Jagtial Congress: జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్లో కొత్త పంచాయతీ మొదలైంది. ఇంతకాలం పెద్దదిక్కుగా ఉన్న మాజీ మంత్రి జీవన్రెడ్డి కాంగ్రెస్కు గుడ్బై చెప్పడం, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడంతో కొత్త, పాత కాంగ్రెస్ నాయకుల పంచాయతీ ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానికి కొత్త తలనొప్పులు తీసుకువస్తోందంట.. కొత్తవారికి పదవుల్లో ప్రాధాన్యత ఇస్తే పాత కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారంట ..మొదటి నుండి కాంగ్రెస్ లో ఉన్నవారికి పదవులు ఇస్తే సంజయ్ వెంబడి వచ్చినవారు చిన్నబుచ్చుకుంటారంట .. ఇప్పుడు ఈ పదవుల పంచాయితీ కాస్తా జగిత్యాల నుండి సీఎం వద్దకు చేరడంతో పరిష్కారం ఎలా ఉండబోతుందనేది ఆసక్తి రేపుతోంది
ఇంతకాలం ఒకే తాటిపై ఉన్న జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో సరికొత్త సమస్య మొదలైయ్యింది… ఇప్పటి దాకా మజీ మంత్రి జీవన్ రెడ్డి వెన్నంటి ఉన్న వారిలో కొంతమంది కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్కుమార్ కాంగ్రెస్ బాట పట్టిన నాటి నుంచి అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి కారెక్కడానికి రెడీ అయ్యారు. అయితే కొత్త నాయకత్వం తమను గుర్తించడం లేదని ఇంతకాలం జీవన్ వెంట నడిచినకాంగ్రెస్ శ్రేణుల్లో ఆవేదన మొదలైందంట. తాము జీవన్ రెడ్డితో వెళ్లవద్దని అదిష్టానం పెద్దలు ఒప్పించారని, ఇప్పుడు మాత్రం తమను పట్టిం చుకునే వారే లేకుండా పోయారని, నామినేటెడ్ పదవులు కట్టబెడ్తామని మాట ఇచ్చినప్పటికీ ఆచరణలో మాత్రం కొత్త రక్తానికే అవకాశం ఇస్తున్నారన్న ఆందోళన స్థానిక నాయకుల్లో వ్యక్తం అవుతోంది.
మునిసిపల్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలప్పుడు జీవన్ రెడ్డి మద్దతులో గెలిచిన తొమ్మిది మంది కౌన్సిలర్లు జీవన్ రెడ్డితో వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు వారితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులను పట్టించుకునే వారే లేకుండా పోయారని అంటున్నారు. మునిసిపల్ కో ఆప్షన్ సభ్యుల పదవులను కూడా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తన అనుచరులకే ఇప్పించుకునేందుకు మొగ్గు చూపుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యే సన్నిహితులకే కో ఆప్షన్ పదవులు కట్టబెట్టాలన్న ప్రతిపాదనలు సిద్దమయ్యాయని తమకు గుర్తింపు లేకుండా పోయిందని వారు వాదిస్తున్నారు.
జీవన్ రెడ్డి వర్గానికి చెందిన తాము స్వత్రంత్రులుగా గెలిచినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నా తమను పట్టించుకునేవారు లేకుండా పోయారని తొమ్మిది మంది కౌన్సిలర్లు వాపోతున్నట్టుగా తెలుస్తోంది. సంజయ్ అనుచరులకు మాత్రమే అన్నింటా ప్రాధాన్యత లభిస్తోందని, ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో తమ పరిస్థితి ఏమిటని వారు తర్జనభర్జనలు పడుతున్నట్టుగా సమాచారం. ఈ నేఫథ్యంలో తమపై జరుగుతున్న వివక్ష గురించి పార్టీ సీనియర్ల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది.
జగిత్యాలలో నెలకొన్న పరిణామాలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి, పీసీపీ అధ్యక్షుడు దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తోంది. మంత్రి అడ్లూరితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. దాంతో జగిత్యాల నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు సీఎం అపాయింట్ మెంట్ ఇచ్చారంట. జగిత్యాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ కు వెళ్ళి తమ సమస్యలని, తమకి జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినప్పడు అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారంట.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకులను సీఎం వద్దకు తీసుకెళ్లేందుకు రంగం సిద్దం చేశారు. పెద్ద ఎత్తున తరలివెళ్ళానని భావించిన చివరి నిమిషంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చక్రం తిప్పి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ క్యాన్సల్ చేపించడంతో నిరాశగా వెనుదిరిగారంట.. ఈ నెల 20న బీఅర్ఎస్ అధినేత కేసీఅర్ సమక్షంలో జీవన్ రెడ్డి, మరియు అయన అనుచరులు పెద్ద ఎత్తున గులాబీ కండువా కప్పుకోవాలని ఫిక్స్ అయిన నేఫధ్యంలో ఇప్పుడు జీవన్ రెడ్డి వెంబడి ఇన్ని రోజులు నడిచిన కాంగ్రెస్ నాయకులని కాంగ్రెస్ పెద్దలు ఎలా బుజ్జగిస్తారో.. ఎలాంటి పదవులు ఇస్తారో చూడాలి.
Also Read: కారు, వాటర్ ట్యాంకర్ ఢీ.. స్పాట్ లో తండ్రి, కొడుకు
Story by: Apparao, Big Tv