
Congress News Today(Telugu news updates): కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వచ్చింది. ఇదే స్ఫూర్తిని మిగతా రాష్ట్రాల్లోను కొనసాగించాలని భావిస్తోంది. మరో ఆరు నెలల్లో జరగబోయే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. ప్రియాంక గాంధీ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణేనా?
కర్నాటక గెలుపులో మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, సిద్ధు, డీకే వ్యూహాలు పని చేసినా.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్నాటకలో కాంగ్రెస్కు టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవాలి. అప్పటి వరకు ఆధిపత్య పోరుతో సతమతం అవుతున్న నేతల్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు రాహుల్. పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపారు. అలాగే ప్రజలకు భరోసా కల్పించడంలోనూ రాహుల్ యాత్ర బాగా ఉపయోగపడింది. బీజేపీ మత రాజకీయాల్లో విధ్వేషాలు నింపుతోందని.. తాను దేశాన్ని ఏకం చేసేందుకే యూనిటీ యాత్ర చేస్తున్నానని ప్రజల్లోకి వెళ్లారు రాహుల్.
మొన్న హిమాచల్ ప్రదేశ్, నేడు కర్నాటకలో గెలుపుతో కాంగ్రెస్ వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. పార్టీ ఉనికే ప్రమాదంలో పడిన పరిస్థితుల్లో ఈ రెండు విజయాలు కాంగ్రెస్కు సంజీవనిగా చెప్పుకోవచ్చు. ఐతే ఈ రెండు విజయాల్లోనూ ప్రియాంక గాంధీ పాత్ర కీలకం అనే చెప్పాలి. ఒంటరి పోరాటం చేస్తున్న అన్నకు అండగా నిలిచారు ప్రియాంకగాంధీ. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను స్వయంగా పర్యవేక్షించారామె. కర్నాటకలోను అంతే. డీకే శివకుమార్, సిద్దరామయ్య వర్గాలు చేతులు కలపడంలో ప్రియాంక వ్యూహం ఉంది. బలమైన నాయకత్వం ఉండి.. అసంతృప్తులతో దెబ్బ తగులుతున్న విషయాన్ని ప్రియాంక గ్రహించారు. తొలి నుంచీ రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారం చేసారు ప్రియాంకగాంధీ. హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారామె.
కర్నాటక తర్వాత ప్రియాంక గాంధీ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అనే చెప్పాలి. ఇక్కడి పార్టీ వ్యవహారాలను స్వయంగా ఆమే పర్యవేక్షిస్తున్నారు. అందుకే కర్నాటక ఎన్నికల ఇలా అయిపోయిందో లేదో.. తెలంగాణకు షిఫ్ట్ అయ్యారు. సరూర్నగర్ లో కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన యువ సంఘర్షణ సభలో పాల్గొన్నారు. యూత్ డిక్లేరేషన్ ప్రకటించి.. నిరుద్యోగులకు అండగా ఉన్నామనే భరోసా కల్పించారు. అలాగే పార్టీ అంతర్గత విభేదాలను పక్కన పెట్టి పని చేయాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తే గెలుపు తథ్యమనే నమ్మకం కల్పించారు. విజయం కోసం కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు ప్రియాంక.
కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు, రాహుల్ దూకుడు, ప్రియాంక చరిష్మా.. బీజేపీతో పాటు బీఆర్ఎస్నూ టెన్షన్కు గురి చేసే అంశాలే. కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్లానే.. తెలంగాణలో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అత్యంత బలమైన నాయకుడు. అంతాతానై కర్నాటకలో పార్టీని గెలిపించారు డీకే. రేవంత్ సైతం టి.కాంగ్ను పరుగులు పెట్టిస్తున్నారు. రేవంత్రెడ్డికి రాహుల్ గాంధీ ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రేవంత్ను స్టార్ క్యాంపెయినర్గా ప్రకటించి.. ఆయన కోసమే ప్రత్యేకంగా ఓ హెలికాప్టర్ కూడా అరేంజ్ చేసింది అధిష్టానం. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిని చేసి మరింత బాధ్యతలు కట్టబెట్టింది. ఇదంతా రాహుల్ ఆశీస్సులతోనే సాధ్యమైంది.
కర్నాటకలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది హైకమాండ్. అందుకే, ఎన్నికల సంగ్రామంలో ఆయన బాహుబలిలా పోరాడారు. పార్టీకి ఘన విజయం సాధించి పెట్టారు. సేమ్ టు సేమ్.. తెలంగాణలోనూ కర్నాటక స్టైట్ రిపీట్ చేయాలని భావిస్తోంది అధిష్టానం. రేవంత్రెడ్డిలో మరో డీకే శివకుమార్ను చూస్తోంది. రాహుల్ సపోర్ట్కు ప్రియాంక చొరవ కూడా తోడవడంతో.. తెలంగాణలో రేవంత్ను ముందుంచి.. కర్నాటక తరహా గెలుపు సాధించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
తాజాగా, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, సరూర్ నగర్ సభ సక్సెస్తో ప్రియాంక గాంధీని సైతం మెప్పించారు రేవంత్రెడ్డి. సీనియర్లు కాస్త సహకరిస్తే.. ఈ దూకుడు ఇలానే కంటిన్యూ అయితే.. తెలంగాణలోనూ కర్నాటక తరహా ఫలితాలు పక్కా అంటున్నారు. గెలుపుపై కాంగ్రెస్ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. కర్నాటకలో అవినీతి సర్కారును గద్దెదించినట్టుగానే.. తెలంగాణలోనూ కేసీఆర్ అవినీతి పాలనకు చెక్ పెడతామని సవాల్ చేస్తున్నారు రేవంత్రెడ్డి.