PoK Protests: పీఓకేలో ప్రజా తిరుగుబాటు తీవ్రరూపం దాల్చింది. దశాబ్దాలుగా పాకిస్తాన్ అబద్ధాల పునాదులపై నిర్మించిన ఆజాద్ అనే భ్రమను అక్కడి ప్రజలు పూర్తిగా బద్దలు కొడుతున్నారు. జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వ్యాపారులు, విద్యార్థులు, లాయర్లు రోడ్లపైకి వచ్చి.. పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.
పాక్ రాజకీయ కుట్రపై పోరాటం..
నిజానికి ఇది కేవలం మౌలిక వసతుల కోసం జరుగుతున్న పోరాటం మాత్రమే కాదు.. దీని వెనుక దశాబ్దాల పాక్ రాజకీయ కుట్రపై జరుగుతున్న పోరాటం. ముజఫరాబాద్ అసెంబ్లీలోని మొత్తం 53 సీట్లలో 12 సీట్లను స్థానికులకు కాకుండా, దశాబ్దాల క్రితం పాకిస్తాన్ లోని వివిధ ప్రావిన్సులలో స్థిరపడిన శరణార్థుల కోసం కేటాయించారు. కశ్మీర్ సెంటిమెంట్ను వాడుకుంటూ పాకిస్తాన్.. దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్న శ్రీనగర్ విముక్తి అనే నరేటివ్ను నిరసనకారులు పూర్తిగా తిరస్కరించారు. తమను అణచివేస్తూ పక్కనున్న శ్రీనగర్ గురించి మాట్లాడటం పాక్ కుట్రకు నిదర్శనమని నినదిస్తున్నారు.
Also Read: రైల్వే ఏసీ కోచ్ల్లో భారీ దొంగతనాలు.. రూ.104 కోట్ల నష్టం!
మెుబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ నిలిపివేత..
ఈ నిరసనలను అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం క్రూరమైన చర్యలకు దిగుతోంది. JAAC కమిటీని ఉగ్రవాద నిరోధక చట్టం కింద నిషేధించి, వందలాది మంది యాక్టివిస్టులను, కవరేజ్ చేస్తున్న జర్నలిస్టులను అరెస్ట్ చేసింది. శాంతియుతంగా జరుగుతున్న ప్రదర్శనలపై పారామిలట్రీ దళాలు జరిపిన కాల్పుల్లో డజన్ల కొద్దీ నిరసనకారులు మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ దారుణాలను ప్రపంచానికి తెలియకుండా దాచడానికి పాక్ యంత్రాంగం PoK వ్యాప్తంగా మొబైల్ నెట్వర్క్లను, ఇంటర్నెట్ను పూర్తిగా నిలిపివేసి సమాచార వ్యవస్థను నిర్బంధించింది.
బ్లాకౌట్ విధించిన ఆగని ఉద్యమం..
అయితే, బ్లాకౌట్ విధించినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగిపోలేదు. ఇతర దేశాల్లో నివసిస్తున్న కశ్మీరీ వలసదారులు భారీ ర్యాలీలు చేపట్టి పాక్ అరాచకాలపై గ్లోబల్ యాక్షన్ తీసుకోవాలని యూఎన్ఓని డిమాండ్ చేస్తున్నారు. అటు బ్రిటన్ పార్లమెంట్లోనూ దీనిపై మాట్లాడారు. మరి ఈ ప్రజా విప్లవం పాక్ పతనానికి దారి తీస్తుందా? లేక ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
Also Read: ఊర్లో లేరా? ఫామ్ ఇవ్వలేదా? అయితే వెంటనే ఈ పని చేయండి.. లేదంటే ఓటు గల్లంతే!