దేశ ఆర్థిక వ్యవస్థను పర్యావరణహితంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల (EV) బ్యాటరీల తయారీ, సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తిపై భారీగా రాయితీలు ప్రకటించారు. ఈ నిర్ణయాలు దేశీయంగా తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
బ్యాటరీ స్టోరేజ్ కోసం ఉపయోగించే లిథియం-అయాన్ సెల్స్ తయారీకి అవసరమైన మూలధన వస్తువుల (Capital Goods)పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును వచ్చే ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. దీనివల్ల దేశంలో బ్యాటరీల ధరలు తగ్గి, ఎలక్ట్రిక్ వాహనాలు సామాన్యులకు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే, సోలార్ గ్లాస్ తయారీలో వాడే సోడియం యాంటీ మొనెట్’ దిగుమతిపై కూడా కస్టమ్స్ డ్యూటీని రద్దు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో బయో గ్యాస్ మిశ్రమ సీఎన్జీ (Biogas blended CNG)పై ఎక్సైజ్ సుంకం లెక్కించే విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. బయో గ్యాస్ విలువను పూర్తిగా మినహాయించి, కేవలం మిగిలిన మొత్తంపైనే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని వసూలు చేస్తామని మంత్రి తెలిపారు. ఇది సహజవాయువు వినియోగాన్ని పెంచడమే కాకుండా, స్థిరమైన ఇంధన వనరుల వినియోగానికి దారితీస్తుంది. క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ కోసం అవసరమైన యంత్రాల దిగుమతికి కూడా రాయితీలు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దేశ పారిశ్రామిక పురోగతిలో భాగంగా పూర్వోదయ రాష్ట్రాలకు, ఈశాన్య ప్రాంతాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. ఇందులో భాగంగా దుర్గాపూర్ను కేంద్రంగా చేసుకుని ఇంటిగ్రేటెడ్ ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కారిడార్ ద్వారా తూర్పు రాష్ట్రాల్లో భారీగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
ఐదు పూర్వోదయ రాష్ట్రాల్లో ఐదు ప్రధాన పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్ పేర్కొంది. అలాగే, ఈశాన్య రాష్ట్రాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి, పర్యావరణహిత ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి 4,000 కొత్త ఈ-బస్సులను (E-buses) మంజూరు చేశారు. బౌద్ధ మతానికి సంబంధించిన చారిత్రక ప్రదేశాలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులు కేటాయించారు. చివరగా, భారత్లోనే తయారవుతున్న లేదా అతి తక్కువగా దిగుమతి అవుతున్న వస్తువులపై ఉన్న కస్టమ్స్ మినహాయింపులను ప్రభుత్వం తొలగించింది.Union Budget 2026: కేంద్ర బడ్జెట్ – 2026 ఎఫెక్ట్.. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే.. ఫుల్ లిస్ట్ మీకోసం
ALSO READ: