శత్రువుకు జాతకం చూడమంటే ఇప్పుడే చస్తావన్నడంట… సేమ్ అట్లనే ఉంది కేటీఆర్ ఉపన్యాసం. సుద్దులు. నవ తెలంగాణ వాళ్లు పిలిచారు. తమ వార్షికోత్సవానికి. ఈ వేదిక మీద టీపీసీసీ చీఫ్ కూడా ఉన్నాడు. ఇంకే ముంది..? దంచి ఇడిసవెట్టిండు రామన్న. హితం పలకరా అంటే.. ఏదో అన్నట్టు ప్రతికా స్వేచ్చ మీద మాట్లాడమన్నందుకు ఆ నవ తెలంగాణ వాళ్ల మూతి మీదనే కొట్టినంత పనిచేసిండు.
ఒక్క ఆ పేపర్నే కాదు.. మొత్తం మీడియాను ఓ రౌండ్ అర్సుకున్నడు. అసలు మీడియా ఏడుంది? ఇంకా దానికో స్వేచ్చనా? మీరు ఇన్విస్టిగేషన్ జర్నలిజం చేస్తున్నారా? అని ప్రశ్నలు, ఆశ్చర్యాలు ఒలకబోశాడు ఆ వేదికగా. అంతే కాదు.. ఎవరు అధికారంలో ఉంటే వారి చేతుల్లోకి మీడియా వెళ్లిపోతుంది. అసలు నిజాలే రాయడం లేదు.. అన్నాడు.
అంటే పదేండ్లు కేసీఆర్ చేసింది అదే అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు సుద్దులు చెబుతున్నాడు. అప్పుడు మా మీద కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది.. ప్రగతి భవన్లో వందల బెడ్ రూంలు ఉన్నాయి. బంగారు పాయిఖానాలున్నాయని.. మరి ఉన్నాయా? అని నిలదీసిన కేటీఆర్.. మీరె0దుకు వాస్తవాలు రాయలేదు.. అన్నాడు.
అందుకే మేము సోషల్ మీడియాను నమ్ముతున్నామని ప్రకటించిన కేటీఆర్.. అప్పుడు కాంగ్రెస్ ఇలా ఫేక్ ప్రచారాలు చేసింది కదా.. మేమూ అదే దారిలో పోతాం.. మీరు మీరు తేల్చుకోండి.. అవి నిజమైనవా..? అబద్దాలా? అంటూ కాంగ్రెస్ కు, మీడియాకు లింకు పెట్టి మాట్లాడిండు.
సారీ, క్షమించండి.. అంటూనే మీడియా ఉనికే లేదన్నాడు. మిమ్మల్ని ఎవడు పట్టించుకుంటున్నాడు అని హేళన చేశాడు. నేనైతే ఓడిన కాడ్నుంచి అసలు పేపరే చదవడం లేదని సిగ్గు విడిచేసినట్టుగా చెప్పేశాడు. టీవీలు కూడా చూడటం లేదట. తన సోషల్ మీడియాతో తన ప్రచారం చేసుకోవడానికి సమయం సరిపోవడం లేనట్టుంది బహుశా.
జెన్జీ యాభై శాతం ఓట్లేస్తారని చెప్పిన కేటీఆర్.. జంతర్ మంతర్ వద్ద చేసిన ఆందోళనను మెయిన్ మీడియా పట్టించుకోలేదని, అందుకే వారి నుంచి మీడియా పై కూడా వ్యతిరేకత వచ్చిందన్నాడు. మరి మనం పదేళ్లు పాలించినప్పుడు నిరుద్యోగుల అంశాన్ని గాలికెందుకు వదిలేసినట్టు..? ఎందుకు వారు కాంగ్రెస్ను గెలిపించేందుకు కాలికి బలపం కట్టుకుని తిరిగారు..?
ఈ మాట కేటీఆర్ ఉన్న వేదిక మీదే ఓ నిరుద్యోగి అన్నాడు మొన్న. మరి ఈ విషయంలో మీరేమైనా ఆత్మ విమర్శ చేసుకున్నారా? జెన్ జీ ఆందోళన మాకు మార్గదర్శకం అంటున్నావు సరే, మరి ఎలాంటి ఆందోళనలే అవసరం లేదని ధర్నా చౌక్ ఎత్తేసిన వైనాన్ని ఏమందాం? మీ తోలు మందం పరిపాలనకు అది గీటు రాయి అందామా? కళ్లు నెత్తికెక్కిన పాలనలో అప్పటి నిర్ణయాలని సరిపెట్టుకుందామా?
ఒక్కటి మాత్రం కన్ఫాంగా చెప్పాడు కేటీఆర్. మేము సోషల్ మీడియాలో జీవిస్తాం.. అందులోనే ప్రచారం చేస్తాం.. అవే మాకు ఓట్లేస్తాయి. అదే మమ్మల్ని సీఎం సీటు మీద కూర్చోబెట్టబోతుంది.. సీఎంగా కేసీఆర్ వచ్చి మరో మూడేళ్లలో మీ ప్రోగ్రాంకు హాజరవుతాడు.. అని ధీమాగా బల్లగుద్దినట్టుగా, మీడియా మీద అపనమ్మకంతో, సోషల్ మీడియా మీద అతి విశ్వాసంతో చెప్పి సక్కగా వేదిక దిగి వెళ్లిపోయాడు రామన్నా.
ఇదేందిరా బై .. పిలిచి మరీ మూతి పళ్లు రాలగొట్టిచ్చుకున్నట్టుంది.. అనుకున్నారట మన మీడియా మిత్రులు.