Online Gaming Authority: దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నగదుతో ముడిపడిన ఆన్లైన్ గేమ్లను నియంత్రిస్తూ గతేడాది పార్లమెంట్ ఆమోదించిన ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్’ అమలుకు సంబంధించి తాజాగా నిబంధనలను నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనలు మే 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఈ చట్టం ద్వారా ఆన్లైన్ బెట్టింగ్లు, జూదాలకు స్వస్తి పలికి, బాధ్యతాయుతమైన గేమింగ్ వాతావరణాన్ని తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ చట్టం అమలును పర్యవేక్షించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఒక శక్తివంతమైన ఆన్లైన్ గేమింగ్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ అథారిటీలో ఆరుగురు ఉన్నత స్థాయి అధికారులను సభ్యులుగా నియమించారు. ఛైర్మన్ గా కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఉండగా.. హోం శాఖ, ఆర్థిక వ్యవహారాలు, సమాచార ప్రసార శాఖ, యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ, న్యాయశాఖలకు చెందిన సంయుక్త కార్యదర్శులు ఇందులో సభ్యులుగా ఉంటారు.
ఏ గేమ్ చట్టబద్ధమైనదో, ఏది నిబంధనలను ఉల్లంఘిస్తోందో నిర్ణయించే అధికారం ఈ అథారిటీకే ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలతో కూడిన గేమ్ల విషయంలో ఈ అథారిటీ అత్యంత కఠినంగా వ్యవహరించనుంది. మనీ గేమింగ్ యాప్ల వల్ల సామాన్యులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు ఈ వ్యవస్థ రక్షణ కవచంగా పనిచేస్తుంది.
ఐటీ సెక్రటరీ ఎస్. కృష్ణన్ తెలిపిన వివరాల ప్రకారం.. నగదుతో సంబంధం లేని సాధారణ సోషల్ గేమ్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు. అయితే, ఈ-స్పోర్ట్స్ (E-sports) గేములు మాత్రం చట్టం ప్రకారం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఏదైనా గేమ్ ఆన్లైన్ మనీ గేమా, సోషల్ గేమా లేదా ఈ-స్పోర్ట్సా అని నిర్ధారించుకోవడం ప్రారంభంలో ఐచ్ఛికం అయినప్పటికీ, అథారిటీ సుమోటోగా విచారణ చేపట్టినప్పుడు లేదా ప్రభుత్వం నిర్దిష్ట గేమ్లను నోటిఫై చేసినప్పుడు వాటి గుర్తింపును తప్పనిసరిగా నిరూపించుకోవాల్సి ఉంటుంది.
వివిధ మంత్రిత్వ శాఖల సమన్వయంతో పనిచేసే ఈ అథారిటీ, ఆన్లైన్ గేమింగ్ సంస్థలు భారతీయ చట్టాలను పాటిస్తున్నాయా లేదా అని నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఈ నిర్ణయం వల్ల ఆన్లైన్ గేమింగ్ రంగంలో పారదర్శకత పెరగడమే కాకుండా, యువత వ్యసనాల బారిన పడకుండా రక్షణ లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
Read Also: తమిళనాడు పర్యటన కోసం ప్రధాని తన స్కిన్ టోన్ మార్చుకున్నారా?