Mammootty:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఎలా అయితే పేరు సొంతం చేసుకున్నారో.. అటు మలయాళ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా మమ్ముట్టి (Mammootty )కూడా అంతే పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ.. తన సినిమాలతో పలు అరుదైన అవార్డులను కూడా దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటించిన ఒక చిత్రానికి అరుదైన గౌరవం లభించడంతో ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. మరి ఆ సినిమా ఏంటి? ఆ మూవీ అందుకున్న గౌరవం ఏంటి ? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా కేరళ ప్రభుత్వం 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డులలో మమ్ముట్టి నటించిన ‘భ్రమయుగం’ ఏకంగా నాలుగు విభాగాలలో సత్తా చాటింది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. లాస్ ఏంజిల్స్ లోని “అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్” లో భ్రమయుగం ప్రత్యేక ప్రదర్శనకు సిద్ధమయింది. ఈ ప్రదర్శనను వచ్చే ఏడాది అనగా 2026 ఫిబ్రవరి 12వ తేదీన ప్రదర్శించబోతున్నారు.” వేర్ ది ఫారెస్ట్ మీట్స్ ది సీ: ఫోక్లోర్ ఫ్రమ్ అరౌండ్ ది వరల్డ్ ” చిత్రోత్సవ శ్రేణి లో భాగంగా జరగబోతోంది. జనవరి 10 నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో ఆఖరి రోజున ఈ చిత్రాన్ని ప్రదర్శనకు ఉంచబోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం తెలియడంతో అటు అభిమానులు ఇటు సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేస్తూ మమ్ముట్టి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ చిత్రం విషయానికి వస్తే రాహుల్ సదాశివన్ రచన, దర్శకత్వం వహించగా.. కేరళ జానపద , కథల చీకటి యుగాల నేపథ్యంలో భక్తి, భయం, శక్తి మానవ బలహీనతలను ఆవిష్కరించిన ఘాడమైన అన్వేషణ, బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్లో చిత్రీకరించారు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. ముఖ్యంగా అద్భుతమైన సాంకేతికతో తెరకెక్కిన ఈ సినిమా విశేషమైన విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. కోడుమోన్ పోట్టి పాత్రలో మోహన్ లాల్ నటించారు. సిద్ధార్థ భరతన్, అర్జున్ అశోకన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
also read:Nagababu: మాట నిలబెట్టుకున్న మెగా బ్రదర్.. బాబాయ్ కల నెరవేర్చారుగా!
17వ శతాబ్దపు కేరళలో ఒక జానపద గాయకుడు బానిసత్వం నుండి తప్పించుకొని పురాతన భవంతులోకి వెళ్తాడు. అక్కడ అతడికి ఒక వంటవాడు, అతని యజమాని కనిపిస్తారు. వారిని కలవడంతో అతడి జీవితమే మారిపోతుంది. అలా పీరియాడిక్ హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా 2024 ఫిబ్రవరి 15న మలయాళంలో విడుదలైంది. ఇక తెలుగుతోపాటు ఇతర భాషలలో 2024 ఫిబ్రవరి 23న రిలీజ్ చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి స్పందనను సొంతం చేసుకుంది. మమ్ముట్టి నటన, ఈ సినిమా కథనం కూడా ప్రశంసలు అందుకున్నాయి. విడుదలకు ముందు కేరళలోని ఒక బ్రాహ్మణ వర్గం తమ ప్రతిష్టను కించపరిచినందుకు ఈ చిత్రానికి వ్యతిరేకంగా కేసులు కూడా దాఖలు చేసింది. అందుకే సినిమా విడుదలకు ముందు మమ్ముట్టి పాత్ర పేరు కూడా మార్చారు.