Indian Railways: రైలు ప్రయాణం అంటేనే మనకు బోలెడన్ని జ్ఞాపకాలు, మరెన్నో సరదాలు గుర్తొస్తాయి. కానీ కొందరు ప్రయాణికులు మాత్రం ప్రయాణంతో పాటు రైల్వే ఆస్తులను కూడా సొంతం చేసుకుని అధికారులకు షాక్ ఇస్తున్నారు. ఇటీవల వెల్లడైన ఒక ఆర్టీఐ నివేదిక ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఇండియన్ రైల్వేస్లోని ఏసీ కోచుల్లో ప్రయాణించే వారు.. రైల్వే సమాన్లను భారీగా నొక్కేస్తున్నారనే నగ్న సత్యం ఈ నివేదిక ద్వారా బయటపడింది. ఏకంగా వందల కోట్ల రూపాయల విలువైన బెడ్షీట్లు, దుప్పట్లు మాయమవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
నాలుగేళ్లలో రూ.104 కోట్ల నష్టం!
జనవరి 2022 నుంచి మే 2026 మధ్య కాలంలో ఏసీ కోచుల్లో ప్రయాణించిన వారు ఏకంగా 1.27 కోట్లకు పైగా దుప్పట్లు, తువ్వాళ్లను తమ బ్యాగుల్లో సర్దేసుకున్నట్లు ఆర్టీఐ లెక్కలు చెబుతున్నాయి. దేశంలోని 18 రైల్వే జోన్లలో 16 జోన్ల పరిధిలోని 54 డివిజన్ల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఈ దొంగతనాల వల్ల లినెన్ కాంట్రాక్టర్లకు రూ.104 కోట్లకు పైగా భారీ నష్టం వాటిల్లింది. ప్రతి వెయ్యి మంది ప్రయాణికుల్లో ఒకరు ఏదో ఒక వస్తువును దొంగిలిస్తున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read: ఊర్లో లేరా? ఫామ్ ఇవ్వలేదా? అయితే వెంటనే ఈ పని చేయండి.. లేదంటే ఓటు గల్లంతే!
టవల్స్కే మొదటి ప్రాధాన్యం
సాధారణంగా ఏసీ కోచ్లలో ప్రయాణించే వారికి రెండు బెడ్షీట్లు, ఒక బ్లాంకెట్, దిండు, దిండు కవర్, ఒక ఫేస్ టవల్ ఉన్న బెడ్రోల్ కిట్ను రైల్వే సిబ్బంది అందిస్తారు. అయితే దొంగిలించిన వస్తువుల జాబితాను పరిశీలిస్తే.. ప్రయాణికులు ఎక్కువగా ‘ఫేస్ టవల్స్’ దొంగిలించడానికే మొగ్గు చూపినట్లు తేలింది. ఇవి బ్యాగుల్లో పెట్టడానికి సులభంగా ఉండటంతో దొంగతనాల్లో ఇవే మొదటి స్థానంలో నిలిచాయి.
భారం కాంట్రాక్టర్లదే!
రైల్వే నిబంధనల ప్రకారం.. కోచ్ల లోపల ఉండే బెడ్రోల్స్ సంరక్షణ బాధ్యత అంతా వాటిని పంపిణీ చేసే కాంట్రాక్ట్ ఏజెన్సీదే. వస్తువులు కనిపించకుండా పోతే, వాటి స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేసే ఆర్థిక భారం పూర్తిగా సదరు కాంట్రాక్టరే భరించాల్సి ఉంటుంది. దీంతో ఈ భారీ నష్టం రైల్వే అధికారులకు, కాంట్రాక్టర్లకు పెద్ద ఆందోళనగా మారింది. ఈ తరహా ఉచిత బుద్ధులను అరికట్టేందుకు, ప్రయాణికుల్లో అవగాహన పెంచేందుకు రైల్వే శాఖ ఇప్పుడు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రయాణికులు బాధ్యతగా నడుచుకోకపోతే భవిష్యత్తులో ఈ సేవలపై ప్రభావం పడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.
Also Read: క్యాబ్ డ్రైవర్ టు నరరూప రాక్షసుడు.. తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన షాబాద్ హంతకుడి ఆత్మకథ!