Child Investment Plans: ఈ రోజుల్లో పిల్లలను పెంచాలంటే చిన్న విషయం కాదు. పిల్లల చదువులకే లక్షలు ఖర్చు అవుతున్నాయి. మన దేశంలో.. పిల్లలు పుట్టినప్పటి నుంచి యుక్త వయస్సుకు వచ్చే వరకు వారి అవసరాలు, చదువులకు రూ. 55 లక్షల నుంచి రూ. 85 లక్షల వరకు అవసరం కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పిల్లలను పెంచడానికి ఆర్థిక ప్రణాళిక అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లలను పెంచడంలో చదువు అతి పెద్ద బాధ్యత. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో పిల్లలను చదివించాలంటే రూ. 10-15 లక్షల మధ్య ఖర్చవుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ కోర్సులు, కోచింగ్ వీటన్నింటికీ లెక్కేసుకుంటే తల్లిదండ్రులు అదనంగా రూ. 15-25 లక్షలు పక్కన పెట్టాల్సిందే. చదువుతో పాటు పిల్లల జీవనశైలి ఖర్చులు కూడా అధికంగా ఉంటున్నాయి. గాడ్జెట్లు, పుట్టినరోజు వేడుకలు, సెలవులు, అభిరుచులు ఇలా.. పిల్లలు వయస్సుకు వచ్చే సరికి రూ. 10-15 లక్షల ఖర్చవుతుంది. మ్యూజిక్ పాఠాలు, స్పోర్ట్స్ శిక్షణ ఇలా… మరో రూ. 5-10 లక్షలు ప్రత్యేక అవసరాలు ఉంటున్నాయి.
పెరుగుతున్న ఖర్చులకు తగిన విధంగా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలంటే..తల్లిదండ్రులు వీలైనంత త్వరగా పెట్టుబడులను ప్రారంభించాలని ఎక్స్ పర్ట్స్ సిఫార్సు చేస్తున్నారు. పిల్లలు పుట్టడంతోనే SIP ప్రారంభించాలని సలహా ఇస్తున్నారు. ఉదాహరణకు పిల్లలు పుట్టగానే నెలకు రూ.5000 చొప్పున SIP చేస్తే వాళ్లకు 18 సంవత్సరాలు వచ్చే సరికి 12% వార్షిక రాబడితో లెక్కేస్తే రూ. 50 లక్షల ఆదాయం కనిపిస్తుంది. అందుకే పిల్లలు పుట్టగానే SIP, PPF (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) లేదా SSY (సుకన్య సమృద్ధి యోజన) వంటి స్కీమ్ లలో పెట్టుబడి పెట్టడం స్టార్ చేయాలంటున్నారు. దీంతో పాటు ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్ స్కీమ్ లలో పెట్టుబడి పెడితే అదనపు భద్రత ఉంటుంది.
15 నుంచి 20 ఏళ్ల దీర్ఘకాలిక పెట్టుబడితో సంపద భారీగా పెరుగుతుంది. అందుకే తల్లిదండ్రులు వీలైనంత త్వరగా పెట్టుబడులు స్టార్ చేయాలని ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు. గత ఐదేళ్లలో మ్యూచువల్ ఫండ్స్ వార్షిక రాబడి 12 శాతం కంటే ఎక్కువే ఉంది. స్థిరమైన ఆదాయం కోసం.. సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు ఉన్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి స్కీమ్ లలో పెట్టుబడి పెట్టవచ్చు. పీపీఎఫ్ ప్రస్తుతం 7.1% వడ్డీ రేటు అందిస్తోంది. ఈ పెట్టుబడులకు సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఆడపిల్లల ఆర్థిక భద్రత కోసం సుకన్య సమృద్ధి యోజన బెస్ట్ స్కీమ్. ఈ పథకానికి 8.2% అధిక వడ్డీ రేటును అందిస్తుంది కేంద్రం. 18 లేదా 21 సంవత్సరాలకు మెచ్యూరిటీ పొందవచ్చు. SSY పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఉంది.