రెండ్స్ని లోబర్చుకొని అమ్మాయిల సమాచారం పొందేవారు. ఇలాంటి సందర్భాల్లో.. వీళ్లు అమ్మాయిలను స్వయంగా సంప్రదించేవారు కాదు.
అమ్మాయిలను తీసుకురాడానికి అబ్బాయిలకు ఎరగా డబ్బు
ఎవరో ఒకరి ద్వారా వాళ్లను ఈ రొంపిలోకి దింపి, ప్రారంభంలో పికప్ చేసుకోడానికి వాళ్ల వయసు అబ్బాయిలనే ఉపయోగించేవారు. అమ్మాయిలను వాళ్ల దగ్గరకు తీసుకురాడానికి ఈ అబ్బాయిలకు కూడా భారీగా డబ్బు చెల్లించేవారు. ఈ అబ్బాయిలు మాదకద్రవ్యాల డెలివరీతో సహా ఈ గ్యాంగ్ కోసం పనులు చేసేవాళ్లు.
టెల్ఫోర్డ్ ఉదాహరణతో అమ్మాయిలను లొంగదీసుకున్న వైనం
ఒక సందర్భంలో, లూసీ లోవ్ అనే బాధితురాలిని తాను నివశిస్తున్న టెల్ఫోర్డ్ ఇంట్లో తన టీనేజ్ సోదరి, తల్లితో పాటు సజీవ దహనం చేసారు. తనను చంపిది కూడా తనను గ్రూమింగ్ చేసి, ఆమెతో ఒక బిడ్డను కన్నవాడే. లూసీ లోవ్ హత్యకు గురైన సమయంలో రెండవసారి గర్భంతో ఉంది. లూసీకి కేవలం 12 సంవత్సరాల వయసులో టాక్సీ డ్రైవర్ అజార్ అలీ మెహమూద్ పరిచయం అయ్యాడు. తర్వాత, ఈ గ్రూమింగ్ ముఠాలు.. టెల్ఫోర్డ్ ఉదాహరణ చూపించి ఇతర అమ్మాయిలను లొంగదీసుకోవడం ప్రారంభించారు.
ఇంటిపై పెట్రోల్ బాంబు వేస్తామని బెదిరింపులు
ఒకవేళ, ఎవరైనా బాధితులు పోలీసులకు ఫోన్ చేస్తే.. గ్రూపు సభ్యులు ఇంటిపైన దాడికి దిగేవారు. కేసు వాపసు తీసుకోకపోతే, ఇంటిపై పెట్రోల్ బాంబు వేస్తామని బెదిరించేవారు. అయితే, ఇలాంటి నేరాలను పోలీసులు పెద్దగా పట్టించుకోకపోగా.. నిందితులుంటే ప్రాంతాన్ని “నిషేధించబడిన ప్రాంతం”గా గుర్తించి వదిలిపెట్టేవాళ్లు. 2006లో, కఠినమైన లైసెన్సులను అమలులోకి తీసుకువచ్చినప్పటికీ.. బాధితులపై శ్రద్ధ చూపించేవాళ్లు కాదు. కొందరు పోలీసులు నేరస్థులతో కలిసిపోయేవాళ్లనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇన్ని ఆధారాలు ఉండి కూడా బ్రిటన్ ప్రభుత్వం స్పందిచకపోవడాన్నే ఇప్పుడు అంతా ప్రశ్నిస్తున్నారు.
నేరస్థులతో కలిసిపోయిన కొందరు పోలీసులు
యూకేలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లీం ప్రజల నుండి నిరసనలు వస్తాయనే కారణంతోనే బ్రిటన్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పట్టించుకోవట్లేదనే అభిప్రాయం ఉంది. మరి, ఈ ఆరోపణల మధ్య ప్రధాని స్టార్మర్ పదవి పోతుందా లేదా అన్నది వేచి చూడాలి.