ORR Accident: ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఘోర రోడ్డు ప్రమాదం ఒక నిండు కుటుంబాన్ని చిదిమేసింది. చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ను వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో తండ్రి, రెండున్నరేళ్ల కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
హన్మకొండ జిల్లా కేంద్రానికి చెందిన కాటంగూరి వేద ప్రకాష్ రెడ్డి (37) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆదివారం హన్మకొండలో జరిగిన దేవుడి పండగకు హాజరయ్యేందుకు ఆయన తన కుటుంబంతో కలిసి ఊరికి వచ్చారు. వేడుక ముగిశాక, మంగళవారం తిరిగి బెంగళూరుకు ప్రయాణమయ్యారు. కారులో వేద ప్రకాష్ రెడ్డితో పాటు ఆయన భార్య హిమబిందు, కుమారుడు అర్జున్, కజిన్ దుర్గాప్రసాద్ రెడ్డి, ఆయన భార్య శ్రీజ ఉన్నారు.
కారు ఘట్కేసర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు పైకి చేరింది. పెద్ద అంబర్పేట్ సమీపానికి రాగానే, అక్కడ రోడ్డు పక్కన ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ను వేద ప్రకాష్ నడుపుతున్న కారు బలంగా ఢీకొట్టింది. కారు వేగంగా ఉండటంతో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది.
ఈ భీకర ప్రమాదంలో వేద ప్రకాష్ రెడ్డి , ఆయన చిన్నారి కుమారుడు అర్జున్ తీవ్ర గాయాలతో స్పాట్లోనే మరణించారు. కారులో ఉన్న మిగిలిన హిమబిందు, దుర్గాప్రసాద్, శ్రీజలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: రేవంత్ రెడ్డి ఫార్ములానే కరెక్ట్.. సీట్ల పెంపుపై కేంద్రానికి చామల కొత్త డిమాండ్!