Swiggy Zomato Boycott| బెంగళూరులోని హోటల్, రెస్టారెంట్ యజమానులు స్విగ్గీ, జొమాటోపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ ఛార్జీలు, వివిధ రకాల కోతలు, డిస్కౌంట్ విధానాల కారణంగా వ్యాపారాలు నష్టపోతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆగస్టు 15 తర్వాత ఈ రెండు ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ల ద్వారా ఆర్డర్లు స్వీకరించబోమని హెచ్చరించారు.
బ్రుహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ (BBHA)తో పాటు ఇతర రెస్టారెంట్ సంఘాలు కలిసి స్విగ్గీ, జొమాటోకు అధికారికంగా వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాయి. తమ సమస్యలకు లిఖితపూర్వక హామీతో పాటు తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం కావాలని సంఘాలు ఆశిస్తున్నాయి.
రెస్టారెంట్ యజమానుల ప్రకారం ఫుడ్ డెలివరీ సంస్థలు ప్రతి ఆర్డర్పై 8 శాతం నుంచి 28 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తున్నాయి. దీనికి అదనంగా ప్రకటనల ఖర్చులు, పేమెంట్ గేట్వే ఛార్జీలు, యాప్లో కనిపించేలా చేసే ప్రచార రుసుములు కూడా చెల్లించాల్సి వస్తోంది. ఈ మొత్తం ఖర్చులు రెస్టారెంట్ల లాభాలను గణనీయంగా తగ్గిస్తున్నాయని, ఈ కారణంగా నష్టాలుగా కూడా చవిచూడాల్సి వస్తోందని చెబుతున్నారు.
కమిషన్ ఖర్చులను భరించేందుకు అనేక రెస్టారెంట్లు తమ మెనూ ధరలను పెంచాల్సి వస్తోందని యజమానులు అంటున్నారు. దీంతో అదే ఆహారం కోసం వినియోగదారులు ఎక్కువ ధర చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కమిషన్ రేట్లు తగ్గితే రెస్టారెంట్లతో పాటు వినియోగదారులకు కూడా ప్రయోజనం ఉంటుందని సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
కస్టమర్ ఫిర్యాదుల పేరుతో ఆటోమేటిక్గా డబ్బు కోతలు విధించకూడదని రెస్టారెంట్లు కోరుతున్నాయి. ఇప్పటికే ఆహారం సిద్ధం చేసిన తర్వాత ఆర్డర్ రద్దయితే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిసారి కోతకు సంబంధించిన పూర్తి వివరాలతో సెటిల్మెంట్ నివేదికలు ఇవ్వాలని, ఏకపక్ష ఒప్పంద నిబంధనలను తొలగించాలని కోరుతున్నాయి. ప్రతి రెస్టారెంట్కు ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్ను నియమించాలని కూడా సూచిస్తున్నాయి.
అదే విధంగా రెస్టారెంట్ అనుమతి లేకుండా డిస్కౌంట్ ఆఫర్లు లేదా ప్రమోషన్లు అమలు చేయకూడదని స్పష్టం చేశాయి. బలవంతపు డిస్కౌంట్లు తమ ఆదాయాన్ని మరింత తగ్గిస్తున్నాయని యజమానులు చెబుతున్నారు.
చిన్న స్థాయి రెస్టారెంట్లు ఈ విధానాల వల్ల ఎక్కువగా నష్టపోతున్నాయని సంఘాలు చెబుతున్నాయి. వివిధ రకాల కోతల కారణంగా తుది చెల్లింపులు ఎలా లెక్కించారో అర్థం చేసుకోవడం కష్టమవుతోందని యజమానులు అంటున్నారు. అందుకే పారదర్శకమైన చెల్లింపు విధానం అవసరమని వారు కోరుతున్నారు.
ప్రస్తుతం రాపిడో ఓన్లీ, ఫ్లిప్కార్ట్ ఫుడ్ డెలివరీ, ఓఎన్డీసీ ఆధారిత ప్లాట్ఫామ్లు మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. వీటి వల్ల పోటీ పెరిగి రెస్టారెంట్లకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని యజమానులు భావిస్తున్నారు.
రాపిడో ఓన్లీ ప్రస్తుతం జీరో కమిషన్ మోడల్లో పనిచేస్తుండగా, ఫ్లిప్కార్ట్ సుమారు 11 శాతం కమిషన్తో సేవలు ప్రారంభించే అవకాశం ఉందని సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ రేట్లు తమకు ఆమోదయోగ్యంగా ఉన్నాయని, అయితే కొత్త సంస్థలు పూర్తిస్థాయిలో విస్తరించేందుకు కొంత సమయం పడుతుంది.
Also Read: నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు
ప్రస్తుతం స్విగ్గీ, జొమాటోను వెంటనే వదిలేయాలని రెస్టారెంట్లకు సంఘాలు సూచించడం లేదు. ఈ రెండు ప్లాట్ఫామ్లకే ఇప్పటికీ అత్యధిక మంది వినియోగదారులు ఉన్నారని అవి అంగీకరిస్తున్నాయి. అందుకే ముందుగా చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నాయి.
ఆగస్టు 15లోపు స్విగ్గీ, జొమాటో నుంచి సానుకూల స్పందన రాకపోతే బెంగళూరులోని అనేక రెస్టారెంట్లు ఈ ప్లాట్ఫామ్ల ద్వారా ఆర్డర్లు స్వీకరించడం నిలిపివేయవచ్చు. అలాంటి నిర్ణయం తీసుకుంటే దేశంలోని అతిపెద్ద ఫుడ్ డెలివరీ మార్కెట్లలో ఒకటైన బెంగళూరులో వినియోగదారులు, రెస్టారెంట్ల, డెలివరీ సంస్థల బిజినెస్పై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది.
Also Read: ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేశాడు కట్ చేస్తే ఈ రోజు కోటీశ్వరుడు.. రోజుకు రూ.6.3 లక్షల ఆదాయం