Bhairipuram Village: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం భైరిపురం.. ఇదొక సాధారణ పచ్చని గ్రామం. కానీ, ఇక్కడి సంప్రదాయం మాత్రం అసాధారణం. దేశంలో ఎక్కడ ఎన్నికలొచ్చినా ప్రచారాలు, రాజకీయ కక్షలు కామన్. కానీ భైరిపురంలో మాత్రం సీన్ పూర్తి రివర్స్. దశాబ్దాలుగా ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. గ్రామస్తులంతా కలిసికట్టుగా ఒకే వ్యక్తిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. పోటీకి తావులేకుండా ఐకమత్యమే తమ బలంగా మలుచుకున్నారు.
ఈ ఊరిలో కళింగ, యాదవ, సామంతులు, ఎస్సీ ఇలా ఎన్నో కులాల కుటుంబాలు నివసిస్తున్నాయి. కులాలు వేరైనా అందరిదీ ఒకే మాట.. ఒకే బాట! గ్రామంలో ఏ చిన్న సమస్యొచ్చినా ఎవరి మీదో కక్ష కట్టడం, పోలీస్ స్టేషన్కు పరుగెత్తడం ఇక్కడ అసలే జరగదు. గ్రామ పెద్దల సమక్షంలో అందరూ కూర్చుని, సామరస్యంగా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుంటారు. అందుకే ఇప్పటివరకు కవిటి పోలీస్ స్టేషన్లో ఈ ఊరిపై ఒక్కటంటే ఒక్క క్రిమినల్ కేసు కూడా నమోదు కాలేదు.
Aklso read: BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!
ఎన్నికల ఖర్చులు, పోటీలు లేకపోవడంతో ప్రభుత్వ నిధులన్నీ నూటికి నూరు శాతం గ్రామాభివృద్ధికే అందుతున్నాయి. వీధుల్లో మురుగునీరు నిలవకుండా పక్కా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కేవలం రోడ్లు, భవనాలే కాదు.. ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రతకు కూడా పెద్దపీట వేశారు. రాజకీయాలకు, కులాలకు అతీతంగా ఊరి కోసం ఒక్కటిగా నిలబడితే అభివృద్ధి ఎంత వేగంగా సాగుతుందో భైరిపురం చేసి చూపిస్తోంది. ఎన్నికలంటే వైరుధ్యాలు కాదని, ఐకమత్యమే నిజమైన గెలుపు అని చాటుతూ ఉద్దాన ప్రాంతానికే ఆదర్శంగా నిలుస్తోంది ఈ పచ్చని ఊరు.
Also read: శుద్ధీకరణ పేరిట దళితులపై అవమానం.. ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు!