Crude Oil Price Surge: పశ్చిమ ఆసియాలో నెలకున్న రాజకీయ ఉద్రిక్తతలతో.. క్రూడ్ ఆయిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని దిగ్బంధించడం, గల్ఫ్ దేశాల్లోని చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులతో అనిశ్చితి నెలకొంది. ఈ అంతరాలతో గురువారం ఫ్యూచర్స్ ట్రేడ్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు మరో రూ.74 పెరిగి రూ.9,067కు చేరుకుంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు సరఫరా కొరత ఏర్పడుతుందనే భయాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్కు 116 డాలర్లు దాటాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో ముడి చమురు ధర బ్యారెల్ ధర రూ.9,067కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 9.61 డాలర్లు పెరిగి ఫైనల్ గా 116.99 డాలర్లు చేరుకుంది. మిడిల్ ఈస్ట్ లోని చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులతో.. ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాలకు అంతరాయం కలుగుతోంది. ఖతార్ లోని రాస్ లఫాన్లోని గ్యాస్ కేంద్రంపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాస్ లఫాన్ లో భారీ నష్టం కలిగించాయని ఖతార్ పేర్కొంది. తమ రెండు చమురు శుద్ధి కర్మాగారాలపై టెహ్రాన్ దాడి చేసిందని కువైట్ తెలిపింది.
ఇరాన్లోని ప్రధాన గ్యాస్ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేయడం, ఇందుకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాల ఇంధన కేంద్రాలను లక్ష్యంగా దాడులకు పాల్పడడంతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గి హర్మూజ్ జలసంధి తిరిగి ప్రారంభమయ్యే వరకూ చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయు నిల్వల్లో ఒకటైన ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిపై వాషింగ్టన్కు ముందుగా ఎలాంటి సమాచారం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. గల్ఫ్ లో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండేందుకు ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని ట్రంప్ కోరారు. హర్మూజ్ జలసంధికి మూసివేయడంతో.. సౌదీ అరేబియా చమురు ఎగుమతుపై తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇరాన్ పరిమిత సంఖ్యలో నౌకలను అనుమతిస్తుండడంతో.. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. రానున్న రోజుల్లో చమురు సరఫరా నష్టాలు పెరుగుతాయని, ధరలు 120 డాలర్లకు పైగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.