Varudu Kalyani: ఏపీ శాసన మండలిలో వైసీపీకి కాకలు తీరిన రాజకీయ నాయకులు ఉన్నా వైసీపీ పరువును మాత్రం ఓ లేడీ మెంబర్ కాపాడుతుంది. తొలిసారి శాసనమండలిలో అడుగు పెట్టినా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అధికార పక్షాన్ని సైతం ఇరుకున పెట్టే విధంగా వైసీపీ వాయిస్ బలంగా వినిపిస్తూ సబ్జెక్ట్ బేస్డ్గా మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఆ లేడీ మెంబర్.. ఆమె మాట్లాడుతున్న తీరుపట్ల వైసిపి సీనియర్ నాయకులు సైతం అవాక్కవుతున్నారు. భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే ఆ మహిళా మెంబర్ కు మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదన్న టాక్ ఆ పార్టీలో వినిపిస్తుండటం విశేషం.. ఇంతకీ ఎవరా లేడీ ఎమ్మెల్సీ?
మండలిలో వాగ్దాటితో ఆకట్టుకుంటున్న వరుదు కల్యాణి
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనమండలిలో ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న పేరు వరుదు కళ్యాణి.. శాసనసభకు ముఖం చాటేసి శాసనమండలిని నమ్ముకున్న వైసీపీకి ప్రస్తుతం ఆమె ధ్రువ తారలా కనిపిస్తున్నారు. వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చాలామంది బలమైన లేడీ లీడర్లు ఉన్నారు. అధికారం మనదే కదా అని రెచ్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడి అధికారం కోల్పోయిన తర్వాత దాదాపుగా సైలెంట్ అయిపోయారు.
వైసీపీకి రిజైన్ చేసిన వాసిరెడ్డి పద్మ, పోతుల సునీత
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటికి మాత్రమే పని చెప్పిన వాసిరెడ్డి పద్మ, పోతుల సునీత, రోజా లాంటి వాళ్ళు పవర్ పోగానే సైలెంట్ అయిపోయారు. వాసిరెడ్డి పద్మ, పోతుల సునీత వంటి ఫైర్ బ్రాండ్లు వైసీపీ నుండి రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోయారు. ఇంకా పార్టీలో కొనసాగుతున్న మాజీ మంత్రులు రోజా, తానేటి వనిత వంటి వాళ్ళు అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తున్నారు తప్ప అధికారంలో ఉన్నప్పుడు కనిపించిన దూకుడు ఇప్పుడు లేదు. ఇక మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి పూర్తిగా సైలెంట్ అయిపోయి అసలు వైసీపీలో ఉన్నారో లేదో అని సందేహపడేలా వ్యవహరిస్తున్నారు.
వైసీపీకి ఆశాదీపంలా కనిపిస్తున్న వరుదు కళ్యాణి
ప్రస్తుతం వైసీపీలో సీనియర్ మహిళా నాయకులు కరువైన తరుణంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆ పార్టీకి ఆశాదీపంగా ఫోకస్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు వరుదు కళ్యాణి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.. వైసీపీలో ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా ఆమె ఎవరో చాలామందికి తెలియదు అంటే ఆశ్చర్యపోరాల్సిన అవసరం లేదు.2001 సంవత్సరంలో టిడిపిలో జాయిన్ అయినా వరుదు కళ్యాణి శ్రీకాకుళం జిల్లా సారవకోట జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. 2009లో పీఆర్పీలో జాయిన్ అయి ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా గెలిచిన కళ్యాణి
పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత కల్యాణి 2012లో వైసీపీలో జాయిన్ అయ్యారు. ఉత్తరాంధ్రలో పార్టీపరంగా వివిధ పదవులను నిర్వహించిన ఆమె 2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా పోటీకి సిద్ధమై చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు. 2021 నవంబర్లో వచ్చిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు.
బొత్స తప్ప వాయిస్ వినిపించే నేతలు కరువు
ఏపీ శాసనమండలిలో ఉన్న నాయకుల్లో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ తప్ప ఆ పార్టీ వాయిస్ వినిపించే నేతలే లేరు. అయితే కళ్యాణి శాసనమండలిలో తన వాడైన మాటలతో అందర్నీ ఆకర్షిస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో ఆమె విజృంభిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా మీడియా సైతం ఆమెకు ప్రయారిటీ ఇస్తుంది. మండలిలో బలమైన గళం వినిపించడంతోపాటు ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నించడం, గవర్నర్ ప్రసంగంలోని లోపాలను ఎత్తి చూపిస్తూ కూటమి నేతలను కూడా ఆశ్చర్యపరస్తున్నారు.
మంత్రి నారా లోకేష్ కు గట్టిగా బదులిచ్చిన కళ్యాణి
ఉద్యోగాల కల్పనపై గవర్నర్ చేసిన ప్రసంగంలోని లోపాలను సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఎఫెక్టివ్గా ప్రశ్నించలేక పోయారు. దాంతో మైకు అందుకున్న వరుదు కల్యాణి సూటిగా ప్రశ్నించారు. అదే విధంగా తెలుగు-ఇంగ్లీషు మీడియంపైన చర్చ వచ్చినప్పుడు మంత్రి నారా లోకేష్కు గట్టిగా బదులిచ్చారు. ఇక్కడ రాజకీయాలతో పనిలేకుండా ఒక సభ్యురాలిగా ఆమె చూపిన దూకుడు, సంధించిన ప్రశ్నలు పరిగణనలోకి తీసుకుంటే వైసీపీకి బలమైన నాయకురాలు లభించినట్టు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో సైతం కల్యాణికి నెటిజన్ల నుంచి బలమైన సపోర్టు లభిస్తుండటం విశేషం. ఈరోజు నుంచి మేము మనస్పూర్తిగా మీ ఫ్యాన్ గా మారిపోయామని నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. కూటమి పార్టీల్లోనూ వరుదు కళ్యాణిపై చర్చ సాగుతుండడం గమనార్హం.
మంత్రి అనితతో ఢీ అంటే ఢీ అంటున్న కళ్యాణి
శాసన మండల్లో ఒక లేడీ మెంబర్ గా ఉన్న వరుదు కళ్యాణికి ఇప్పటివరకు ఎలాంటి గుర్తింపు లేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో తన వాడైన మాటలతో ఎక్కడ తగ్గకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత లాంటి వారితో ఆమె ఢీ అంటే ఢీ అంటుండటం సీనియర్లను ఆకట్టుకుంటోందంట. మీడియా ముందు మాట్లాడినా శాసనమండలిలో మాట్లాడిన ఎక్కడా మాట తూలకుండా, అసభ్య పదజాలం వాడకుండా అత్యంత చాకచక్యంగా మాట్లాడుతున్నారు. పాయింటు టూ పాయింటు మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న వరుదు కళ్యాణికి రానున్న రోజుల్లో వైసీపీ అధికారంలో కొస్తే మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉందని వైసీపీలోనే టాక్ వినిపిస్తుంది …మరి ఫ్యూచర్లో వరుదు కళ్యాణి పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతుందో చూడాలి.