Shabad Murders: రాక్షస రాజ్ కుమార్ భయోగ్రఫీ చెప్పే జీవిత పాఠమేంటి? అతడి జూదాల వ్యవహారమేంటి? ఒక టీచర్, మరో మైనర్ తో సాగించిన ప్రేమ కామ కలాపాల పర్యావసానమేంటి? మొత్తంగా అతడి ఆత్మహత్య చెప్పే ఆత్మకథ ఎలాంటిది? తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది.. రంగారెడ్డి జిల్లా షాబాద్ ఆరుగురి హత్యల కేసు. కేవలం ఆ ఊరు వాళ్లు, ఆ బంధు మిత్రులే కాదు. యావత్ తెలుగు సమాజం చలించిపోయిందీ ఘటనను చూసి. ఎవరైనా ప్రత్యర్ధులను చంపుతారు. తన భార్యా పిల్లల్ని కూడా హతమార్చడమేంటి? అన్న చర్చోపచర్చలు చేశారు తెలుగు వారు.
14 ప్రత్యేక బృందాలతో గాలింపు..
నిందితుడు రాజ్కుమార్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. జూలై 13న రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం, పెంజర్లలోని ఒక వెంచర్ ప్రాంతంలో అతని మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. మృతదేహం పక్కనే విషం సీసాలు కూడా లభ్యమయ్యాయి. ఇది పోలీసుల ఎన్కౌంటర్ గానీ వారు చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది గానీ కాదు. ఇది రాజ్ కుమార్ చేసుకున్న ఆత్మహత్యే అనడానికి బలమైన సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలు లభించాయి. ఆరు హత్యలు చేసిన వెంటనే రాజ్కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు 14 ప్రత్యేక బృందాలతో గాలిస్తుండగానే, అతడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు కనుగొన్నారు.
రాజ్కుమార్ సెల్పీ వీడియో..
ఇక రాజ్కుమార్ సెల్ఫీ వీడియో ఏం చెబుతోంది? ఇది ప్రీప్లాన్డేనా? అని చూస్తే.. ఈ ఘాతుకం వెనుక ముందస్తు ప్రణాళిక దాగి ఉందని తేల్చారు పోలీసులు. రాజ్కుమార్ మృతదేహం లభ్యమైన చోటే అతని మొబైల్ ఫోన్ కూడా దొరికింది. అందులో జూలై 10వ తేదీ సాయంత్రం 4:55 గంటలకు- అంటే, ఆరు హత్యలు చేయడానికి కొన్ని గంటల ముందే రికార్డ్ చేసిన 2 నిమిషాల 26 సెకన్ల సెల్ఫీ వీడియో దొరికింది. తాను ఒక అమ్మాయిని, అంటే మైనర్ బాలిక కుటుంబాన్ని నమ్మి సర్వస్వం కోల్పోయానని, తన సంపాదన మొత్తం- ఆ కుటుంబానికే ఖర్చుపెట్టి అప్పులపాలయ్యానని రాజ్కుమార్ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
రాజ్ కుమార్ని పోలీసులే చంపేశారా..?
షాబాద్ ఆరు హత్యలు చేసిన రాజ్ కుమార్ చనిపోయాడా? లేక అతడ్ని పోలీసులే చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారా? రాజ్ కుమార్ మరణం వెనక దాగిన రహస్యమేంటి? ఆ వివరాలు ఎలాంటివి? ఇది అతడి స్వయంకృతాపరాధమా? లేక పోలీసుల తప్పు కూడా ఉందా? ఆ కుటుంబం తన దగ్గర డబ్బులు లాక్కుంది. చివరికి తనపైనే అక్రమంగా పోక్సో కేసు పెట్టి జైలుకు పంపాలని చూసింది. ఆ మానసిక క్షోభ భరించలేకే తాను వారిని హతమార్చబోతున్నట్లు ముందే రికార్డ్ చేశాడు రాజ్ కుమార్. అందరినీ చంపేసి, చివరగా తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని ఈ వీడియోలో చెప్పాడు రాజ్ కుమార్. నా డెడ్ బాడీని అనాథలా కాల్చేయాలని కూడా కోరాడు. అంతేకాదు, ఒక బాండ్ పేపర్ మీద 4 పేజీల సూసైడ్ నోట్ సైతం రాశాడు.
Also Read: రెవెన్యూ బాధితులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు స్పెషల్ డ్రైవ్.. రంగంలోకి మంత్రి నారాయణ!
కమిషనర్ తరుణ్ జోషి వివరణ..
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి చెప్పిన దాన్నిబట్టీ చూస్తే.. ఈ కేసులో ప్రతీకారంతో పాటు ఆర్థిక కోణం కూడా దాగి ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్కుమార్ ఆన్లైన్ బెట్టింగ్లు, జూదానికి బానిసయ్యాడనీ.. దీనివల్ల భారీగా అప్పులు చేశాడని అంటారు పోలీసులు. ఈ అప్పుల బాధ, మానసిక ఒత్తిడికి తోడు… సదరు మైనర్ బాలిక కుటుంబం పెట్టిన పోక్సో కేసు వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయం అతడిని ఉన్మాదిగా మార్చాయని అంటారు అధికారులు.
రాజ్ కుమార్ బెయిల్.. ఇరవై లక్షల డీల్..
ఇది రాజ్ కుమార్ స్వయంకృతాపరాధమా? లేక పోలీసుల తప్పు కూడా ఉందా? అని చూస్తే.. ఇది ముమ్మాటికీ తనకు తాను చేసుకున్న ద్రోహమేనంటారు పోలీసులు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, అర్ధరాత్రి మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు.. ఏ పాపం ఎరుగని తన భార్య, 18 నెలల పసికందు సహా, ఇద్దరు బిడ్డలను కసాయిలా గొంతుకోసి చంపాడు. కాబట్టి అతడి రాక్షసత్వానికి ఎలాంటి సాకులు చెప్పలేం, చూపలేం అంటారు అధికారులు. రాజ్ కుమార్ కి బెయిల్ రావడం వెనక ఇరవై లక్షల డీల్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే షాబాద్ ఎస్సై దర్యాప్తు నిర్వీర్యం చేయడానికి గానూ- పదివేల లంచం తీసుకున్నట్టు తేలింది. దీంతో అతడ్ని సస్పెండ్ చేశారు జిల్లా ఉన్నతాధికారులు. ఇరవై లక్షల డీల్ వ్యవహారంపై పూర్తి విచారణ చేస్తామంటున్నారు పోలీసులు.
పోలీసులపై గ్రామస్తులు ఆరోపణలు..
మే నెలలోనే రాజ్ కుమార్ పై పోక్సో కేసు నమోదైంది. 7 ఏళ్ల లోపు మాత్రమే శిక్ష పడే సెక్షన్లు పెట్టారు. దీంతో నిందితుడు ఎంతో సులభంగా బెయిల్పై బయటకు వచ్చాడు. ఇంత వీక్ సెక్షన్లు పెట్టడంపైనా పోలీసుల చేతివాటం ఉందని అంటారు. నిందితుడి కదలికలపై నిఘా ఉంచడంలోనూ పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తారు గ్రామస్తులు. ఒక సమయంలో రాజ్ కుమార్ పోలీసుల అదుపులో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. రాజ్ కుమార్ మృతి వారి పనే. కావాలంటే క్రైమ్ స్పాట్ ని పరిశీలించండని.. అంటారు కొందరు. ఏది ఏమైనా రాజ్ కుమార్ ఆత్మహత్యకు పోలీసులకు సంబంధం లేదు. మొత్తంగా చూస్తే, అతడిది ఆత్మహత్యగానే పరిగణిస్తున్నారు.
Also Read: నీ బ్రతుకంతా అబద్ధాల పునాదే.. జగన్పై మంత్రి అచ్చన్నాయుడు ఫైర్!
రాజ్ కుమార్ లైఫ్ స్టోరీ..
రాజ్ కుమార్ కి బాలిక కుటుంబానికీ ఉన్న లావాదేవీలేంటి? బాలిక తండ్రి మరణానికీ రాజ్ కుమార్ కీ ఉన్న లింకేంటి? రాజ్ కుమార్ ఆర్ధిక స్థితిగతులేంటి? తనకన్నా పెద్దదైన ట్యూషన్ టీచర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే, మరి ఈ బాలికతో ప్రేమ వ్యవహారమేంటి? రాజ్ కుమార్ లైఫ్ స్టోరీ ఫుల్ డీటైల్డ్ వర్షన్ ఎలాంటిది? రంగారెడ్డి జిల్లా, షాబాద్లో జరిగిన ఆరుగురి సామూహిక హత్యల కేసు కేవలం ఒక ఉన్మాద చర్య మాత్రమే కాదు. దీని వెనుక తీవ్రమైన అప్పులు, వివాహేతర వేధింపులున్నాయి. వీటితో పాటు ఆన్లైన్ బెట్టింగ్లు, పగతో కూడిన భయంకరమైన కథనాల సమాహారం దాగి ఉన్నట్టు కనిపిస్తోంది. పోలీసుల దర్యాప్తు ప్రకారం, రాజ్కుమార్కు ఆ మైనర్ బాలిక కుటుంబంతో, ఆర్థిక లావాదేవీల కంటే ఎక్కువగా.. వన్ సైడ్ లవ్, వేధింపుల వివాదం ఉన్నట్టు తెలుస్తోంది.
రాజ్కుమార్పై ఫిర్యాదు..
రాజ్కుమార్ ఆ మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ చాలా కాలంగా వేధిస్తూ వచ్చాడు. మే 16న శంషాబాద్లోని ఒక ఎగ్జామ్ సెంటర్ దగ్గర బాలిక చేయి పట్టుకుని లాగి అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి ఆగడాలను బాలిక తల్లి అడ్డుకోగా, అతడు ఆమెను కూడా బెదిరించాడు. దీంతో బాలిక, ఆమె తల్లి షాబాద్ పోలీస్ స్టేషన్లో రాజ్కుమార్పై ఫిర్యాదు చేశారు. ఆరోజే అతడిపై పోక్సో కేసు నమోదైంది. మే 26న నిందితుడ్ని అరెస్టు చేశారు పోలీసులు. జూన్ 12న ముందస్తు బెయిల్ లభించింది. జూలై 10న అతడు విడుదలయ్యాడు.
బాలిక తండ్రి మరణం వెనుక రాజ్కుమార్ హస్తం..
బెయిల్పై బయటకు వచ్చిన రాజ్కుమార్.. తన పరువు- ప్రతిష్ట మొత్తం మట్టి కొట్టుకుపోయాయనీ ఫీలయ్యాడు. తనపై కేసు పెట్టి అవమానించినందుకు ఆ బాలిక కుటుంబాన్ని అంతమొందించాలని కక్ష పెంచుకున్నాడు. ఇక బాలిక తండ్రి మరణానికీ, రాజ్కుమార్కూ ఉన్న లింకు ఏంటని చూస్తే, బాలిక తండ్రి మరణం వెనుక రాజ్కుమార్ హస్తం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు బాలిక కుటుంబ సభ్యులు.
2025 మార్చిలో బాలిక తండ్రి మరణించారు. అయితే, బాలిక తల్లి రాజ్కుమార్ను నిలదీసినప్పుడు, నీ మొగుడిని ఎలా చంపానో.. నిన్ను కూడా అలాగే చంపుతా అని అతడు బెదిరించాడని అంటారు- బాలిక మేనమామ. అప్పటివరకు గుండెపోటుతో చనిపోయాడనుకున్న బాలిక తండ్రిని, రాజ్కుమార్ కావాలని మద్యం తాగించి- ఆస్పత్రి పాలు చేసి చంపేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.
రాజ్ కుమార్ పై ఆర్థిక నేరాలు..
అయితే ఫ్యూచర్ సిటీ సీపీ- తరుణ్ జోషి ఈ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. బాలిక తండ్రి మరణం గుండెపోటు వల్ల సంభవించింది. ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నాలుగు రోజుల పాటు చికిత్స పొంది మరణించారు. ఆయన ఆస్పత్రి రిపోర్టులు ఇవే చెబుతున్నాయి. ఆ కుటుంబాన్ని భయపెట్టడానికే రాజ్ కుమార్ అలా బెదిరించి ఉంటాడని అంటారు అధికారులు. బయటికి సాధారణ క్యాబ్ డ్రైవర్గా కనిపించిన రాజ్కుమార్ వెనుక ఊహించని ఆర్థిక నేరాలు చాలానే ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్కుమార్ ఆన్లైన్ బెట్టింగ్లు, జూదం, మద్యానికి, డ్రగ్స్కు బానిసయ్యాడు. ఇందుకోసం ఏకంగా రూ. 2 కోట్ల వరకు అప్పులు చేసినట్టు చెబుతున్నారు.
Also Read: ఏవో శ్రీహరి హత్య కేసు.. నిందితుడు హరికృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్య
రాజ్ కుమార్ ది బలవంతపు పెళ్లి..
అప్పుల బాధ భరించలేక, చనిపోతానంటూ ఆత్మహత్య- నాటకాలు ఆడాడు రాజ్ కుమార్. దీంతో భయపడ్డ.. తల్లిదండ్రులు తమకున్న వ్యవసాయ భూమిని అమ్మేసి అప్పు తీర్చారు. అయినా అతడి వ్యసనాలు ఆగకపోవడంతో మళ్లీ సమస్యల సుడిగుండంలోకి జారిపోయాడని అంటారు బంధుమిత్రులు. రాజ్కుమార్ వ్యవహారశైలి మొదటి నుంచి శాడిస్టిక్గా, నేరపూరితంగా ఉండేదని చెప్పడానికి అతడి పెళ్లి కథే నిదర్శనంగా చెబుతారు. రాజ్కుమార్ ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో తనకు ట్యూషన్ చెప్పిన, ఆరేళ్లు పెద్దదైన సరిత అనే టీచర్ను ప్రేమ పేరిట వేధించాడు. ఆమెకు వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ చెడగొట్టి, తీవ్రంగా బెదిరించాడు. ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.
మైనర్ బాలికపై రాజ్ కుమార్ కన్ను..
పెళ్లయ్యాక కూడా రాజ్కుమార్ సరితను అప్పుల కోసం, జూదం కోసం శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఈ నరకం భరించలేక సరిత తన పుట్టింటికి వెళ్లిపోయింది. రాజ్కుమార్కు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైంది. దీంతో భార్యపై కూడా కక్ష పెంచుకున్నాడు. ఒకపక్క భార్య విడాకులు అడుగుతుండటం, మరోపక్క తాగుడు, డ్రగ్స్ అలవాట్ల బారీన పడ్డం.. షాబాద్కు చెందిన మైనర్ బాలికపై కన్నేసి వేధించడం కీలకంగా మారాయి. చివరకు ఆ వేధింపుల కారణంగా పోక్సో కేసు పెట్టించుకునే స్థాయికి దిగజారాడు.
తనపై కేసు పెట్టారనే కక్ష ..
తనపై కేసు పెట్టారనే కక్ష ఒకవైపు, భార్య విడాకులు అడుగుతోందనే కోపం మరోవైపు… రాజ్కుమార్ను ఒక మృగంలా మార్చేశాయి. జూలై 10- అర్ధరాత్రి అతడు వేసిన మల్టిపుల్ మర్డర్ స్కెచ్ ఏకంగా ఆరుగురి దుర్మరణాలకు దారి తీసింది. ఆరోజు రాత్రి మొదట- దైవలగూడలోని తన నివాసానికి వెళ్లాడు. ఇంట్లో నిద్రిస్తున్న తన భార్య సరిత, తన కన్నబిడ్డల గొంతు కోసి కిరాతకంగా చంపాడు రాక్షస రాజ్ కుమార్.
అందరినీ చంపేశా.. నేను కూడా చనిపోతున్నా..
ఆ తర్వాత కారులో.. 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాబాద్ పట్టణానికి చేరుకుని, పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక ఇంటిపై దాడి చేశాడు. ఇంట్లోని బాలిక తల్లి, నానమ్మను నరికి చంపాడు. ఆ తర్వాత భయంతో వణికిపోతున్న మైనర్ బాలికను బలవంతంగా కారులో చెరువు దగ్గరకు లాక్కెళ్లి అక్కడ ఆమెను కూడా గొంతుకోసి చంపేశాడు. ఆరుగురిని చంపిన తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి, నేను అందరినీ చంపేశాను, నేను కూడా చనిపోతున్నానని చెప్పి పారిపోయాడు. మూడు రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగాడు. అతడు, చివరకు కొత్తూరు మండలం, పెంజర్ల శివార్లలోని ఒక వెంచర్లో పురుగుల మందు తాగి శవమై తేలాడు. దీంతో ఈ భయంకరమైన నరరూపరాక్షసుడి కథ ఒక ముగింపు తీసుకుంది.