Telangana Politics: అత్యంత సీనియర్ లీడర్లు వాళ్లు.. ఒకే జిల్లాకు చెందిన ఆ ఇద్దరు కీలక నేతలకు మంత్రి పదవులతో పాటు.. జిల్లా ఇంచార్జ్ పదవులు కూడా దక్కాయి. కానీ ఏం జరిగిందో ఏంటో తెలియదు.. సడెన్గా వారి ఇంచార్జ్ పదవులు ఊడాయి. దీనికి కారాణాలేంటన్న దానిపై అధిష్టానం క్లారిటీ ఇవ్వలేదు.. నేతలు నోరు మెదపడం లేదు. ఇంతకీ వారి తొలగింపు వెనకున్న రీజన్స్ ఏంటి? ఎవరా ఇద్దరు సీనియర్ నేతలు?
పది ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జ్లుగా పది మంది మంత్రులు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. అందులో ఒకటి జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులను నియమించడం. మొత్తం పది ఉమ్మడి జిల్లాలకు పది మంది మంత్రులకు ఇంచార్జ్ మంత్రిగా బాధ్యతలను సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. లేటెస్ట్గా ముగ్గురు మంత్రులు క్యాబినెట్లోకి రావడంతో.. పాత వారిలో ముగ్గురు మంత్రులకు ఇంచార్జ్ బాధ్యతల నుంచి పక్కన పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖను ఏ జిల్లాకు ఇంచార్జ్గా నియమించలేదు. ఇదే ఇప్పుడు అనేక అనుమానాలకు, రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెర లేపింది.
ప్రతి కీలకమైన పనికి ఇంచార్జ్ మంత్రి ఆమోదం
ఈ ఏడాదిన్నర కాలంగా ఇంచార్జ్ మంత్రి ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గ డెవలప్ మెంట్ ఫండ్స్ కూడా ఇంచార్జ్ మంత్రి కనుసన్నల్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఇలా ప్రతీ కీలకమైన పనికి ఇంచార్జ్ మంత్రి ఆమోదం ఉంటుండటంతో..ఆ పోస్ట్కు ఫుల్ ప్రియారిటీ పెరిగిందనే చెప్పాలి. అందుకే ముగ్గురు మంత్రులకు ఏ జిల్లా బాధ్యతలు ఇవ్వకుండా ఎందుకు పక్కన పెట్టారనేది పొలిటికల్ సర్కిల్స్లో సీరియస్ డిస్కషన్స్ మొదలయ్యాయి.
సీఎం స్థానానికి సైతం పోటీపడిన ఉత్తమ్, కోమటిరెడ్డి
తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవి త్యాగం చేసి మళ్లీ కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాకే మంత్రిగా బాధ్యతలు చేపడతానన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అదే మాట నిజమైంది కూడా. ఇక పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ తరువాత రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పగించారు. ఒక దశలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి స్థానానికి పోటి పడిన వ్యక్తులు. సీఎం రేవంత్ రెడ్డి కేబినేట్లో కీలకశాఖలో మంత్రులుగా కొనసాగుతున్నారు ఈ ఇద్దరు నేతలు. కరీంనగర్ ఇంచార్జ్ మంత్రిగా ఉత్తమ్, ఖమ్మం జిల్లా ఇంచార్జ్గా కోమటిరెడ్డి కొనసాగుతూ వచ్చారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయులుగా ఉన్న వీరిని ఇంచార్జ్ మంత్రులుగా నియమించడం అదనపు గౌరవం లాంటిది. కానీ ఒక్కసారిగా ఇద్దరు ఇంచార్జ్లను తొలిగించడం అందరిని ఆశ్చర్యపరిచింది.
ఉమ్మడి ఏపీలోని ఇంచార్జ్గా కొనసాగిన కోమటిరెడ్డి
ఇంచార్జ్ మంత్రులుగా పని చేయడం ఈ ఇద్దరు నేతలకు కొత్తేమి కాదు. ఉమ్మడి ఏపీలోను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంచార్జ్ మంత్రిగా పని చేశారు. అధిష్టానం వద్ద వీర విధేయుడిగా ఉన్న ఉత్తమ్ నుంచి ఇప్పటికీ కీలక విషయాల్లోనూ సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకుంటారు. అలాంటి సీనియర్ మంత్రులను పక్కనపెట్టి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన వారికి ఇంచార్జ్ మంత్రులు కట్టపెట్టింది అదిష్టానం. సీనియర్లను.. అందులోనూ నల్లగొండ జిల్లా వారినే పక్కన పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తొలగింపుపై స్పందించని అధిష్టానం, మంత్రులు
అసలు ఈ ఇద్దరిని పక్కన పెట్టడానికి కారణమేంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ అంశంపై అటు అధిష్టానం.. ఇటు మంత్రులు.. ఎవ్వరు స్పందించలేదు. చాలా వరకు పని ఒత్తిడి కారణంగా పక్కన పెట్టారనే చర్చ కొనసాగుతోంది. కానీ అందులో వాస్తవం లేదని తెలుస్తోంది. నిజంగా పని ఒత్తిడే కారణమైతే ఇప్పటివరకు మంత్రులు ఎప్పుడో బయట చెప్పేవారు. కాని ఎందుకు తొలిగించారో వారికి కూడా తెలియని పరిస్థితి అనే టాక్ వినిపిస్తోంది. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పని ఒత్తిడి ఉందనుకుందాం. కానీ మంత్రి కోమటిరెడ్డి సంగతేంటనే ప్రశ్న తెరపైకి వస్తోంది.
Also Read: వృద్ధాప్యంలో విలాసవంతమైన జీవనం: హెలికాప్టర్ సౌకర్యంతో తెలంగాణలో అత్యాధునిక వృద్ధాశ్రమం
అదనంగా మరో జిల్లాకు ఇంచార్జ్గా నియమించినా పనిచేస్తాననే కోమటి రెడ్డి
ఎందుకంటే కోమటిరెడ్డి పాలిటిక్స్లో ఫుల్ యాక్టివ్గా ఉంటారు. ఉన్న జిల్లాతో పాటు.. అదనంగా మరో జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా కేటాయించిన బాధ్యతలు నిర్వహిస్తానని చెప్తారు. అలాంటి నేతకు పని ఒత్తిడి అనే కారణం చెప్పి పక్కన పెట్టే సీన్ అయితే కనిపించడం లేదు. మంత్రి ఉత్తమ్ కూడా పని ఒత్తిడే కారణంగానే తొలిగిస్తే ఈ పాటికి ఎప్పుడో ప్రకటన చేసేవారు. కారణం ఏదైనా వారిని తొలగించడంతో ఈ ఇద్దరు సీనియర్ నేతలు పైకి మాట్లాడకున్నా.. లోపల మాత్రం రగిలిపోతున్నారని తెలుస్తోంది. మరి అధిష్టానం దీనిపై ఏమైనా ప్రకటన చేస్తుందా లేక వీరే ఎక్కడైనా బ్లాస్ట్ అవుతారా? అనేది చూడాలి.
Story By Vamshi Krishna, Bigtv Live