PF ATM Withdraw: ఈపీఎఫ్ఓ సంస్కరణల నేపథ్యంలో.. పీఎఫ్ ఖాతా డబ్బులను ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకునే అవకాశం సౌకర్యం అందుబాటులోకి రానుంది. పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా కు ఇప్పటి వరకూ.. ఆన్లైన్ క్లెయిమ్ దరఖాస్తు, డాక్యుమెంట్ల ధృవీకరణ, క్లెయిమ్ అప్రూవల్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో పీఎఫ్ విత్ డ్రా తీవ్ర ఇబ్బంది ఉంటుంది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈపీఎఫ్ఓ కీలక మార్పునకు రెడీ అవుతోంది. 2026 నుంచి ఏటీఎం ద్వారా నేరుగా పీఎఫ్ నగదు విత్ డ్రా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు చేస్తుంది. దీనిపై ఈపీఎఫ్ఓ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఏటీఎం కార్డు తరహాలో ఈపీఎఫ్ఓ ప్రత్యేక కార్డును అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇది సాధారణ ఏటీఎం కార్డు మాదిరిగానే పనిచేస్తుంది. ఈ కార్డు సాయంతో ఏటీఎంలో పీఎఫ్ ఖాతా నుంచి నేరుగా నగదు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
పీఎఫ్ డబ్బులు ఉద్యోగుల సొంత సంపద అనే భావనతో, అత్యవసర సమయాల్లో ఆ నిధులను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఈపీఎఫ్ఓ బ్యాంకులు, ఆర్బీఐతో సంప్రదింపులు చేస్తోందని సమాచారం. ఇందుకు కావాల్సిన సాంకేతికతను అభివృద్ధి చేయనున్నారు.
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా 7 కోట్లకు పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. అత్యవసర పరిస్థితుల్లో కష్టపడి సంపాదించిన డబ్బును సులభంగా ఉపయోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈపీఎఫ్ఓ గణాంకాల ప్రకారం 2014లో చందాదారుల సంఖ్య 3.3 కోట్లు మాత్రమే ఉండేది. అప్పట్లో ఫండ్ విలువ దాదాపుగా రూ.7.4 లక్షల కోట్లు.
Also Read: ఈపీఎఫ్ ఉద్యోగికి ఉచిత బీమా.. రూ.7 లక్షల వరకూ కవరేజీ.. పూర్తి వివరాలు ఇలా
ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఫండ్ విలువ రూ.28 లక్షల కోట్లను దాటింది. ప్రతి నెలా సుమారు 7.8 కోట్ల మంది ఉద్యోగులు పీఎఫ్ డబ్బు తమ ఖాతాలో జమ చేస్తున్నారు. సభ్యుల సంఖ్య పెరగడంతో క్లెయిమ్ల నిర్వహణ ఈపీఎఫ్ఓకు ఒక సవాల్ గా మారింది. ఏటీఎం సదుపాయం అందుబాటులోకి వస్తే ఉద్యోగులకు సులభంగా డబ్బు లభిస్తుంది. ఈపీఎఫ్ఓ పై పని భారం కూడా తగ్గుతోందని భావిస్తుంది.