Petrol Diesel Prices Update: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ఒడిదుడుకులు కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాన్య ప్రజలపై పడే ఇంధన ధరల భారాన్ని తగ్గించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది. గత కొన్ని రోజులుగా చమురు ధరలు పెరుగుతాయని వస్తున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెర దించింది.
వినియోగదారులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు గతంలోనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని (Excise Duty) తగ్గించిన విషయాన్ని కేంద్రంగుర్తు చేసింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, ఆ భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వమే భరిస్తోందని పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అయినప్పటికీ భారత్ తన వ్యూహాత్మక నిల్వలు, రష్యా నుండి రాయితీపై దిగుమతి చేసుకుంటున్న చమురు ద్వారా ధరలను స్థిరీకరించగలిగిందని ప్రభుత్వం వివరించింది.
ప్రస్తుతం భారతదేశం తన ఇంధన అవసరాల కోసం విభిన్న దేశాల నుండి ముడిచమురును సేకరిస్తోంది. చమురు శుద్ధి సంస్థలు నష్టాల్లో ఉన్నప్పుడు కూడా ధరలను పెంచకుండా ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని, ఇప్పుడు పరిస్థితులు అదుపులో ఉన్నాయని కేంద్రం తెలిపింది. భవిష్యత్తులో కూడా ఇంధన ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధరల భారాన్ని ప్రజల మీదకు నెట్టబోమని భరోసా ఇచ్చింది.
కేవలం పెట్రోల్, డీజిల్పైనే కాకుండా, దేశీయంగా ఇథనాల్ బ్లెండింగ్ (Ethanol Blending), ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల దీర్ఘకాలంలో ఇంధన ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రాలు కూడా తమ వంతుగా వ్యాట్ (VAT) తగ్గించి ప్రజలకు సహకరించాలని కేంద్రం మరోసారి విజ్ఞప్తి చేసింది.
Read Also: గాజువాక మౌనిక హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. నేవీ ఐడీ కార్డు ప్రాణం తీసిందా?