Gajuwaka Mounika Murder Case: విశాఖపట్నం జిల్లా గాజువాకలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసులో పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం ప్రేమ వ్యవహారం లేదా ఆర్థిక గొడవలే అనుకున్న ఈ కేసులో, మరో కీలక విషయం వెలుగుజూసింది. ఒక నేవీ ఐడెంటిటీ కార్డు (ID Card) మౌనిక ప్రాణాలు తీయడానికి ప్రధాన కారణమైందని పోలీసులు విచారణలో తేలింది. నిందితుడు రవీంద్ర ఒక నేవీ ఉద్యోగి కావడంతో, తన వృత్తిపరమైన భయం, మానసిక ఆందోళన అతడిని ఒక కిరాతక హంతకుడిగా మార్చాయని పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. రవీంద్ర, మౌనికల ప్రయాణం 2021లో మింగ్లి అనే డేటింగ్ యాప్ ద్వారా ప్రారంభమైంది. అప్పట్లో నేవీలో పనిచేస్తున్న రవీంద్రకు, మౌనికతో పరిచయం ఏర్పడి అది క్రమంగా సాన్నిహిత్యానికి దారితీసింది. గత మూడేళ్లుగా వీరిద్దరూ సన్నిహితంగా మెలిగారు. అయితే కాలక్రమేణా వీరి సంబంధంలో విభేదాలు తలెత్తాయి. రవీంద్రను మౌనిక డబ్బుల కోసం వేధిస్తోందని, బెదిరింపులకు పాల్పడుతోందని ప్రాథమిక విచారణలో రవీంద్ర చెప్పినప్పటికీ, దీని వెనుక అసలు రహస్యం నేవీ ఐడీ కార్డు అని ఇప్పుడు స్పష్టమైంది.
రవీంద్ర భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ డేగా (INS Dega) లో విధులు నిర్వహిస్తున్నాడు. డిఫెన్స్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు వారి ఐడెంటిటీ కార్డు అత్యంత కీలకం. రవీంద్రకు చెందిన ఈ నేవీ ఐడీ కార్డును మౌనిక తన ఆధీనంలోకి తీసుకుంది. ఆ కార్డును తన దగ్గరే పెట్టుకుని రవీంద్రను ఆమె బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది. రక్షణ రంగానికి చెందిన ఐడీ కార్డులు వేరే వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినా లేదా పోగొట్టుకున్నా, సంబంధిత ఉద్యోగిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు ఉండటమే కాకుండా, ఉద్యోగం కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
దీంతో రవీంద్ర తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు. తన ఐడీ కార్డును తిరిగి ఇచ్చేయాలని మౌనికను పలుమార్లు ప్రాధేయపడ్డాడు, హెచ్చరించాడు. కానీ మౌనిక ఆ కార్డును ఇవ్వడానికి నిరాకరించడంతో, ఐఎన్ఎస్ డేగాలో రవీంద్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలుపెట్టాడు. పై అధికారులకు సమాధానం చెప్పలేక, కార్డు లేనిదే విధుల్లోకి వెళ్లలేక అతడి మానసిక స్థితి పూర్తిగా దెబ్బతిన్నది. తన కెరీర్ నాశనం అవుతుందనే భయంతో, మౌనికను ఎలాగైనా వదిలించుకోవాలని, కార్డును దక్కించుకోవాలని రవీంద్ర పథకం రచించాడు.
పథకం ప్రకారం, ఐడీ కార్డు తీసుకుని తన ఇంటికి రావాలని మౌనికను రవీంద్ర పిలిచాడు. మౌనిక ఇంటికి వచ్చిన తర్వాత, రవీంద్ర ఆమెను కార్డు ఇవ్వాలని గట్టిగా అడిగాడు. అయితే ఆమె దగ్గర ఆ సమయంలో ఐడీ కార్డు లేకపోవడంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో రవీంద్ర ఆవేశంతో మౌనిక మెడను గట్టిగా నలిమివేశాడు. ఊపిరాడక మౌనిక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
హత్య జరిగిన తర్వాత రవీంద్ర భయంతో వణికిపోకుండా, తెలివిగా కేసు నుండి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు. మౌనిక మృతదేహాన్ని అలాగే బయటకు తరలిస్తే దొరికిపోతానని భావించి, కిరాతకంగా ఆమె శరీర భాగాలను మొక్కలు మొక్కలుగా కోశాడు. విచక్షణారహితంగా మృతదేహాన్ని ముక్కలు చేసి, వాటిని వేర్వేరు ప్రాంతాల్లో పారేయడం ద్వారా ఎవరికీ అనుమానం రాకుండా చేయాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే రవీంద్ర మానసిక స్థితి ఒక క్రూర మృగంలా మారిందని పోలీసులు విశ్లేషిస్తున్నారు.
Read Also: కీసరలో విషాదం.. భార్య వేధింపులతో డాక్టర్ ఆత్మహత్య