Minimum Balance Accounts: బ్యాంక్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు భారీగానే వసూలు చేస్తున్నారు. 2022-23 నుంచి 2024-25 వరకు మూడు ఆర్థిక సంవత్సరాల్లో కనీస బ్యాలెన్స్ లేని పబ్లిక్, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఖాతాదారుల నుంచి సుమారు రూ.19,000 కోట్లు వసూలు చేశాయి. సోమవారం లోక్సభలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ప్రైవేట్ రంగ బ్యాంకులు దాదాపు రూ.11,000 కోట్లు ఛార్జీలు వసూలు చేయగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.8,093 కోట్లు వసూలు చేశాయి.
ప్రైవేట్ బ్యాంకుల్లో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికంగా రూ. 3,872 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్ రెండో స్థానంలో ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 2020 నుంచి సేవింగ్స్ ఖాతాలలో కనీస బ్యాలెన్స్ జరిమానా ఛార్జీలను మాఫీ చేసింది. ఎస్బీఐను చూసి కెనరా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్బీతో పాటు మరో ఎనిమిది ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఏడాది నుండి సేవింగ్స్ అకౌంట్ లలో ఛార్జీలు తొలగించాయి. అయితే, కనీస బ్యాలెన్స్ లేకపోతే ప్రైవేట్ రంగ బ్యాంకులు భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఓ సభ్యుడి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోవడంతో వసూలు చేసి ఛార్జీలు రూ. 8,092.8 కోట్లు.. బ్యాంకుల మొత్తం ఆదాయంలో దాదాపు 0.2% గా ఉందని తెలిపారు. ఇటువంటి ఛార్జీలు బ్యాంకుల ఆదాయంలో చాలా తక్కువ భాగాన్ని మాత్రమే కలిగి ఉన్నాయన్నారు. ప్రధానంగా జరిమానాల ద్వారా ఆదాయ ఉత్పత్తి కంటే బ్యాంకింగ్ సేవలను అందించే ఖర్చుతో ఎక్కువన్నారు.
Also Read: మీ పిల్లల భవిష్యత్ కోసం 3 బెస్ట్ పెట్టుబడి పథకాలు
ప్రధానమంత్రి జన్ ధన్ పథకం కింద ఉన్న దాదాపు 72 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ లేకపోయినా.. ఎటువంటి జరిమానా విధించలేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్యాంకింగ్ సేవలు మెరుగుపర్చేందుకు, చిన్న డిపాజిటర్లను ప్రోత్సహించడానికి బ్యాంకులు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాలను అందిస్తున్నాయని ఆమె చెప్పారు.